Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
అభివృద్ధి పేరుతో ప్రకృతిపై అరాచకం జరుగుతోంది. సాక్ష్యాత్తు ప్రభుత్వ శాఖల అధికారులే పచ్చదనానికి గొడ్డలిపెట్టులా మారుతున్న వైనం ప్రజలను నివ్వెరపోయేలా చేస్తుంది. మండలంలో ఏకో అర్బన్ పార్కు పేరుతో జరుగుతున్న హడావుడి అభివృద్ధి పనుల్లో చేపట్టడం లేదని చర్చించుకుంటున్నారు. పార్కు పేరుతో వందలాది చెట్లు అడ్డంగా నరికేస్తున్నారు. ండ్ల తరబడి ఎదిగిన వృక్షాలు ముక్కలై తెగిబడుతున్నాయి. పెద్దవూర మండలం సమ్మక్క సారక్క వద్ద 250 ఎకరాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి ఏకో అర్బన్ పార్కుకు పది రోజుల కింద సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భూమిపూజ చేశారు. పార్కు పనులు ప్రారంభం కావడంతో అడ్డొచ్చిన చెట్లన్నింటినీ నరికివేస్తున్నారు. ఇప్పటివరకు పచ్చగా ఉన్న ఆ ప్రాంతం అభివృద్ధి పనుల పుణ్యమా..అని చెట్లు ఎక్కడికక్కడే కుప్పకూలిపోతున్నాయి.తెలంగాణ వాల్టాచట్టం ప్రకారం చెట్టును నరికివేస్తే ఆ చెట్లకు బదులుగా తిరిగి మరిన్ని మొక్కలు నాటాల్సి ఉంది.
ఒకవైపు హరితహారం..మరోపక్క తొలగింపు ప్రక్రియ
ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి హరితహారంలో భాగంగా ప్రతి గ్రామంలో, తండాల్లో, ప్రభుత్వ భూముల్లో, రోడ్లు, ప్రధాన రహదారుల వెంట చెట్లను పెంచారు. నాటిన మొక్కకు నీరు పోసే నాథుడే లేడు. దశాబ్దకాలంగా ఉన్న చెట్లను అభివృద్ది, పార్కుల పేరుతో ప్రకృతిని నాశనం చేస్తున్నారు.ఇది పాలకులకు తగునా..? అని ప్రశ్నిస్తున్నారు.
మాయమైపోతున్న గ్రీనరీ..
గ్రామీణ ప్రాంతాల్లో నాటిన మొక్కలు వాడుబట్టిపోతున్నాయి. ట్యాంకర్లతో నీళ్లు పోయక ఇబ్బందులు పడుతుంటే పచ్చని చెట్లను నరికివేస్తుండడంతో గ్రీనరీ అంతా మాయమౌతోంది. ఎన్నో ఏండ్లుగా స్వయంగా ఎదిగిన వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకిలిస్తుంటే పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులపై ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.అడవుల్లోనున్న చెట్లను హడావుడిగా నేలకూల్చుతున్న వైనంపై ప్రజల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాకుండా చెట్లు సహకరిస్తున్నాయి.వేసవికాలంలో హాయినిచ్చే చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణానికి విఘాతం ఏర్పడొచ్చు. ఇలాంటి తరుణంలో నరికివేయడం అవసరమా..? మళ్లీ ఎన్నేండ్లకు అంత పెద్ద చెట్లు అవుతాయి..? అనే విషయాన్ని అధికారులే ఆలోచించాలి.