Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విచారణ అధికారిగా డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరి
అ లేని భూమిని విక్రయించి 35శాతం బ్రోకరేజ్ తీసుకున్న రొయ్య శ్రీనివాస్
అ విచారణ అనంతరం తదుపరి చర్యలు
అ ఎస్పీ రంగనాథ్
నవతెలంగాణ -నల్లగొండ
దళిత యువకుడిని నల్లగొండ టూ టౌన్ పోలీసులు విచక్షణా రహితంగా కొట్టి కాలు విరగొట్టారని వస్తున్న ఆరోపణలు, ప్రసార మాధ్యమాలలో వార్తల నేపధ్యంలో సమగ్ర విచారణకు ఆదేశించినట్టు నల్లగొండ ఎస్పీ ఏవి. రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ వివాదంలో ఎస్ఐ జోక్యం చేసుకున్నాడని, దళిత యువకుడి పై విచక్షణా రహితంగా దాడి చేశారని వస్తున్న ఆరోపణల క్రమంలో సమగ్ర విచారణ కోసం డీటీసీ ఎస్పీ సతీష్ చోడగిరిని విచారణ అధికారిగా నియమించినట్టు తెలిపారు. విచారణలో పోలీస్ అధికారులు తప్పు చేసినట్లుగా నిర్ధారణ అయితే వారిపై చర్యలు తీసుకుంటామని వివరించారు. రొయ్య శ్రీనివాస్ నల్లగొండ పట్టణంలో లేని భూమిని కాగితాలపై ఉన్నట్లుగా చూపించి విక్రయించాడని, ఆ భూమిలో ఇల్లు నిర్మాణం చేసి ఉన్నదని బాధిత వ్యక్తులు జులై 6, 2021న టూటౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో రొయ్య శ్రీనివాస్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్టు తెలిపారు. చీటింగ్ కేసుకు సంబంధించి గత నెల 10వ తేదీన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్కు పిలిపించి నోటీసులు ఇచ్చినట్టు తెలిపారు. లేని భూమిని విక్రయం వ్యవహారంలో శ్రీనివాస్ 35శాతం కమిషన్ తీసుకున్నట్టుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని స్పష్టం చేశారు. శ్రీనివాస్తో పాటు అతనిపై ఫిిర్యాదు చేసిన బాధితుల నుండి సమగ్రంగా అన్ని వివరాలు సేకరించి పోలీసుల తప్పు ఉన్నట్టుగా నిర్ధారణ జరిగితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియో నల్లగొండది కాదు
ఎవరో ఒక వ్యక్తిని కాళ్లు కట్టేసి కొడుతున్నట్టుగా సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్న వీడియో నల్లగొండ టూ టౌన్ పోలీసులు రొయ్య శ్రీనివాస్ అనే వ్యక్తిని కొడుతున్నట్లుగా అసత్య ప్రచారం సాగుతుందని, ఆ వీడియో నల్లగొండ జిల్లాకు సబంధించినది కాదని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. తప్పుడు ప్రచారాలు, వైరల్ అవుతున్న వీడియోను ప్రజలు నమ్మవద్దని జిల్లా ప్రజలను కోరారు.