Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హాలియా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికుల శ్రమదోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థల కొమ్ముగాస్తున్నాయని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్రెడ్డి నాగిరెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదయ్య విమర్శించారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో జరిగిన సీఐటీయూ మండల మహాసభకు ముఖ్యఅతిథి గా హాజరై మాట్లాడారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతుంటే మోడీ ప్రభుత్వం అసంఘటిత రంగాల్లో దినసరి కనీస వేతనం రూ.178 ప్రకటించడం బడాబాబుల కొమ్ము గాయడమేనన్నారు.44 కార్మిక సంక్షేమ చట్టాలను నాలుగు కోడ్లుగా కుదించడం, కార్మికుల కనీస వేతన చట్టాన్ని సవరించడం కార్మికవర్గానికి గొడ్డలిపెట్టేనన్నారు. పాలకులు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వరంగాల్లో గౌరవ వేతనం, పనికితగిన పారితోషికం, వాలంటీర్స్ అనే వారందరినీ మూడేండ్ల సర్వీస్ ఉంటే రెగ్యులరైజ్ చేయాలని, అసంఘటి తరంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు, స్కూల్ స్వీపర్స్ పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పొదిల వెంకన్న, లక్ష్వమ్మ, ఇందిర, శంకర్, వెంకటమ్మ, ఏసోబు, మధు, అంజిరెడ్డి, అన్నెపాక శ్రీను, రాధ, ఇద్దమ్మ, కౌసల్య పాల్గొన్నారు.