Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస ఆధ్వర్యంలో జలాల్పురంలో సర్వేనెంబర్ 321,414లో ఎర్రజెండాలు పాతి భూ ఆక్రమణ
నవతెలంగాణ-తిరుమలగిరి
పేదల ఆధీనంలో ఉన్న భూమిలో పేదలకు రూ.5 లక్షలు మంజూరు చేసి ఇండ్లు నిర్మించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లిసైదులు డిమాండ్ చేశారు. బుధవారం తిరుమలగిరి మండలం జలాల్ పురం గ్రామంలోని సర్వే నెంబర్ 321,414లో ఉన్న ఐదెకరాల భూమిలో ఆ సంఘం ఆధ్వర్యంలో ఎర్రజెండాలు పాతి భూ ఆక్రమణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 199-97లో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో భూమి కొనుగోలు పథకం ద్వారా జలాల్పురం గ్రామంలో రైతుల వద్ద నుండి ఐదెకరాల భూమిని కొనుగోలు చేసి 25 ఏండ్లవుతుందన్నారు.ప్రభుత్వం ఆ భూమిలో కనీస సౌకర్యాలైన తాగునీరు, కరెంటు వంటి సౌకర్యాలు కల్పించకపోవడం మూలంగా లబ్దిదారులు ఇండ్లు నిర్మించుకోలేదన్నారు. ఇందులో నాలుగెకరాలలో హరితహారం మొక్కలు వేశారన్నారు.ప్రభుత్వం వెంటనే హరితహారం మొక్కలను తొలగించి లే అవుట్ చేసి లబ్దిదారులకు ఇంటి స్థలం చూపించాలని కోరారు.ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ఇంటి స్థలం ఉన్న పేదలకు మూడు లక్షల రూపాయలు ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశాడని, ఆ ప్రకటనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం, మండల కార్యదర్శి పడమటింటి నగేష్,సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు తంగళ్ళపల్లి భిక్షమాచారి, సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి ఆవుల సోమయ్య ,పార్టీ సభ్యులు జంపాల జగన్, నాయకులు కొమ్ము మల్లయ్య,బైరిక వెంకటయ్య, పాలడుగు సారయ్య, బైరిక వెంకటమ్మ, చౌగాని నాగమల్లు పాల్గొన్నారు.