Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
నల్గొండ మున్సిపాలిటీ ముసాయిదా ప్రణాళికపై సూచనలు, సలహాలు అందించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కోరారు.అమృత్ పథకంలో భాగంగా జీఐఎస్ ఆధారిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపకల్పన స్టెమ్ కన్సల్టెన్సీ వివిధ శాఖలు, అన్ని పారామీటర్లు పరిగణనలోకి తీసుకుని ప్రస్తుత పరిస్థితిననుసరించి సర్వే చేసి వచ్చే 20 సంవత్సరాలైన 2041 వరకు జనాభా, మౌలిక వసతులు, సాంఘిక, ఆర్థిక అవసరాల కనుగుణంగా తయారు చేయడం జరిగిందని తెలిపారు. ముసాయిదా తయారీ లో వివిధ అంశాలు వివరించారు. ఈ ముసాయిదాపై సూచనలు, సలహాలు అందించాలని, రాత పూర్వకంగా తెలిపితే పరిశీలించి ముసాయిదాలో చేర్చడం జరుగుతుందన్నారు.నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతూ ప్రతి 20 సంవత్సరాలకు మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరుగుతుందని, 1987 మాస్టర్ ప్లాన్ తర్వాత మళ్ళీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన జరుగక మున్సిపాలిటీ నష్టపోయిందని అన్నారు. 1987 జనాభా ప్రకారం రోడ్లు, ఇతర సౌకర్యాలు ఉన్నవని, పరిస్థితులు మార్పు రావాలని కోరారు. ముసాయిదా మాస్టర్ ప్లాన్లో నివాసిత, పారిశ్రామిక, వాణిజ్య, వాటర్ బాడీస్, వ్యవసాయ జోన్లుగా భూ భాగంను వర్గీకరణ చేసినట్లు తెలిపారు. రండు సంవత్సరాలలో నల్గొండ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే ప్రధాన రోడ్లు, జంక్షన్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. నల్గొండ పట్టణంలో ఐటీహబ్ కు శంకుస్థాపన చేయడం జరిగిందని, మెడికల్ కళాశాల వచ్జిందని, వెటర్నరీ కళాశాల మిర్యాలగూడ రోడ్డు కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేయాల్సి ఉందని అన్నారు. జనాభా 2041 నాటికి 20 శాతం పెరుగుతుందని అంచనా వేసుకోవాలని అన్నారు. రింగ్ రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. నల్గొండ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని, కౌన్సిలర్లు ప్రతి ఒక్కరి సహకారంతో జిల్లా కేంద్రంగా వెనుకబడిన నల్గొండ అభివృద్ధికి పాటుపడతామని అన్నారు.స్టెమ్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి శ్రీకుమార్, నల్గొండ మున్సిపాలిటీ జీఐఎస్ ఆధారిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ సంస్థ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు స్టెమ్ సంస్థ ద్వారా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని 2041 సంవత్సరంకు రూపకల్పనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. అమృత్ పథకం భారత ప్రభుత్వం 2005లో ప్రారంభించినట్లు, ఇందులో భాగంగా దేశంలో 500 క్లాస్ పట్టణాలను జీఐ. ఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపొందించాలని నిర్ణయించిందని తెలిపారు. 2020లో ముసాయిదా మాస్టర్ ప్లాన్ తయారీకి పని మొదలు పెట్టినట్లు, అందుకు అవసరమైన డాటా, సమాచారం, విశ్లేషణతో జీఐఎస్ ఆధారిత ముసాయిదా మాస్టర్ ప్లాన్ వచ్చే 20 సంవత్సరాల వరకు తయారు చేసినట్లు తెలిపారు. 2013లో 7 గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో విస్తీర్ణం పెరిగిందని అన్నారు. భౌగోళిక విస్తీర్ణం, జనాభా, జన సాంద్రత, అక్షరాస్యత, లింగ నిష్పత్తి, రోడ్లు, హౌజింగ్, వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలు, పరిశ్రమలు, వర్క్ ఫోర్స్, మౌలిక వసతులు, సామాజిక అంశాలు, పర్యాటక, గ్రీన్ జోన్ అన్ని అంశాలతో వచ్చే 20 సంవత్సరాలకు రూపకల్పన చేసినట్లు తెలిపారు.సమావేశంలో పాల్గొన్న కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, ఎన్జిఓలు, రెసిడెంట్స్ అసోసియేషన్లు పలువురు మాస్టర్ ప్లాన్పై సూచనలు, సలహాలు అందించారు. పారిశ్రామిక, గ్రీన్ జోన్, పర్యాటక, రోడ్డు కనెక్టివిటీ పై సూచనలు చేశారు. నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) ప్లాన్ రూపకల్పన చేసిన నేపథ్యంలో నల్గొండ మున్సిపాలిటీ ముసాయిదా మాస్టర్ ప్లాన్ తో నుడా ప్లాన్ ఇంటిగ్రేట్ చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ పాత మాస్టర్ ప్లాన్, కొత్త ముసాయిదా మార్పులు సభ్యులకు అంద చేయనున్నట్లు, రెండు, మూడు రోజుల్లో తమ సలహాలు, సూచనలు తెలపాలని, స్వీకరించిన సలహాలు, సూచనలు అనుసరించి ముసాయిదా మాస్టర్ ప్లాన్ రూపొందించి పబ్లిష్ చేయడం జరుగుతుందని అన్నారు. పబ్లిష్ చేసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈ వర్క్ షాప్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మున్సిపల్ చైర్మన్ ఎం.సైదిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, అసిస్టెంట్ కాలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, మున్సిపల్ శాఖ ఆర్డీడీ నరసింహ రెడ్డి, ప్రజారోగ్య టీయూఎఫ్ఐ. డీసీఎస్ఈ. కందుకూరి వెంకటేశ్వర్లు, ప్రజారోగ్య ఈఈ సత్యనారాయణ, గహ నిర్మాణ శాఖ పీడీ. రాజ్కుమార్, మత్స్యశాఖ ఏడీ.వెంకయ్య, పలువురు అధికారులు, కౌన్సిలర్లు, ఎన్జీఓలు, రెసిడెంట్ అసోసియేషన్లు పాల్గొన్నారు.