Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బర్త్ డే పార్టీల్లో గంజాయి మత్తు
-చిత్తవుతున్న యువత
- పెరుగుతున్న లేట్ నైట్ పార్టీల సంస్కృతి
- మత్తు ఏర్పడకుండా కండ్లల్లో ఐ డ్రాప్స్
నవతెలంగాణ - మంచిర్యాల
లేట్ నైట్ బర్త్ డే పార్టీల పేరిట జిల్లాలో విచ్చలవిడి సంస్కృతి పెరిగిపోయింది. యువత తమను తాము మరిచిపోయి ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. బర్త్డే పేరిట ప్రధాన కూడళ్లలో అర్ధరాత్రి కేక్ కట్ చేసి చిందులేస్తున్నారు. మత్తు సరిపోవడం లేదంటూ గంజాయి మత్తులో తేలియాడుతున్నారు. గంజాయి వాడకాన్ని ఫ్యాషన్గా చేసుకొని దాని మత్తులో మునిగి తేలుతున్నారు.
సిగరెట్.. లేకుంటే ఓసీబీ పేపర్
రైల్వే స్టేషన్ రోడ్, లక్ష్మీ టాకీస్ ఏరియా, పాత మంచిర్యాల, బైపాస్ రోడ్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళల్లో యువత బర్త్డే పార్టీలు నిర్వహిస్తూ గంజాయి మత్తులో ఊగిపోతున్నట్టు తెలుస్తోంది. డబ్బును ఆన్లైన్ ద్వారా చెల్లిస్తూ గంజాయిని కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో సిగరెట్లోని పొగాకును తీసేసి గంజాయిని నింపి సిగరెట్ తాగేవారు. ఇప్పుడు సిగరెట్లకు బదులు ఓసీబీ, ఏటీఎం పేపర్లు వాడుతూ గంజాయి తాగుతున్నారు. మరింత కిక్కు రావడం కోసం మందులో ముంచిన దూదిని సిగరెట్ ఫిల్టర్ వద్ద ఉంచి పీల్చుతున్నారు. ఓసీబీ పేపర్లు యువతకు కావాల్సిన ఫ్లేవర్ లలో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ రోడ్డు, లక్ష్మీ టాకీస్ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు సమాచారం.
మత్తు ఏర్పడకుండా ఐ డ్రాప్స్
బర్త్ డే పార్టీల్లో గంజాయి మత్తులో యువత తమనుతాము మర్చిపోతున్నారు. పార్టీ అయిపోయాక పోలీసులు ఎక్కడైనా ఎదురుడితే దొరికిపోతామనే భయం వారిలో ఉంది. గంజాయి తాగిన వ్యక్తి కండ్లను చూస్తే పోలీసులు ఇట్టే పసిగడతారు. అయితే కండ్లలో నిషా ఏర్పడకుండా యువత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. మెడికల్ షాపులో దొరికే ఐ డ్రాప్స్ వేసుకోవడంతో పోలీసులకు దొరక్కుండా జారుకుంటున్నారు. తల్లిదండ్రులకు తెలిసి కొడుకులను మందలించిన దాఖలాలు సైతం ఉన్నాయి. గంజాయి అమ్మకాలు అధికంగా జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి లేట్ నైట్ పార్టీలకు, గంజాయి విక్రయాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు....
అవగాహన కల్పిస్తున్నా..
జిల్లాలో పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రధాన కూడళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తోంది. వందలాది కేసులు నమోదు చేస్తున్నారు. పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తున్నారు. యువత మత్తుకు బానిసై రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య పరుస్తున్నారు. అంతేకాక నిత్యం పోలీస్స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ మత్తుపదార్థాలను గంజాయిని స్వాధీనం చేసుకుంటునప్పటికీ అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
గంజాయి రవాణా, వినియోగం అరికట్టేందుకు చర్యలు
జిల్లాలో గంజాయి రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నాం. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం. యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా అవగాహనా సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం.
- లక్ష్మీనారాయణ, ఏసీపీ