Authorization
Thu March 20, 2025 07:43:06 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి
నవతెలంగాణ-నకిరేకల్
కేంద్రంపై నిర్వహించే పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక నర్రా రాఘవరెడ్డి భవనంలో ఆ పార్టీ నియోజకవర్గస్థాయి వర్క్షాప్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఉపాధి అవకాశాలు తగ్గి కొనుగోలు శక్తి పడిపోయిందన్నారు. దీంతో నిత్యవసర ధరలు పెరగడం వల్ల ప్రజలపై భారాలు పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పోరాటలతో నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకున్న ప్రభుత్వం దొడ్డిదారిన ఆ చట్టాలను అమలు చేసేందుకు కుట్ర చేస్తుందని విమర్శించారు. అందులో భాగంగానే రైతులకు ఎరువుల సబ్సిడీ ఎత్తి వేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. గ్రామీణ ప్రజల ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించకుండా ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ పాలనలో దేశ ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఈ దేశాన్ని రక్షించుకునేందుకు సీపీఐ(ఎం) నిర్వహించే పోరాటాలలో ప్రజలందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వెంకులు, నగేష్, అవిశెట్టి శంకరయ్య, రాచకొండ వెంకన్న, వెంచర్ల సైదులు, జిత్త సరోజ, సిహెచ్లు టుమారయ్య, ఆరూరు శ్రీను, వంటపాక వెంకటేశ్వర్లు, చలకాని వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.