Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-త్రిపురారం
మంత్రి పదవి కంటే మాదిగ హక్కులే ముఖ్యమని టీఎస్ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం మండలంలోని అనుముల సుశీల నర్సింహారెడ్డి ఫంక్షన్హాల్లో ఆ సంఘం ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరడం న్యాయమైన డిమాండ్ అని, అయితే మంత్రి పదవి ముఖ్యమా..? మాదిగ హక్కుల ముఖ్యమా..? అని ప్రశ్నించారు.ఒకరిద్దరికి మంత్రి పదవులిచ్చే కంటే మాదిగల హక్కులు కాపాడాలని కోరారు. హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడాలన్నారు. ఉద్యమంలో హక్కుల ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలు ముఖ్యమని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణలో కేసీఆర్ చొరవ తీసుకొని డప్పు, చెప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇచ్చి సంక్షేమ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే కేసీఆర్ వెంట నడుస్తామన్నారు. మాదిగల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.తమకు మంత్రి పదవులు వద్దని కోరిన ఎమ్మెల్యేలు తమ తోటి మాదిగలందరికీ హక్కులు వచ్చేలా చూడాలని సీఎంను కోరితే చాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి రమేశ్, జాతీయ నాయకులు కత్తుల తులసీదాస్, నకిరేకంటి అంజయ్య, చెరుకు వెంకటాద్రి, రాష్ట్ర నాయకులు మేడి నర్సింహ, పుల్లయ్య, మొండికత్తి లింగయ్య, సోమయ్య, నర్సింహ, నరేందర్, కృష్ణ పాల్గొన్నారు.