Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ముసురు పట్టిన వానలా ఆ అమ్మాయి ఏడ్చింది ఏడ్చినట్లే ఉంది. దూరంగా గానుగ చెట్టు కింద కూర్చుని సీతమ్మోరిలా కంటికి, మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. కారే కంటికి, చీదే ముక్కుకి తెరిపి లేకుండా పోయింది.
రెండ్రోజులుగా ఆ అమ్మాయికిదే తంతు. నేనెంత సముదాయించినా వినట్లా. ఆ అమ్మాయిని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు.
క్లాసులోంచి ఏడుస్తున్న అమ్మాయిని చూస్తున్నాను. ఏవో ఆలోచన్లు ముసురుకున్నాయి. పదేళ్ళ నాటి మాట. నేను బడికి వచ్చినప్పటి నుండి ఈ అమ్మాయే బళ్ళో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెడుతుంది. అంతకు ముందు ఎవరెవరో ఉన్నారు గాని ఒక్కళ్ళూ నిలకడగా ఉండి వండింది లేదు. కూరకెంత? నారకెంత? ఉప్పుకెంత? పప్పు కెంత? సర్కారోళ్ళు పిల్లోనికి ఇచ్చేడిదెంత? ఖర్చులన్ని పోనూ మిగులున్నదెంత? అంటూ లెక్కలేసుకుని కూలిపాటు కూడా దక్కకపోవడంతో మేం చేయమంటే... మేం చేయం అని ఒక్కొక్కరే మానుకున్నారు.
పిల్లలకు మధ్యాహ్నం పస్తులు తప్పలే. కొత్త ఏజెన్సీ ఏర్పాటు చేయాలని అధికారుల ఒత్తిడి నాపై ఎక్కువైంది. ఊర్లో ఎవర్నడిగినా కూలికెళ్తే మూడొందలిస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం. అది మాకు గిట్టదు లెండి మాష్టారూ... అంటూ ఎవరూ రానన్నారు.''
నాకేం చేయాలో పాలుపోలేదు. సరిగ్గా ఆ పరిస్థితుల్లో ఈమె నేనొండిపెడతానంటూ ముందుకొచ్చింది. ''పిల్లలు పస్తులుంటే కడుపు తరుక్కుపోతుంది. పసిపిల్లలు దేవున్తో సమానం అంటారుగా. రాళ్లు రప్పలకు దేవుడంటూ నైవేద్యం పెడ్తా నాకేమొస్తుందని లెక్కలేసుకుంటామా? పసిపిల్లలకు అన్నం వండి పెట్టడం కన్నా మంచి పని ఏముంటుంది? వాళ్ళ ఆకలి తీర్చడం కన్నా పుణ్యం ఏముంటుంది? కడుపుకు పెట్టే దానికాడ లాభనష్టాల లెక్కలేస్కుంటే ఎలా? నేనొండిపెడతాన్ సార్'' అంటూ ముందుకొచ్చింది.
ఆమె మాటలకు నా సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. నేటితో ఈ విషయంలో అధికారుల ఒత్తిడి జర తప్పిందని ఆనందమేసింది. ఆ క్షణం ఆమె నా కంటికి పిల్లల ఆకలి తీర్చడానికొచ్చిన అమ్మలా కన్పించింది. అదుగో అప్పటి నుండి కన్న బిడ్డలకు పెట్టినట్టు పిల్లలకి అన్నం వండి పెడుతుంది.
రాధి అని ఊరంతా పిలిచే ఆమె పేరు రాధిక. కాని అందరు రాధి అనే పిలుస్తారు. అసలు ఆమెది ఈ వూరు కాదు. ఎక్కడో ఖమ్మం దగ్గర కైకొండాయి గూడెం. పెళ్ళై రెండేళ్ళకే పెనిమిటి చచ్చిపోతే ఇప్పుడాయింటికి ఆమె పెద్ద దిక్కైంది. బడి పక్కనే చిన్న గుడిసెలో చిన్నా చితక పన్చేసుకుంటూ బతుకు వెళ్ళదీస్తుంది. రోజు పొద్దునే బడంతా శుభ్రం చేసేది. ఈ పని ఎట్టాగూ చేస్తున్నవ్ గానీ వంట కూడా చేయరాదు అని అంటే అట్టనే సారు అన్నది.
వంట చేయడంలో ఆమె నలభీముడికి అమ్మే! తన హస్తవాసి అలాంటిది. వంట చేసిపెట్టడం ఓ పనిలా ఏనాడూ భావించలేదు. పరమభక్తురాలు భగవంతుడికి భక్తితో నైవేద్యం పెట్టినట్లు పిల్లల పట్ల ప్రేమతో ఇష్టంగా వండి పెట్టేది. లాభ నష్టాల లెక్కల్తో పన్లేకుండా ఎక్కడా రాజీ పడకుండా వండేది. ఇంటి భోజనాన్ని మరిపించేది. సాంబారు పెడితే ఆ ఘుమఘుమలు బడి మొత్తం ఘుమాయించేవి. పిల్లల బొజ్జల్లో జఠరాగ్ని ఉవ్వెత్తున ఎగసేది. ఆ చేత్తో పులిహోర కలిపితే అది రాములోరి గుళ్ళో ప్రసాదంలానే ఉండేది. అంత రుచిగా వుండేది. మధ్యాహ్నం అయ్యిందంటే చాలు పిల్లలు ఆవురావురుమనేవాళ్ళు. కొసరి కొసరి వడ్డించేది. అప్పుడు చూడాలి. ''తినండ్రా... తినండి... ఒక్క మెతుకు మిగలకుండా ముందు తిన్నోళ్ళు రాజన్నమాట'' తనకు బిడ్డలు లేకపోయినా, తన కడుపున పుట్టిన బిడ్డల్ని బతిమాలున్నట్లు బతిమాలి పిల్లల చేత తినిపించేది. ఆ చేతి మహత్యమేమోగాని పళ్ళెంలో ఒక్క మెతుకు మిగల్చకుండా తినేవాళ్ళు పిల్లలు. ఆ క్షణం ఆమె అందరి ఆకలి తీరుస్తున్న అమ్మలానే కన్పించేది. పిల్లలు తింటే రాధి కడుపు నిండిపోయేది.
ఇంత చేసినా నెల చివర ఖర్చులు, రాబడి చూస్తే రాధికి మిగిలేది అంతంత మాత్రమే. పాపం కూలీపాటు కూడా మిగల్లేదుగా అంటే ''పోన్లెయ్యా!....పిల్లల్లేరనే బాధలేకుండా పోయింది'' అనేది.
ఒక్కోసారి ఆ కొద్దిపాటి కూడా మిగలక నష్టం వస్తే ''పసి బిడ్డలకేగా పెట్టింది.. మిగలకపోతే మాన్లే.. పోతూ కట్టుకు పోయేదేముంది'' అనేది. పనైపోయినా బడొదిలి ఇంటికెళ్ళేది కాదు. బళ్ళోనే తిరుగుతూ పిల్లల్తో గడిపేది. హాయిగా తన పిల్లలతో గడాపాల్సిన వయస్సులో తన కష్టం మర్చిపోవడానికేమో గానీ పిల్లలంటే అంత ఆపేక్ష. పిల్లలు కూడా రాధి అంటే అంతే ప్రేమ కనబర్చేవారు.
రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. సొంత రాష్ట్రంలో సొంత ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగేళ్ళు కావస్తుంది. మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ పార్టీ మనుషులకు అడ్డు లేకుండా పోయింది. అన్నీ మాకే కావాలన్నారు. అనుకున్నదే తడవుగా ఊర్లో రేషన్ డీలర్ నుండి అంగన్వాడీ దాకా అప్పటిదాకా ఉన్నవాళ్ళను తీసేసి తమ పార్టీ వాళ్ళకు అప్పగించడం మొదలెట్టిండ్రు.
ఇప్పుడు గ్రామాల్లో ఇదో ఆనవాయితీగా మారింది. గిప్పుడది బళ్ళో మధ్యాహ్న భోజన పథకంపై పడింది. ''మొదట్లోలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పిల్లాడికి బానే సన్న బియ్యం ఇస్తోంది. ప్రస్తుత రేట్ల మీద బాగానే గిట్టుబాటవుతుంది. ఏ లాభం లేకపోతే గాపోరి గన్నేళ్ళుగా ఎలా చేస్తుంది?'' అనుకుని ఏజెన్సీని తమ వాళ్ళకు ఇప్పించాలనుకున్నారు. స్కూలుకొచ్చి నన్ను కలిసి ఏజెన్సీ మార్చాలన్నారు. ''ఆమె ఒంటరి మహిళ. ఏ రాజకీయ పార్టీకి చెందని మనిషి. గిట్టుబాటు కాక వండిపెట్టడానికి ఎవరూ ముందుకు రాక పథకం ఆగిపోయిన పరిస్థితుల్లో పాపం ఆమె ముందుకొచ్చి పిల్లలకు అన్నం వండి పెడుతోంది. ఇప్పుడు ఆమెని తీయడ మెందుకు?'' నచ్చచెప్పడానికి ప్రయత్నించాను.
విన్లేదు. మార్చాల్సిందేనని పట్టుపట్టారు. అంతటితో ఆగక స్థానిక యం.యల్.ఎ చేత పై అధికారులకు సిఫారసు చేయించారు. ఆయన మంత్రి కూడా కావడంతో ఏజెన్సీ వాళ్ళు చెప్పిన వాళ్ళకిమ్మని అధికారులు హుకుం జారీ జేశారు. చేసేది లేక మరుసటి రోజు రాధిని పిలిచి విషయం చెప్పాను. ఆమె గానిమిషం మాత్రంగా నన్నలాగే చూస్తుండి పోయింది. కాసేపటికి తేరుకుని ''గిదెక్కడి న్యాయమయ్యా! గిట్టుబాటు కాదని ఎవళ్ళు రాకపోతేనే కదా కష్టమో, నష్టమో ఇన్నాళ్ళ సంది నాను వండిపెడుతున్నాను. ఇప్పటిదాకా ఈ పనికి, పిల్లలకి అలవాటు పడ్డాను. తీసేస్తామంటే ఎలా అయ్య? అదీగాక పిల్లల్తో నాకు తెలీకుండా మాలిమయ్యాను... గీసంటి పనిలో వచ్చేడిదెంతో, పోయేటిదెంతో గానీ కడుపు తీపి అంటే ఏటో తెలిసింది... పిల్లల్లేరని నిత్యం బాధపడే నన్ను సూచి కాదన్నా ఆ దేవుడే ఇంతమంది పిల్లల్ని నాకిచ్చాడనుకున్నా... పిల్లల్నొదిలి వెళ్ళమంటే నా వల్ల కాదయ్యా'' అంటూ కన్నీటి పర్యంతమైంది. ''అయినా మీకు తెలియంది కాదు బయట పనికి బోతే ఒంటరి ఆడోళ్ల పరిస్థితెట్లుందోఃః అంటూ కంటికి, మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది. ఆమెతో మాట్లాడుతుండగానే నాకు దు:ఖం తన్నుకొచ్చింది. కానీ అధికారం అడ్డం పడింది. ఎట్లానో దిగమింగుకున్నాను. కళ్ళలోంచి జారిన కన్నీటి బొట్లను ఆమెకి కన్పించకుండా కర్చీఫ్తో తుడుచుకున్నా.
''నిన్ను తీయాలని నాకేం లేదు. ఈ విషయంలో నేను నిమిత్తమాత్రుణ్ణి. పైనుంచి ఒత్తిడులు అలా ఉన్నాయి. నన్ను క్షమించు'' గొంతు గాద్గదికం కాగా ఎలాగో గొంతు పెగల్చుకుని చెప్పాను. కానీ...ఆమె విన్లేదు. వినకపోగా కోపంగా ''ఎలా తీసేస్తారో... ఎవరొచ్చి తీసేస్తారో నేను చూస్తా. నేను మానేస్తున్నట్లు సంతకం పెట్టకుండా ఇంకోళ్ళకు ఎట్లా ఇస్తారో చూస్తా'' అంటూ కరాఖండిగా చెప్పి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆమె తెగింపు చూసి... ఈ గడ్డ పౌరుషం అలాంటిది అనుకున్నాను. నిజమే! మానేస్తున్నట్లు తాను సంతకం పెట్టకుండా కొత్తవాళ్ళకు ఏజెన్సీ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదు. అనే విషయం నాకు అప్పుడు తట్టింది. అదే దైర్యంతో చివరి వరకు పోరాడితే బాగుండు అనుకున్నాను.
ఇదే విషయం పై అధికార్లకు చెప్పాను. అలా అయితే రేపు ఎంక్వైరి వేసి తీసేద్దాం. వాళ్ళ మనుషుల చేత సరిగా అన్నం వండి పెట్టడం లేదని, సంతకాలు తీసుకుందాం. ఆనక పాత ఏజెన్సీని మనమే రద్దుచేసి కొత్త ఏజెన్సీ పెడదాం. అధికార్ల మాటలకు నేను నివ్వెర పోయాను. దారుణమన్పించింది. హత్య కన్నా మహాపాతకమన్పించింది. ఆఖరి ప్రయత్నంగా ఆమెకి నచ్చచెప్పాలనుకున్నా. ''సంతకం పెట్టకపోతే నువ్వు సరిగా వండట్లేదని చెప్పి బలవంతంగా తీసేస్తారు. దానికంటే స్వచ్చందంగా తొలగిపోవడమే మర్యాద'' అని చెప్పాను. ఆమె వినలేదు. దాంతో బడిలోని మహిళా టీచర్లకు విషయం పూర్తిగా వివరించి రాధితో మాట్లాడండి... ఆమెను ఒప్పించండి అని చెప్పాను. వారు వారి వంతు ప్రయత్నం గట్టిగానే చేశారు.
కానీ, ఆమె ససేమిరా అంది. ''నేనెట్లా వండానో తిన్న గీ బిడ్డలకు తెల్సు... ఆనక చూసిన మీకు తెల్సు. పైన దేవుడనే వాడొకడున్నాడు... నేను సరిగా వండలేదని చెప్పడానికి నోరెలా వస్తుందో చూస్తా'' అంది రాధి.
''అయ్యో! దేవుడనే వాడుంటే ఈ అరాచకాలు జరుగుతాయా!'' అనుకున్నాను.
జరుగుతున్న తంతు చూస్తూ రాధి ఏడుస్తూనే ఉంది. మధ్యాహ్నానికి అధికార్లు ఎంక్వైరీకి వచ్చారు. ఆమె అధికార్ల కాళ్ళా వేళ్ళ పడుతూ పరిపరి విధాలుగా బతిమాల్తోంది. ''మీకు దణ్ణం పెడతానయ్యా.. నా కడుపు కొట్టమాకండి... ఒంటరి దానిని కనికరించండి... బాంచేన్ మీ కాళ్ళు మొక్కుతా అయ్య... పిల్లల్నొదిలి నేను బతకలేనయ్యా... పిల్లల నుంచి నన్ను దూరం చేయకండయ్యా..''
ఎవరో చేత్తో గుండెను నులిమినట్లు విలవిలలాడిపోయాను.
ఆ దృశ్యాన్ని చూసి కూడా అధికార్లు ఆమె మొరనాలకించలేదు. అటెండరు ఆమె రెక్క పట్టుకుని తీస్కెళ్ళి దూరంగా కూర్చోబెట్టాడు. ఎంక్వయిరీ మొదలైంది. అన్నం సరిగా వండటం లేదని, సాంబారు నీళ్ళలా ఉంటుందని, గుడ్డు ఇవ్వడం లేదని వాళ్ళు రాధిపై లేనిపోని ఆరోపణలు చేశారు. కానీ పిల్లలను మాత్రం ఎంక్వయిరీ చేయలేదు. అవి తప్పుడు ఆరోపణలు అని గట్టిగా అరవాలనిపించింది. కానీ అధికారం మరల అడ్డువచ్చింది. సంతకాలు సేకరించి రాతపూర్వకంగా అధికార్లకు అందచేశారు. అధికార్లు ఆ ఆరోపణలను బహిరంగంగా చదివి విన్పించారు. అది విన్న రాధి ఖిన్నురాలైంది. చేష్టలుడిగి అలాగే చూస్తుండి పోయింది.
ఆ తరువాత అధికార్లు పాఠశాల కమిటీ ద్వారా పాత ఏజెన్సీని తొలగిస్తూ, కొత్త ఏజెన్సీని నియమిస్తూ సంతకాలు సేకరించి ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది. నేను, నాతోటి టీచర్లందరు కొయ్యబొమ్మలా నిల్చుండిపోయి చూస్తున్నాం. నా సంతకం పెట్టమన్నారు. అన్యాయం అంటూ నా అంతరాత్మ గొంతు చించుకు అరుస్తోంది. న్యాయానికి, భయానికి మధ్య క్షణకాలం అంతులేని మానసిక సంఘర్షణ జరిగి చివరికి భయమే గెల్చింది. అరవకుండా నా అంతరాత్మ నోరు నొక్కాను. మారు మాట్లాడకుండా సంతకం పెట్టాను. నా సంతకంతో ఆమె బతుకు మీద దెబ్బకొట్టాను. ఆమె వైపు చూశాను. తనిప్పుడు ఏడ్వడంలేదు. గంభీరంగా మారిపోయింది. నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. అందర్ని ఒక్కసారి కలియచూసింది.
'నాల్గు మెతుకులు పెడితే కుక్క బతికినంత కాలం విశ్వాసం చూపిస్తుంది. ఇన్నేళ్ళుగా మీ బిడ్డల ఆకలి తీర్చాను. అందుకు నాకు బాగానే చేశారు. మీ అధికారంతో, బలగంతో ఒంటరి దాన్నైనా నా బతుకు మీద దెబ్బకొట్టారు. మీకు నేనడ్డు రాను... మీరే చేసుకోండి... అంతా మీరే ఏలుకోండి'
రెండు చేతులు జోడించి అందరికి దణ్ణం పెట్టింది. ఒక్కసారి బడంతా కలియచూసి కౌరవ సభలో ద్రౌపదిలాగా కనిపించింది. ఆమె అడుగులు తడబడుతున్నాయి... అయినా వేగంగా అడుగులేసుకుంటూ తరలిపోతుంది. ఆమె వెనుక అందరూ వెళ్ళిపోయారు. నా కళ్ళలో ఆ దృశ్యమే కన్పిస్తోంది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు. రాధి అమ్మోరికి బలిచ్చిన మేకపోతులా అన్పించింది. అన్యమనస్కంగానే మరసటి రోజు బడికొచ్చాను.
ఎవరో వచ్చి చెప్పారు. రాధి రాత్రి దిగుల్తో నిద్దట్లోనే... ఆ వాక్యం పూర్తిగా వినాలనిపించలేదు. ఓ క్షణం నాకు నోట మాట రాలేదు. కుర్చీలో కుప్పకూలిపోయాను. దు:ఖం లావాలా తన్నుకొచ్చింది. చిన్నపిల్లాడిలా రోధించాను. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. చాలాసేపటికి గానీ మనిషిని కాలేకపోయాను.
అందరం కలిసి ఆమెను హత్య చేశామన్పించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది ఎవరో నేత టీవీలో గొంతు చించుకుంటున్నాడు. నవ్వొస్తోంది... సిగ్గేస్తోంది... అసహ్యమేస్తోంది... ఏడ్పొస్తుంది.
- అనంతోజు మోహన్ కృష్ణ
8897765417