Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిరికొండ
రాష్ట్ర ప్రభుత్వం యాదవులకు రాయితీపై అందిస్తున్న గొర్రెలు మండలంలో మృత్యువాత పడుతున్నాయి. దీంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. మండలకేంద్రంలో ఇప్పటి వరకు 22 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 21 గొర్రెల చొప్పున పంపిణీ చేశారు. తెచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 17 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. దీంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లా నుంచి వీటిని ఇటీవలే మండలానికి వాహనాల్లో తీసుకువచ్చారు. మొత్తం 30 యూనిట్లకు గాను 22 యూనిట్లకు చెందిన గొర్రెలను మండలానికి తరలించారు. ఇదిలా ఉండగా గతవారం రోజులుగా రోజుకు ఒకటి, రెండు చొప్పున గొర్రెలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. పశువులకు సరిపడా మందులు లేవని, కొన్ని ప్రయివేటుగా తీసుకురావాలని వైద్యులు చీటీలు రాసిస్తున్నారు. ఒక పక్క పశువైద్యులు వైద్యం అందిస్తున్నప్పటికీ మరణాలు ఆగడం లేదు. ఈ గొర్రెలను లబ్దిదారుల సమక్షంలోనే కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఈ గొర్రెలు ఇలాగే మృత్యువాత పడుతుంటే మరింత నష్టపోయే ప్రమాదముందని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు. బుధవారం పశువైద్యులు డాక్టర్ పర్వేజ్ అహ్మద్ గొర్రెలకు చికిత్సలు చేశారు. న్యూమోనియాతో గొర్రెలు మరణిస్తున్నట్టు డాక్టర్ తెలిపారు. వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు.