Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
నవతెలంగాణ-నల్లగొండ
జనవరి ఒకటి 2022 సంవత్సరం నాటికి 18 సంవత్సరీలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత ఎన్నికల సంఘం వ్యవస్థాపన దినోత్సవం రోజున 2011 నుంచి జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య పరిపాలన వ్యవస్థలో ఓటరుదే కీలకపాత్ర అని, దేశాభివృద్ధికి సుపరిపాలన అందించే మంచి నాయకున్ని ఎన్నుకునే అవకాశం ఓటర్లకు ఉందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ఎల్కక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ కార్యాలయాలలో ప్రదర్శిస్తారని, ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు. అనంతరం ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కొత్తగా ఓటరుగా నమోదు చేయించుకున్న యువతకు ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డులను అందజేశారు.
స్పెషల్ కేటగిరీ అవార్డులు అందజేసిన కలెక్టర్
ఇటీవల జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బంధీగా నిర్వహించినందుకు మిర్యాలగూడ ఆర్డీఓ, ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ రోహిత్ సింగ్ కు, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డీటీ విజరుకు రూ.15 వేల నగదుతో పాటు, అవార్డును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు. ఈ అవార్డును ఈ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ తన చేతుల మీదుగా వారికి అందజేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, వి.చంద్రశేఖర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ అపూర్వ్ చౌహన్, జెడ్పీసీఈఓ వీరబ్రహ్మ చారి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మోతీలాల్, సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, నల్గొండ తహసీల్దార్ నాగార్జున, ఎన్నికల డీటీ విజరు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.