Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణంలో కళాకారుల ర్యాలీ, ప్రదర్శన
- తెలంగాణ వచ్చింది జానపద కళాకారులతోనే : జేసీ కృష్ణారెడ్డి
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో కళాకారుల ఆట పాట అలరించింది. కళాకారుల పాటలు ఉర్రూతలూగించాయి. పట్టణంలోని తెలంగాణ చౌక్లో జానపద కళాకారుల ర్యాలీని జేసీ కృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ కుమ్రం భీంచౌక్ నుంచి రెవెన్యూ గార్డెన్స్ వరకు కొనసాగింది. వందలాది మంది తెలంగాణ జానపద కళాకారులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వివిధ వేషాధారణతో తమదైన శైలీలో నృత్యాలు చేస్తూ చూపరులను ఆకట్టుకున్నారు. ప్రత్యేకంగా గుస్సాడి నృత్యం ఎంతగానో ఆకర్షించింది. వీరు చేసిన ఈ నృత్యాలను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అనంతరం రెవెన్యూ గార్డెన్స్లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిధ జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. కార్యక్రమాన్ని ట్రైనీ కలెక్టర్ గోపి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చిదంటే అది జానపద కళాకారులతోనేనని అన్నారు. జానపదాలు లేని పల్లెలు లేవన్నారు. కళాకారులు తమ కళలను కాపాడుకోవాలన్నారు. భవిష్యత్ తరాల వారికి అందించాలన్నారు. పాటను రక్తి కట్టించాలంటే అది కళాకారులకే సాధ్యమవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జానపద కళాకారులకు అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖాధికారి రవికుమార్, డీపీఆర్ఓ భీంకుమార్ పాల్గొన్నారు.