Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న వెంకులు
నవతెలంగాణ -కేతేపల్లి
ఉపాధి కూలీలకు 200 పని దినాలు కల్పించి వచ్చే కేంద్ర బడ్జెట్లో రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బొజ్జ చిన్న వెంకులు డిమాండ్ చేశారు. కేతేపల్లి మండలం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశం కేతేపల్లి లోని అమరవీరుల స్మారక భవనంలో శనివారం చింతపల్లి లూర్దు మారయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో బొజ్జ చిన్న వెంకులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో వచ్చిన మార్పులు, యంత్రాలతో పనులు చేయడంతో కూలీల పని దినాలు బాగా తగ్గి ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనికి తోడు నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో జీవనోపాధి కష్టమై వలస బాట పడుతున్నారని అన్నారు. కావున ఉపాధి కూలీలకు 200 పని దినాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా చింతపల్లి లూర్దు మారయ్య, కార్యదర్శిగా చౌగొని నాగయ్య, ఉపాధ్యక్షులుగా వీరబోయిన చౌడయ్య, ఉప్పుల ఉపేందర్, సహాయ కార్యదర్శిగా కర్ర బాలయ్య, శ్రీపతి వెంకన్న, దొంతం లింగయ్య, కమిటీ సభ్యులు యాదమ్మ, దుర్గాం నాగరాజును ఎన్నుకున్నారు.