Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత స్వాతంత్య్ర సంగ్రామం అనేక పోరాటాల సమాహారం. ప్రజా చైతన్యానికి తోడ్పడిన ప్రతి రంగం ఇందులో భాగం. అందులో అతి ప్రధానమైనది పత్రికా రంగం. జాతీయ నాయకులు ఒకవైపు ప్రత్యక్షంగా స్వరాజ్య ఉద్యమంలో పాల్గొంటూనే మరోవైపు పత్రికా రంగాన్ని తమ భుజాలకెత్తుకొని ప్రజల పక్షం వహించారు. ఎన్ని ఆంక్షలు, నిషేధాలు ఎదురైనా వెన్ను వెరవకుండా, రెప్పపాటు కూడా కన్ను మూయకుండా కలాలను ఝళిపించారు. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో మహమ్మద్ బాకర్ మొదలుకొని 1948లో షోయబుల్లాఖాన్ వరకు పదుల సంఖ్యలో నాయకులు సంపాదకులుగా పత్రికలను నడిపారు. అగ్ర నాయకుల నుండి అల్ప కార్యకర్తల వరకు ప్రతీ జాతీయవాది, ఈ పత్రికలు నిర్వహించిన స్వాతంత్య్ర అక్షర ఉద్యమంలో కొద్దో గొప్పో తమ తమ సహకారాన్ని అందించారు. వారిలో హైదరాబాదులోని షోయబుల్లాఖాన్ ఒకరు.
జననం, విద్య
జాతీయ భావాలను బలంగా కలిగి ఉన్న ఇతను అక్టోబర్ 17, 1920లో అప్పటి హైదరాబాదు సంస్థానంలోని వరంగల్ లో పుట్టాడు. తల్లి లాయహున్నిసా బేగం. తండ్రి హబిబులా ్లఖాన్ సబ్ ఇన్స్పెక్టర్గా నిజాం ప్రభుత్వంలో పని చేసేవాడు. తండ్రి భావాలే అచ్చు గుద్దినట్లుగా కొడుకుకు అబ్బినాయి.
యునైటెడ్ ప్రావిన్స్ నుండి వలస వచ్చిన ఈ కుటుంబం లోని షోయబుల్లాఖాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ, జర్నలిజంలో పట్టా పొందాడు. ఒక పక్క తండ్రికున్న ఆదర్శ భావాలు, మరోపక్క తన చుట్టూ అలుముకున్న స్వాతంత్య్ర అభిప్రాయాలు షోయబుల్లాఖాన్ ను జాతీయ వాదిగా మార్చాయి.
పత్రికా సేవ, పత్రికోద్యమం
ఇతను ముస్లిం రాజ్యంలోని ముస్లిం మతానికి చెందిన వాడైనా మత విద్వేషపూరిత చర్యలకు మాత్రం వ్యతిరేకి. సంకుచిత భావాలను దరిచేరనీయకుండా విశాల దక్పథంతో ఆలోచించి సర్వ మానవ సౌభ్రాతత్వాన్ని కాంక్షించిన షోయబుల్లా విస్తారమైన ఆలోచన ధార గల వివేచనా శీలి.
చదువుకున్న అర్హతతో, తన మత ప్రాబల్యంతో అతి సునాయసంగా ఉద్యోగం పొందే అవకాశం ఉన్నా వద్దకున్నాడు. ఆ దశ లోనే తన భావాలను హైదరాబాదు రాష్ట్ర వ్యాపితం చేసేలా వ్యాసాలు రాయడం ప్రారంభిం చాడు. జాతీయోద్యమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అన్వేషిస్తే ఇతను పత్రికా మార్గాన్ని చేపట్టాడు. ఒకరు ప్రత్యక్షంగా పోరాటం చేస్తే ఒకరు ఆ పోరాటానికి కావాల్సిన మానసిక చైతన్యాన్ని అందించారు. భౌతికంగా నిజాం వ్యతిరేక పోరాటం చేస్తున్న వారికి నైతికంగా, మానసికంగా ధైర్యాన్ని ఇచ్చింది పత్రికా నిర్వాహకులే. ఇలా తాను పని చేస్తున్న పత్రికను పాశుపతాస్త్రంగా చేసుకొని నిజాం ప్రభుత్వ దుశ్చర్యలను, దారుణ కత్యాలను ఎప్పటికప్పుడు రాతలతో అందిస్తూ ప్రజలను సమాయత్త పరుస్తూ ఒక స్వాతంత్య్రాభిలాషిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు.
షోయబ్ ''తాజ్'' అనే వారపత్రికలో పని చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ఎక్కుపెట్టిన అక్షర బాణాలు అందరిని ఆకర్షిం చాయి. ఆయన రాసిన వ్యాసాలు మేధావులను, నాయకులను ఆలోచింపచేశాయి. ఆయన రాసిన ఈ వ్యాసాలే అనంతర కాలంలో మందుముల నరసింగరావు 1927లో ప్రారంభించిన 'రయ్యత్' పత్రికలో చేరడానికి ఉపకరించాయి. ఇలా ఆయన రాసిన వ్యాసాలు, తనకొక ప్రశ్నించే పత్రికలో స్థానాన్ని కల్పించడంతో ఇక ఆయన దేనికి తల వొగ్గలేదు. తన స్వాతంత్య్ర అభిప్రాయాలకు, ప్రజలలో ఉన్న నిజాం విముక్తి కాంక్షను బలపరిచేలా చేసింది. ఇరవై ఏళ్ల పాటు రయ్యత్ పత్రికలో ఉద్యోగిగా, ఉప సంపాదకుడిగా బాధ్యతలు నిర్వర్తించి మందుముల నరసింగరావు దష్టిలో గొప్ప స్థానాన్ని పొంది నిజాంపై ఎక్కుపెట్టిన అక్షర యోధునిగా నిలిచాడు.
ఈ క్రమంలోనే 'పత్రికా నిషేధం' అనే వార్త వినిపించింది. 20 ఏళ్లలో పలు విఘ్నాలతో కొనసాగిన రయ్యత్కు ఇప్పుడు సంపూర్ణ విఘ్నం ఎదురైంది. 1947 అక్టోబరులో నిజాం ప్రభుత్వ గూడచారి విభాగం అధికారి రయ్యత్ పత్రికా కార్యాలయానికి వెళ్లి పత్రికను నిషేధిస్తున్నట్టు ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఆజ్ఞ షోయబ్ను తీవ్ర దుఖానికి బాధితున్ని చేసింది. పత్రిక నిషేధానికి గురైందన్న వార్త వినగానే తీవ్రంగా శోకించాడు. మనిషి కన్నా ఎక్కువగా పత్రికను ప్రేమించినందుకే ఈ దుఃఖం కాబోలు. ఆ సమయంలో తన పక్కనే ఉన్న మందుముల తనను ఎంత ఓదార్చినా శోకాన్ని మాత్రం ఆపుకోలేకపోయాడు. అలా కొన్నాళ్ళు తన జీవితంలో స్తబ్దతగా ఉండిపోయింది.
ఒక నిషేధం పత్రిక నిర్వహణను అడ్డుకోవచ్చు. కాని భావాన్ని మాత్రం అడ్డుకోలేదని భావించి తనే ఒక స్వంత పత్రిక ప్రారంభానికి సిద్ధపడ్డాడు. ఎట్టకేలకు మందుముల నరసింగ రావు సలహాతో, బూర్గుల రామకష్ణారావు ఆర్ధిక సహకారంతో 1947 నవంబర్ 15 నాడు ''ఇమ్రోజ్'' అనే దిన పత్రికను ఆరంభించాడు. అప్పటి నుండి నిజాం దురంతాలను, రజాకార్ల ఆగడాలను తన కలంతో ప్రశ్నిస్తూ నిజాం ప్రభుత్వ వ్యతిరేకిగా గుర్తించబడ్డాడు. కాశీం రజ్వీ వ్యక్తిగత దుందుడుకు భావాలకు ఎప్పటికప్పుడు కళ్ళెం వేస్తూ అడ్డుగా మారడంతో, ఇతనిని రజాకార్ బందం టార్గెట్ చేసింది.
1948 ఆగస్టు 21 నాడు షోయబ్ అర్ధరాత్రి పత్రికా ఆఫీసు నుండి ఇంటికి వెళ్తుండగా రజాకార్లు దొంగచాటుగా కాల్చి ఆ పై చేతులను నరకడంతో మర్నాడు చనిపోయాడు. ఒక ప్రాంత ప్రజల స్వాతంత్య్ర కాంక్షకు అండగా నిలుస్తూ వచ్చిన పాత్రికేయున్ని ఒక మత సామ్రాజ్య ప్రభుత్వం చేసిన హత్య తెలంగాణ స్వాతంత్య్రోద్యమంలో అతి పెద్ద విషాద గాథ.
- ఘనపురం సుదర్శన్,
9000470542