Authorization
Thu March 20, 2025 11:42:26 pm
- ఆకుపచ్చ తోరణాలతో కళ కళ
- ఆకర్షిస్తున్న ఫ్లెక్సీలు బ్యానర్లు
- మార్చి ఒకటిన భారీ ప్రదర్శన, బహిరంగ సభ
- హాజరుకానున్న బృందాకరత్
- రేపటి నుంచి మిర్యాలగూడలో గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలు
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో మార్చి 1, 2, 3 తేదీలలో జరగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ మహాసభలకు మిర్యాలగూడ ముస్తాబయింది. పట్టణ నలుమూలలలో ఎక్కడ చూసినా ఆకుపచ్చ తోరణాలు జెండాలతో కళకళలాడుతుంది. ప్రధాన రహదారులో ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. పట్టణానికి ప్రవేశించే దారుల వెంట ఆకుపచ్చ జెండాలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో గోడ రాతలతో తీర్చిదిద్దారు. పట్టణంలో ఏ మూలన చూసిన తెలంగాణ గిరిజన సంఘ రాష్ట్ర మూడవ మహాసభల జయప్రదం చేయాలని కోరుతూ ఫ్లెక్సీలు గోడ రాతలను ఏర్పాటు చేశారు. మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. మహాసభల మొదటి రోజైన మార్చ్ 1 మిర్యాలగూడ పట్టణంలో భారీ ప్రదర్శన, 20 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుండి ఎన్ఎస్పి క్యాంపు మైదానం వరకు భారీ ప్రదర్శన చేయనున్నారు. వేలాదిమంది గిరిజనులతో మహాప్రదర్శనలో గిరిజన తెగల సంస్కృతితో ఆటపాట కళా ప్రదర్శనతో పాటు, 2000 మంది యువతీ యువకులతో గ్రీన్ షార్ట్ కవాతు జరగనుంది. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ ఎంపీ, ఆదివాసి అధికార్ రాష్ట్రీయ మంచు జాతీయ నాయకురాలు బృందాకరత్ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించనున్నారు. ఈమెతో పాటు మాజీ ఎంపీ ఆదివాసి అధికార రాష్ట్రీయ మంచ్ చైర్మన్ డాక్టర్ మీడియా బాబురావు, మాజీ ఎంపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు హాజరుకానున్నారు. మార్చి 2 3 తేదీలలో స్థానిక ఏఆర్సి ఫంక్షన్ హాల్లో సుమారు 1000 మందితో కూడిన ప్రతినిధుల మహాసభ జరగనుంది. ఈ మహాసభలో తెలంగాణ గిరిజన సంఘం ఇప్పటివరకు చేపట్టిన ఉద్యమాలు, ప్రజాస్పందనలు, భవిష్యత్తు పోరాట కార్యచరణ రూపొందించనున్నారు.
మహాసభలను విజయవంతం చేయాలి
శ్రీరామ్నాయక్ (తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి)
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో మార్చి 1 2 3 తేదీలలో జరిగే తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలి. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ గిరిజన సంఘం నిరంతరం పనిచేస్తూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో జరిగే రాష్ట్ర మహాసభలు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 1000 మంది ప్రతినిధులు, వివిధ రంగాలలో కృషి చేస్తున్న మేధావులు, ఉద్యమకారులు హాజరవుతున్నారు. గిరిజన కుటుంబాలు అధిక సంఖ్యలో హాజరై మహాసభలను జయప్రదం చేయాలి.