Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా వచ్చే సొమ్మును ఒక అదనపు ఆదాయ వనరుగా పరిగణించడం చాలా పొరపాటు. కానీ ఐఎంఎఫ్ ప్రభావంలో ఉండే కొంతమంది ఆర్థికవేత్తలు సైతం అటువంటి పొరపాటు భావనతోటే ఉన్నారు. ఏవిధంగా ఖర్చు చేసినా అంతిమంగా అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందే తప్ప తగ్గించదు. అయితే ప్రస్తుతం మనం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రభుత్వం అదనంగా ఖర్చు చేసి.. ప్రజల చేతుల్లో డబ్బు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన సొమ్మును రాబట్టడానికి సంపన్నుల లాభాలపై అదనపు పన్ను విధించడం కాని, వారి సంపదపై పన్ను విధంచడం కాని చేయాలి. అప్పుడే ఆర్థిక అసమానతలు మరింత పెరగకుండా ఉంటాయి.
ఇదివరకే నేను ఈ ద్రవ్యలోటు గురించి చాలాసార్లు ప్రస్తావించాను. కానీ ఈ బ్రెటన్వుడ్ సంస్థలు, ద్రవ్యపెట్టుబడి ప్రతినిధులు, వాషింగ్టన్ నుంచి పదేపదే పనికిమాలిన ఆర్థిక సిద్ధాంతాలను ముందుకు తెస్తూండడంతో మరోసారి ద్రవ్యలోటు గురించి రాయవలసి వస్తోంది. ఇప్పుడు ఈ ద్రవ్యలోటు అత్యంత ప్రాధాన్యత సంతరించు కుంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని అన్ని దేశాల ఆదాయాలూ కోవిడ్-19 మహమ్మారి వల్ల, లాక్డౌన్ వల్ల పడిపోతున్నాయి. ఇంకోవైపున ప్రజలకు వైద్య సేవలను, ఇతర రూపాలలో సహాయాన్ని అందించడానికి ప్రభుత్వాలు మరింత ఎక్కువగా ఖర్చు చేయవలసిన అగత్యం పెరుగుతోంది. ఇలా ఖర్చు చేయడం వల్ల ద్రవ్యలోటు పెరుగుతోంది.
ద్రవ్యపెట్టుబడి ప్రతినిధులు ఈ సందర్భంగా రెండు తీవ్రమైన తప్పుడు వాదనలను ముందుకు తెస్తున్నారు. మొదటిది, ఒక పరిమితికి మించిన ద్రవ్యలోటును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించ కూడదు. (మామూలుగా జీడీపీలో 3శాతానికి ఎప్పుడూ మించకూడదని వారంటారు). అలా మించితే దానివల్ల ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని అంటారు. (ప్రభుత్వం అదనంగా ఖర్చు చేయడానికి రిజర్వు బ్యాంకు నుంచి అప్పు తెచ్చి మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు మార్కెట్లోకి అదనంగా డబ్బు వచ్చిపడుతుంది గనుక కరెన్సీ విలువ పడిపోతుందని వారి వాదన). ఒక వేళ రిజర్వుబ్యాంకు నుంచి కాకుండా ప్రయివేటు రంగం నుంచి డబ్బు సమీకరిస్తే అప్పుడు మార్కెట్లోకి రావలసిన ప్రయివేటు పెట్టుబడులు తగ్గిపోతాయని వారంటారు. విషయాన్ని సరళంగా అర్థం చేసుకోడానికి వీలుగా విదేశాల నుంచి అప్పు తేవడం అనే మరొక దారి గురించి ప్రస్తుతం మనం పక్కన పెడదాం.
ఇక వారు తెచ్చే రెండో తప్పుడు వాదనా పైన చెప్పినట్టు అప్పు చేయకుండా ప్రభుత్వం గనుక తన ఆస్తులను అంటే, ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మడం ద్వారాగాని, లేదా ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారాగాని అదనంగా డబ్బు సమీకరించి ఖర్చు చేస్తే అప్పుడు ఎటువంటి ద్రవ్యలోటూ ఏర్పడదని వారంటారు. నిజానికి అలా అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి సమకూరే అదనపు ఆదాయం వల్ల ద్రవ్యలోటు తగ్గుతుందని కూడా వారంటారు. ఈ రెండు రకాల వాదనలూ ఏ విధంగా తప్పో ఇప్పుడు పరిశీలిద్దాం.
ఒకానొక ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగం ఉన్నప్పుడు కొనుగోలుశక్తి తక్కువగా ఉంటుంది. ఆ వ్యవస్థలో ఉత్పత్తి అయిన సరుకులను కొనుగోలు చేసేవారు తగ్గిపోతారు. అటువంటప్పుడు గనుక ప్రభుత్వం ద్రవ్యలోటు పెంచి ఖర్చు చేస్తే (అందుకోసం రిజర్వుబ్యాంకు నుంచి అప్పు తీసుకుని) ఎటువంటి ద్రవ్యోల్బణమూ ఏర్పడదు. జనాల దగ్గర ఉండే డబ్బు పెరిగి దానికి తగిన మోతాదులో మార్కెట్లో సరుకుల సరఫరా పెరగకపోతే అప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. సరుకులను కొనేవారు లేనప్పుడు ప్రజలకు అదనంగా డబ్బు అందించగలిగితే ఆ మేరకు అదనంగా సరుకులు అమ్ముడుపోతాయి. ఆ మేరకు మళ్లీ సరుకులను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలో అదనపు ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రభుత్వం అదనంగా ప్రజల కోసం చేసే ఖర్చు వల్ల ఎటువంటి ద్రవ్యోల్బణమూ ఏర్పడదు.
రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వం అప్పు తేవడానికి, ప్రయివేటు రంగం నుంచి అప్పు తేవడానికి ఒకే తేడా ఉంది. రిజర్వు బ్యాంకు నుంచి ప్రభుత్వం అప్పు తేవడం అంటే రిజర్వుబ్యాంకు కరెన్సీని ప్రింటు చేసి ఇస్తుంది. దానిని ప్రభుత్వం ఖర్చు చేసినప్పుడు అంతిమంగా ఆ సొమ్ము ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి పోతుంది. అదే ప్రభుత్వం ప్రయివేటు రంగం నుంచి అప్పు చేయడం అంటే ప్రభుత్వం బాండ్లను విడుదల చేస్తుంది. (ప్రామిసరీ నోటు రాసివ్వడం వంటిదే ఈ బాండు విడుదల చేయడం అంటే). ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి డబ్బు చేరితే దాని విలువకు రిజర్వు బ్యాంకు పూచీ పడుతుంది. అదే వారి చేతుల్లోకి ప్రభుత్వ బాండ్లు చేరితే అప్పుడు దానికి ప్రభుత్వమే నేరుగా పూచీ పడాలి. అంతే తేడా.
ప్రభుత్వం ప్రజలకు అందించే సొమ్ము (అది చేసిన పనికి వేతనం రూపంలో గాని, ఆర్థిక సహాయం రూపంలోగాని) వారి వద్ద ఉండిపోదు. దానిని వారు ఖర్చు చేసేస్తారు. అంతిమంగా అది పెట్టుబడిదారుల వద్దకే చేరుతుంది. ఏ సొమ్ము అయితే ద్రవ్యలోటును పెంచుతుందో ఆ సొమ్ము అంతా నిజానికి పెట్టుబడిదారుల వద్దకే చేరుతుంది. ఆ పెట్టుబడిదారులు నిజానికి అదనంగా ఏమీ పెట్టుబడి పెట్టకపోయినా, వారికి ఈ సొమ్ము అదనంగా ముడుతోందన్నమాట. ఒక విధంగా ప్రభుత్వం వారికందిస్తున్న కానుక ఇది. ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన కలిగించడానికి ప్రభుత్వం చేసే అదనపు ఖర్చు దాదాపు మొత్తంగా పెట్టుబడిదారుల ఖాతాల్లో చేరిపోతుంది.
అంటే ద్రవ్యలోటును పెంచడం ద్వారా ప్రభుత్వం ఖర్చు చేయడం వల్ల అంతిమంగా ఆర్థిక అసమానతలు పెరిగిపోతాయి. అలా కాకుండా ప్రభుత్వం ఆస్తిపన్నునో, లాభాలపై పన్నునో అదనంగా విధించి అలా వచ్చిన అదనపు సొమ్మును ఉద్దీపన కింద ఖర్చు చేసినప్పుడు ఆర్థిక అసమానతలు పెరగవు (అప్పుడు కూడా సంపన్నులు చెల్లించిన అదనపు పన్ను అంతిమంగా ప్రజల నుంచి తిరిగి వారికే చేరుతుంది).
ద్రవ్యలోటు పెంచడం ద్వారా ఖర్చు చేయడం వల్ల పెట్టుబడిదారుల వద్దకు అమాంతంగా (వారేమీ అదనపు పెట్టుబడులు పెట్టకపోయినా సరే) అదనపు ధనం వచ్చి పోగుబడుతుంది. ఇక ప్రభుత్వ ఆస్తులను (ప్రభుత్వరంగ సంస్థల వాటాలను అమ్మడం, ప్రభుత్వ భూములను అమ్మడం వంటి చర్యల ద్వారా) అమ్మి ఆ విధంగా వచ్చే డబ్బును ఖర్చు చేయడం వల్ల ద్రవ్యలోటు ఏమీ పెరగదని ఐఎంఎఫ్ భావిస్తుంది. ఇది పూర్తిగా తప్పు. ద్రవ్యలోటును పెంచడం ద్వారా ప్రభుత్వం చేసే అదనపు ఖర్చు ఎంత ఉంటుందో దాదాపు అంతే మొత్తం అంతిమంగా అదనంగా పెట్టుబడిదారుల చేతుల్లోకి పోగుబడుతుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అది డబ్బు రూపంలో కావొచ్చు, లేదా ప్రభుత్వ బాండ్ల రూపంలో కావచ్చు. వాటికి బదులు ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను వారికి అమ్మినా, లేక ప్రభుత్వ భూములను అమ్మినా అదీ వారి వద్దకే చేరుతుంది. సంపద రూపం మారుతుందే తప్ప పెట్టుబడిదారుల వద్ద పోగుబడటం అనేదే అంతిమంగా జరుగుతుంది.
అదనంగా నోట్లు ముద్రించి ఖర్చు చేయడమా, గవర్నమెంటు బాండ్ల ద్వారా సేకరించి ఖర్చు చేయడమా, ప్రభుత్వ రంగ సంస్థల వాటాలను అమ్మి ఆ సొమ్మును ఖర్చు చేయడమా లేక ప్రభుత్వ భూములను అమ్మి ఆ వచ్చిన సొమ్మును ఖర్చు చేయడమా అన్నది వివిధ మార్గాలను సూచిస్తుందే తప్ప అంతిమంగా అలా ఖర్చు చేసిన సొమ్ము పెట్టుబడిదారుల వద్దే పోగుబడుతుందన్నది మాత్రం అనివార్యం. మరి ఎటువంటి తేడా లేనప్పుడు ఆస్థుల అమ్మకమే సరైన చర్యగా, ద్రవ్యలోటు పెంచడం తప్పుడు చర్యగా ఐఎంఎఫ్ ఎందుకు పరిగణిస్తుంది? ప్రభుత్వరంగం ఉనికిలో ఉండటం అనేదే ఐఎంఎఫ్కు సుతరామూ గిట్టని విషయం. సైద్ధాంతికంగానే ఐఎంఎఫ్ ప్రభుత్వ రంగాన్ని వ్యతిరేకిస్తుంది. దానిని కప్పిపుచ్చుకోడానికి ఈ తరహా తప్పుడు వాదనలను ముందుకు తెస్తుంది.
ప్రభుత్వ భూముల అమ్మకం విషయం కూడా ఇటువంటిదే. ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా వచ్చే సొమ్మును ఒక అదనపు ఆదాయ వనరుగా పరిగణించడం చాలా పొరపాటు. కానీ ఐఎంఎఫ్ ప్రభావంలో ఉండే కొంతమంది ఆర్థికవేత్తలు సైతం అటువంటి పొరపాటు భావనతోటే ఉన్నారు. ఏవిధంగా ఖర్చు చేసినా అంతిమంగా అది ఆర్థిక అసమానతలను మరింత పెంచుతుందే తప్ప తగ్గించదు. అయితే ప్రస్తుతం మనం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రభుత్వం అదనంగా ఖర్చు చేసి.. ప్రజల చేతుల్లో డబ్బు ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన సొమ్మును రాబట్టడానికి సంపన్నుల లాభాలపై అదనపు పన్ను విధించడం కాని, వారి సంపదపై పన్ను విధంచడం కాని చేయాలి. అప్పుడే ఆర్థిక అసమానతలు మరింత పెరగకుండా ఉంటాయి.
ప్రభాత్ పట్నాయక్