Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేయని పనులకు ముందే నిధులు
- ఉన్నతాధికారుల అండతోనే..?
నవతెలంగాణ-నిడమనూరు
పేద వారికి ఎంతో ఉపయోగ పడుతున్న గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. కంచె చేను మేసిన చందంగా మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రామాల్లో ఉపాధి హామీ చట్టం కింద చేపట్టిన పనుల ప్రదేశాల్లో పని వివరాలు, పని చేసిన కూలీల వివరాలన్నీ ఒక పట్టిక రూపంలో వేయించి అక్కడే దిమ్మెలు కిట్టించి వాటిని అందరికీ కనిపించే విధంగా ఏర్పాటు చేయాలి. దిమ్మెలు కట్టించేందుకు ప్రభుత్వం రూ.3000, బండలు పెట్టేందుకు మరో రూ.1300 ఖర్చు చేస్తుంది.
అయితే ఉపాధి హామీ సిబ్బందే కాంట్రాక్టర్లుగా మారి ఆ శాఖ ఉన్నతాధికారుల అండదండలతో చట్టంలోని లొసుగు లను తమకు అనుకూలంగా మార్చుకొని సుమారు రూ.8.09 లక్షలు తమ సొంత ఖాతాలకు మళ్లించుకున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి.
ఇందులో భాగంగా ఉపాధి కార్యాలయంలో పని చేస్తున్న సీసీ నాగేంద్రచారి 600 బండలను పాతించాల్సినప్పటికీ 200 బండలు పాతించి 600 బండలకు తప్పుడు ఎంబీలతో ముందుగానే నిధులు తన అకౌంట్లో జమ చేసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిధుల దుర్వినియోగంపై విచారణ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.
విచారించి చర్యలు తీసుకుంటాం : ఎంపీడీఓ ప్రతాప్నాయక్
నిధుల దుర్వినియోగం విషయం మా దృష్టికి రాలేదు. దానిపై విచారిస్తాం. అక్రమాలకు పాల్పడితే ఉన్నతాధికా రులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటాం. ఉపాధి హామీలో జరిగే పనులపై పర్యవేక్షణ చేపడతాం.