Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్పీ అభ్యర్థి మీనయ్యను గెలిపించండి
- బీఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎఎల్.మల్లయ్య
నవతెలంగాణ-క్లాక్టవర్
శాసనసభ ఎన్నికల్లో డబ్బు, కుల రాజకీయాలకు స్వస్తీ పలికి, బహుజనులకు అధికారం దిశగా ముందుకు సాగాలని బీఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎఎల్.మల్లయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో కొండా వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన బీసీ, ఎంబీసీ, చేతివృత్తిదారుల రాజకీయ చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాలు, ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల పేర్లతో మళ్లీ అధికారంలోకి రావాలని, అధికారంతో పెత్తనం చేస్తూ తరతరాలుగా బహుజన వర్గాలను మోసం చేస్తున్న ఆధిపత్య పార్టీల అభ్యర్థులను ఓడించాలని పిలుపునిచ్చారు. డబ్బు, మద్యం మంచినీరులాగా పంపిణీ చేసి ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్న అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. బహుజనులంటే ఓట్లు వేసే యంత్రాలు కాదని, జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో న్యాయమైన వాటా కోసం ఉద్యమించాలన్నారు. బహుజనవాదం బలపరిచేవారిని, నల్లగొండ బీఎల్పీ అభ్యర్థి అక్కెనపల్లి మీనయ్యను గెలిపించాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
- కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం
- ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య
కాంగ్రెస్, టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఏండ్ల నుండి నల్లగొండ నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉందని ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య అన్నారు. బీసీ, ఎంబీసీ, వృత్తిదారుల రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్బెడ్రూం ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు. నల్లగొండ అభివృద్ధి చెందాలంటే బీఎల్పీతోనే సాధ్యమవుతుందన్నారు.
- బహుజనుల అధికారం కోసం ఏకం కావాలి
- బీసీ సబ్ప్లాన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ
బహుజనుల అధికారం రావాలంటే అన్ని వర్గాల ప్రజలు ఏకమై బీఎల్ఎఫ్ బలపర్చిన బీఎల్పీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సబ్ప్లాన్ సంఘం రాష్ట్ర కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ కోరారు. బీసీ, ఎంబీసీ, వృత్తిదారుల రాజకీయ చైతన్య సదస్సులో ఆయన మాట్లాడుతూ డబ్బు, మద్యం ఆశచూపి ఓట్లు దండుకుని ఆధికారంలోకి రావాలనుకుంటున్న నాయకులను ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో బీఎల్పీ అభ్యర్థి అక్కెనపల్లి మీనయ్య, చేతివృత్తి దారుల సంఘాల జిల్లా నాయకులు బండ శ్రీశైలం, రమాదేవి, రుక్ష్మిణి, మురళీధర్, చెరుకు పెద్దులు, నర్సింహ, సీతారాములు, రాములు, మురారి మోహన్, అంజయ్య, వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, గోపాల్ పాల్గొన్నారు.