Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-నార్కట్పల్లి
మున్సిపాల్టీ పట్టణ ప్రాంతాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి పనులు కల్పించాలని, ఆఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రోజున నార్కట్పల్లిలో జరిగిన నకరేకల్ నియోజకవర్గ స్థాయి సమావేశం బొజ్జ చిన వెంకులు అధ్యక్ష తన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జి.నాగయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకు, పెద్దలకే పెద్దపీట వేసిందని, 80 శాతం మంది ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలకు పక్కన పెట్టిందని, ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా గత బడ్జెట్లో రూ.98 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.73 వేల కోట్లకు తగ్గించింది. అంటే రూ.25 వేల కోట్లు నష్టం చేసింది. అందుకే ఉపాధి హామీ పథకాన్ని మరింత మెరుగు పరచాల్సిన అవసరం ఉందని, దానికి రూ.2 లక్షల 64 వేల కోట్లు కేటాయించాలని సూచించారు. లేనిచో దేశవ్యాప్తంగా తీవ్ర పోరాటాలు జరుగుతాయని హెచ్చరించారు. దేశ ప్రజల జపం చేస్తూ దేశ ప్రజలను దోచుకునే అంబానీ ఆదాలకు లాభాలు చేకూర్చే పని పెట్టుకున్నారన్నారు. నరేంద్రమోడీ పార్లమెంటులో అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కూడా బడ్జెట్ విషయం మాట్లాడకుండా నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యల మీద రాష్ట్రం మొత్తాన్ని తిప్పుతున్నారు అన్నారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్లు తెరిచి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మెరుగుపరచాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని, అలాగే సంఘటిత - అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే సమరశీల పోరాటాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాలకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. నారీ ఐలయ్య, నాయకులు చింతపల్లి లూర్ధుమారయ్య, చేర్కు పెద్దులు, గునుగుండ్ల రామకృష్ణ, దండు శ్రీను, జాల రమేశ్, ఉటుకూరి శ్రీనివాస్, దుర్గం నాగరాజు, యడ్లసైదులు, దండు నాగరాజు పాల్గొన్నారు.