Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పూజకు వేళాయే.. పూలు లేకపోయే.. పూలవ్యాపారుల ధరాఘాతం
- కొన లేకపోతున్నా సామాన్యులు
నవతెలంగాణ-నల్లగొండ
బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని నల్లగొండ పట్టణానికి చెందిన మహిళ పూల కోసం జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్ పూల మార్కెట్కు వెళ్లింది. చామంతి పూలు కిలో రూ. 150 అనడంతో కంగారు పడింది. వారం క్రితం రూ.50 కదా.. అని రుసరుసలాడుతూ మరో దుకాణానికి వెళ్లింది. అక్కడ కూడా అదే రేటు విని.. పూలు కొనలేక వెనుదిరిగింది. బతుకమ్మ పండుగ సందర్భంగా పూల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. దీంతో చాలా మంది ధరలు చూసి హడలిపోతున్నారు. తప్పనిసరి తక్కువ పరిమాణంలో కొనుగోలు చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లలో కొలో చామంతి రూ.150, లిల్లీ, మల్బర్ గులాబీలు, కనకాంబరాలు కేజీ రూ.400, మల్లెపూలు రూ.200, రూ. 30 కి 5 కట్టల తంగేడు రూ.20కి 5 కట్టల గునుగు పువ్వు మార్కెట్లలో అమ్మడంతో సామాన్యులకు కొనలేక పోతున్నారు. కూరగాయల రేట్లతోపాటు పూల ధరలు సైతం విపరీతంగా పెరిగిపోయాయి. సద్దుల బతుకమ్మ, విజయ దశమి పండగల సందర్భంగా ఇటు గౌరీదేవికి, అటు దుర్గామాత అలంకరణ, పూజకు కావాల్సిన పూలను ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. రిటైల్ వ్యాపారులైతే మూడు, నాలుగింతలు ధరలు పెంచి అందిన కాడికి దండుకుంటున్నారు. పూలకు ధరల రెక్కలు తొడిగి విక్రయిస్తుండడంతో పండుగల నేపథ్యంలో సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు.
15 టన్నులు విక్రయం...
పట్టణ హౌల్సేల్ మార్కెట్కు శివారు ప్రాంతాలు, వివిధ రాష్ట్రాల నుంచి పూలను తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంషాబాద్, మోయునాబాద్, శంకర్పల్లి మండలాలతోపాటు కర్ణాకటలోని చుబుల్లాపూర్, తమిళనాడులోని మసూరా, మహారాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి పూలను తీసుకొస్తుంటారు. కాగా మార్కెట్లోని లైసెన్స్ దుకాణాల్లో సాధారణంగా రోజూ 1 నుంచి 2 టన్నుల పూలు అమ్ముతుంటారు. పండుగ రోజుల్లో దాదాపు 10 నుంచి 15 టన్నుల మేరకు పూలను విక్రయిస్తామని వ్యాపారులు చెబుతున్నారు.
రూ.2 కోట్ల వ్యాపారం...
గణపతి, దేవి నవరాత్రి ఉత్సవాలతోపాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల సమయంలో ఉపయోగించే డెకరేషన్ పూలను థాయిలాండ్ దేశంతో పాటు, ఆంథోరియా, జిప్సోలియా, జిప్సీ, ఆస్ప్రే, గిలాడ్స్ పూలను బెంగళూరు, మహారాష్ట్ర, పూనే, నాసిక్, ఔరంగాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటారు. ఈ మార్కెట్లో సాధారణ రోజుల్లో రూ.10 నుంచి రూ.15 లక్షల వ్యాపారం జరుగుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.2కోట్ల వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
అమ్మో.. ఇవేం రేట్లు...
మర్రి శ్వేత (గహిణి,నల్లగొండ)
బతుకమ్మ పండుగ కోసం పూలు కొందామని మార్కెట్కు వచ్చిన. ఇక్కడ రేట్లను చూస్తే వణుకు పుట్టింది. చామంతి, బంతి పూల ధర కిలో రూ.150 చెప్పిండ్రు. తంగేడు పూలు 5 కట్టలకు రూ.30, రూ.20కి గునుగు పువ్వు 5 కట్టలు ఇస్తున్నారు. అమ్మో.. మార్కెట్లో ఇంత రేట్లు నేను ఎన్నడూ చూడలే..!
నాలుగైదు రెట్లు అధికం...
అలా మల్లేశ్వరి (గహిణి, నల్లగొండ)
సాధారణ రోజుల్లో ఒక్కో రకం పువ్వు కిలో రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయిస్తున్న వ్యాపారులు పండుగ రోజుల్లో ధరలు పెంచి దడ పుట్టిస్తున్నారు. రిటైల్ వ్యాపారులైతే ఇష్టమొచ్చిన ధర చెబుతున్నారు. మార్కెట్లో వారం క్రితం పోల్చితే నాలుగైదు రెట్లు ధరలు పెరిగాయి. డిమాండ్ నేపథ్యంలో కొందరు హౌల్సేల్ వ్యాపారులు సరుకును దాచిపెడుతున్నారు. మార్కెట్లో 60 శాతం పూలు తగ్గిపోయిన తర్వాత రేట్లు పెంచి విక్రయిస్తున్నారు.
పండుగలప్పుడే రేటు...
-హౌల్సేల్ వ్యాపారులు
వినాయకచవితి, దసరా, దీపావళి పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో పూల ధరలు పెరుగుతుంటాయి. ఒక రోజు ఉన్న ధర మరో రోజు ఉండదు. గంటల వ్యవధిలోనే రేట్లు అప్అండ్డౌన్ అవుతుంటాయని చెబుతున్నారు. నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయని హౌల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు.