Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహాయ రిటర్నింగ్ అధికారి వి.చంద్ర శేఖర్
నవతెలంగాణ- నల్లగొండ
స్థానికసంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 10న జరగనున్నందున ఎన్నికల విధులకు కేటాయించబడిన పోలింగ్ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని నల్గొండ స్థానిక సంస్థల నియోజకవర్గం సహాయ రిటర్నింగ్ అధికారి, అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ పోలింగ్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు వచ్చిన పోలింగ్ అధికారులను ఉద్దేశించి అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ విధించిన నిబంధనల ప్రకారం, పోలింగ్ అధికారులు పొందిన శిక్షణ ప్రకారం ఎన్నికలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. 10న ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలని మైక్రో అబ్జర్వర్ లకు సూచించారు. పోలింగ్ ప్రారంభానికి ముందు పోటీ చేస్తున్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి చూపించాకే సీల్ చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు సెల్ ఫోన్లు తీసుకరా కూడదని సూచించారు. కోవిడ్ నిబంధనల ప్రకారమే పోలింగ్ ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ అధికారులు బస్సులో నేరుగా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలని, మధ్యలో ఎక్కడా కూడా ఆగవద్దని అన్నారు. బ్యాలెట్ బాక్సులను కంపార్ట్మెంట్లో పెట్టవద్దని, పోలింగ్ అధికారులకు ఎదురుగా పెట్టాలని సూచించారు. పోలింగ్ ముగిసాక బ్యాలెట్ బాక్సులను ఏజెంట్ల సమక్షంలో సీల్ చేసి బస్ లో బందోబస్తుతో నేరుగా నల్గొండ లోని జిల్లా మహిళా సమాఖ్య భవనం(డి.ఆర్.డి.ఓ కార్యాలయం)లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ కు తీసుకువచ్చి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, దేవరకొండ ఆర్డీఓ గోపిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావు, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన
జిల్లా మహిళా సమాఖ్య భవనంలో నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ హాల్,స్ట్రాంగ్ రూమ్,రిసెప్షన్ సెంటర్ ఏర్పాట్లను గురువారం అదనం కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు . భద్రతా పరమైన బందోబస్తు, ఇతర ఏర్పాట్లు పై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట నల్గొండ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి,దేవరకొండ ఆర్డీఓ గోపి రాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావు, డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, డీపీఆర్ఓ శ్రీనివాస్, తహసీల్దార్ నాగార్జునరెడ్డి ఉన్నారు.