Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలి రేట్లు పెంచాలని 35 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న పవర్లూమ్ కార్మికుల సమస్యలపై ప్రజా ప్రతినిధులు స్పందించాలని తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య విజ్ఞప్తి చేశారు. పవర్లూమ్ కార్మికుల నిరవధిక సమ్మెలో భాగంగా ఆదివారం ఐదో రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ 35 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల యజమానులు మొండి వైఖరితో ఉన్నారని ఆరోపించారు. తమ సమస్యలపై స్పందించాలని కౌన్సిలర్, చైర్మన్, ఎమ్మెల్యేలను వేడుకున్నా స్పందన లేకపోవడం విచారకరమని అన్నారు. ఓట్ల కోసం గడప గడప తిరిగే నాయకులకు పవర్లూమ్ కార్మికుల సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. పద్మా నగర్ డబల్ కుల్లా సంఘం అధ్యక్షులు వనం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి జెల్లా శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా యజమాన్యాలు వెంటనే కూలి రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) పద్మా నగర్ ఏరియా అధ్యక్షులు బొగు సత్యనారాయణ, పెండెం బుచ్చి రాములు, కెటిక ఆంజనేయులు, పసునూరు యోగానందం, జగదీష్, వెంకన్న, మధు, గురుమూర్తి, శ్రీనివాస్, గణేశ్, రాము, రామకోటి, భిక్షపతి, చంద్రయ్య, భద్రయ్య, దొంత రవి, వెంకన్న, గిరి పాల్గొన్నారు.