Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో చికిత్స
అ మొదటి దశ వ్యాక్సినేషన్ 99.83 శాతం పూర్తి
అ 70 శాతానికి చేరుకున్న రెండో దశ వ్యాక్సినేషన్
అ మంత్రి జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ చాంబర్లో కోవిడ్, ఒమిక్రాన్, వ్యాక్సినేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సినేషన్లో 99.83 శాతం, రెండో డోస్ వ్యాక్సినేషన్లో 70.53 శాతం పూర్తయిందని తెలిపారు.15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల యువతకు ఇప్పటికే 61.42 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వ్యాధిగ్రస్తులకు ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ 5995 మందికి వేసినట్లు తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి చెందకముందే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 614 కరోనా యాక్టివ్ కేసులు 3.08 శాతం ఉన్నాయని అన్నారు. 8 మంది మాత్రమే హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. ఒమిక్రాన్ ఎదుర్కొనేందుకు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రితో పాటు, ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీల్లో కోవిడ్ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ కోవిడ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కరోనా పరీక్షల కిట్లకు కొరత లేదని మంత్రి తెలిపారు. నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ నకిరేకల్ ఏరియా ఆసుపత్రిలో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు. నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డయాలసీస్ రోగులకు ప్రస్తుతం ఉన్న 10 పడకలకు మరో 10 పడకలు పెంచాలని కోరారు. మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు మాట్లాడుతూ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో డయాలసీస్ రోగులకు ప్రస్తుతం ఉన్న 5 బెడ్లకు మరో 5 బెడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. దేవరకొండ శాసన సభ్యులు రవీంద్రకుమార్ మాట్లాడుతూ దేవరకొండ ఏరియా ఆసుపత్రికి డయాలసీస్ యూనిట్ ఏర్పాటు చేయాలని కోరారు. దాంతో మంత్రి సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వ సూచనల ప్రకారం కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేెటర్లు, పడకలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, ఏరియా ఆసుపత్రులు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో అన్ని సౌకర్యాలని సిద్ధంగా ఉంచామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటి రెడ్డి, శాసన సభ్యులు గాదరి కిశోర్కుమార్, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కొండల్రావు, డీసీహెచ్ఎస్.డా.మాత, వైద్య అధికారులు పాల్గొన్నారు.