Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) యాదాద్రిభువనగిరి జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ-రామన్నపేట
మతసామరస్యం, లౌకికవాదం, దేశ సమైక్యత కోసం ప్రాణత్యాగం చేసిన మహాత్మాగాంధీ వర్థంతి రోజును మతసామరస్య దినంగా నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎమ్డి.జహంగీర్ డిమాండ్ చేశారు.సీపీఐ(ఎం) ఆద్వర్యంలో ఆదివారం గాంధీ వర్థంతి సందర్భంగా మండలకేంద్రంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 30, 1948లో నాథూరామ్గాడ్సే మహాత్మాగాంధీని మతవిధ్వేషంతో దారుణంగా హత్య చేశాడన్నారు.గాంధీజీ దేశ స్వాతంత్రం కోసం అకుంఠిత దీక్షతో ఉద్యమం నడిపి స్వాతంత్య్ర సమరంలో కీలక భూమిక పోషించారన్నారు. దేశంలో ప్రజలంతా మతవిశ్వాసాలకు అతీతంగా కలిసి మెలిసి జీవించాలని గాంధీ కలలు కన్నారన్నారు.మత రాజ్యం కాకుండా సర్వమతాల సమాహారంగా ఉండే లౌకికదేశంగా భారతదేశం ఉండాలని కోరుకున్నారన్నారు.మతోన్మాద సిద్ధాంతంతో స్ఫూర్తి పొందిన గాడ్సే దేశానికి గాంధీజీ చేసిన సేవలను విస్మరించి ఆయన్ను దారుణంగా హతమార్చడం బాధాకరమన్నారు.ఆయన హత్యకు మత రాజకీయాలే కారణమని,దేశంలో ప్రస్తుతం మత రాజకీయాలు ఉచ్చస్థితికి చేరాయని ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన వర్థంతి రోజును మత సామరస్యదినంగా జరపండం ద్వారా మతోన్మాదాన్ని ఎదిరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు మేక అశోక్రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి మామిడి వెంకట్రెడ్డి, ఆవాజ్ నాయకులు మన్సూర్ అలీ, గన్నెబోయిన విజయభాస్కర్, అంబటి మల్లారెడ్డి, తొలుపునూరి శ్రీనివాస్, గోగు లింగస్వామి, మేడి మదుబాబు, పిట్టల శ్రీనివాస్, శానగొండ వెంకటేశ్వర్లు, బొడిగె వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.