Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వ్యాప్తంగా సుమారు 300కు పైగా రైస్మిల్లులుండగా ఒక్క మిర్యాలగూడలోనే 90 రైస్మిల్లులున్నాయి. ఆయకట్టుకే ప్రధాన బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో ధాన్యం అధికంగా పండిస్తుండటం వల్ల మిల్లులు కూడా అధికంగా వెలిశాయి. జిల్లాతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేస్తుంటారు. అట్టి ధాన్యాన్ని మర పట్టించి బియ్యంగా మార్చి విక్రయిస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. ఇక్కడి బియ్యం ఇతర రాష్ట్రాలతో పాటు, ఇతర దేశాలకు సైతం ఎగుమతి అవుతుందంటే ఇక్కడి వ్యాపారం ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
తవుడు పన్ను ఎగవేత..
ధాన్యాన్ని బియ్యంగా మర పట్టిస్తుంటారు. బియ్యానికి ఎలాంటి జీఎస్టీ లేదు. కానీ తవుడుకు మాత్రం ఐదు శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటోంది. తవుడును స్థానికంగా, ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ ఎక్కువగా ఉండడం,సాల్వెంట్ ఆయిల్ పరిశ్రమలకు అధికంగా వినియోగిస్తుంటారు. మిర్యాలగూడ నుంచే కోట్లాది రూపాయలు విలువ చేసే తవుడును నిత్యం ఎగుమతి చేస్తుంటారు. కాగా తవుడు ఎగుమతి వ్యాపారం చేసే సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఐదు శాతం జీఎస్టీని చెల్లించకుండా ప్రభుత్వానికి కుచ్చుటోపీ పెట్టారు. మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు నకిలీ బిల్లులు సృష్టించి తమ దందాను యథేచ్ఛగా సాగించారు. ఏడాదికి సుమారు రూ.70 నుండి రూ.80 కోట్ల వరకూ జీఎస్టీ రూపంలో చెల్లించాల్సి ఉంటోంది. ఒక్క మిర్యాలగూడలోనే రోజుకు రూ.15 లక్షల నుండి రూ.20 లక్షల వరకూ జీఎస్టీ చెల్లించాలి.కానీ రెండేండ్లుగా పన్నులు చెల్లించకుండానే నకిలీ బిల్లులతో తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు.
ఇరు రాష్ట్రాల్లో సంచలనం..
రెండు ప్రముఖ సంస్థల్లో జీఎస్టీ బిల్లు ఎగవేతపై సెంట్రల్ జీఎస్టీ విజిలెన్స్ అధికారులు గుర్తించడంతో మిర్యాలగూడ కేంద్రంగా సాగుతున్న తవుడు దందా వెలుగులోకొచ్చింది. ఢిల్లీ, విశాఖపట్నం నుంచి సెంట్రల్ విజిలెన్స్ అధికారులు 15 బృందాలుగా ఏర్పడి ఇరు రాష్ట్రాల్లో విస్తృతంగా దాడులు చేస్తూ పన్ను ఎగవేతపై లోతుగా విచారణ జరుపుతున్నారు. మిర్యాలగూడ ప్రాంతంలో గత మూడ్రోజులుగా విజిలెన్స్ అధికారులు మిల్లర్లు, కమీషన్ ఏజెంట్ల ఇండ్లల్లో దాడులు చేసి కీలకపత్రాలతో పాటు, పెద్ద ఎత్తున నగదు, కంప్యూటర్ హార్డ్డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడలో ప్రముఖ వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు అయిన నలుగురితో పాటు, మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిపై కేసు నమోదు చేశారు. వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.
జీరో దందాకు సూత్రదారి అతడేనా..?
మిల్లర్ల జీరో దందాకు ఓ కమీషన్ ఏజెంట్ సూత్రదారిగా వ్యవహరించినట్టు సమాచారం. పెద్ద ఎత్తున తవుడు దందా చేసి మిల్లర్లకు రూ.5 కోట్ల వరకూ బకాయి పడి ఉండడంతో అట్టి డబ్బులు చెల్లించలేక సదరు వ్యక్తి ఇటీవల కాలంలోనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.ఈ విషయం వెలుగులోకొచ్చినప్పటికీ మిల్లర్లు పోలీసులకు కనీసం ఫిర్యాదు చేయకపోవడం వెనక అనుమానాలు కల్గిస్తున్నాయి. ఈ తవుడు పన్ను ఎగవేతలో అతడే కీలక సూత్రధారిగా ఉండి ఉంటాడని భావిస్తున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలను కూడా విజిలెన్స్ అధికారులు సేకరించే పనిలోనున్నట్టు సమాచారం.
లోతుగా విచారిస్తున్నాం : విజిలెన్స్ అధికారులు
తవుడు పన్ను ఎగవేత విషయంపై తెలుగు రాష్ట్రాల్లో లోతుగా విచారిస్తున్నామని జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అశోక్, అసిస్టెంట్ డైరెక్టర్ విఠల్ తెలిపారు. ప్రధానంగా మిర్యాలగూడ కేంద్రంగా వ్యాపారం జరిగిందని అనుమానం వచ్చి మూడు రోజులుగా దాడులు చేసి విచారణ జరుపుతున్నామన్నారు.తవుడు దందా చేసే వ్యాపారులు, కమీషన్ ఏజెంట్ల వివరాలు సేకరిస్తున్నామన్నారు. వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని,రెండేండ్లుగా సాగిస్తున్న వ్యాపార లావాదేవీలను ఆరా తీస్తున్నామని చెప్పారు. జీఎస్టీ పన్ను ఎగవేతలో బాధ్యులెంతటి వారినైనా వదిలిపెట్టమన్నారు. విచారణ పూర్తయ్యాక సమగ్ర వివరాలు ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.