Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్నది. అధికారిక లెక్కల ప్రకారమే 16లక్షల మందికి పైగా సోకింది. 35 వేల మందికిపైగా చనిపోయారు. అయినా బీజేపీ కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ టీఆర్యస్ ప్రభుత్వం 'నీరోచక్రవర్తి'ని (రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించాడట) తలపిస్తున్నవి. ప్రజలు ప్రాణ భయంతో అల్లల్లాడుతుంటే కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడంలో, రాష్ట్రం సెక్రటేరియట్ కూల్చివేతలో తలమునకలై ఉన్నాయి. పాలకులకు ప్రజల ప్రాణాలంటే ఎంత చులకనో కదా!
1.మన రైల్వేల ప్రాధాన్యత: మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు 1853లో (167సంవత్సరాల క్రితం) రైల్వేలను ప్రారంభించారు. ప్రస్తుతం రైల్వేలు దేశ జీవనాధార వ్యవస్థ (లైఫ్లైన్)గా ఉన్నవి. ప్రతిరోజు 2 కోట్ల 30 లక్షల మంది ప్రజలు 30లక్షల కి.మీ. దేశం నలుమూలలా ప్రయాణిస్తున్నారు. ఇది భూమికి, చంద్రునికి గల దూరానికి 10 రెట్లుగా ఉన్నది. ఈ వ్యవస్థలో 16లక్షల రెగ్యులర్ పోస్టులలో 14.5లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు పని చేస్తున్నారు. (1.5 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి) 5.5లక్షల మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్లో పని చేస్తున్నారు. మొత్తం 20లక్షల కుటుంబాలపై ప్రయివేటీకరణ ప్రభావం ప్రత్యక్షంగా, రైల్వేలపై ఆధారపడిన చిన్నవ్యాపారులు, కూలీలు, ప్రజలపై పరోక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది.
రాయితీలు: విద్యార్థులు, సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, ఉద్యోగులు, రోజూ ఉపాధికోసం దూర ప్రాంతాలకు వెళ్ళేపనివారు రాయితీలు పొందు తున్నారు. ఇదిప్పుడు కోల్పోతారు.
చౌక ప్రయాణం: 40కి.మీ వరకు రూ.10తో పాసింజర్ రైళ్ళలో ప్రయాణం.. అదే బస్సులలో రూ.40 ఉన్నది.
భద్రత:ప్రమాదాలు చాలా తక్కువ. ప్రయాణికుల రక్షణ కోసం అంతర్గగత పోలీస్ వ్యవస్థ ఏర్పాటు.
ఆస్తులు: వేలకోట్ల రూపాయల రైల్వే స్టేషన్లు, వర్క్షాప్స్, ట్రాక్ ప్రక్కన ఉండే మిగులు స్థలాలు.
2. ప్రయివేటీకరణ ఎందుకట?
1991 నుంచి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సరళీకృత ఆర్థిక విధానాలనే బీజేపీ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు తీసుకొనిపోతున్నది. రవాణా వల్ల నష్టాలు వస్తున్నాయి కాబట్టి ప్రయివేటీకరణ చేస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. ''ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ప్రజారవాణ ఏదేశంలో కూడా లాభాలు తీసుకొనిరాదు.'' కొన్ని రూట్లలో లాభాలు అపరిమితంగా వస్తాయి (ప్రజల ప్రయాణాలు, సరుకుల రవాణా, బొగ్గు, యంత్రాలు మొదలైనవి) అటవీ ప్రాంతం, దేశంలోని చివరి ప్రాంతాలకు కొద్దిమంది ప్రజల కోసం కూడా రైళ్ళు వేయడం ప్రభుత్వాల సామాజిక బాధ్యత. నిర్వహణ ఖర్చులో 53శాతం ప్రజలు, 47శాతం ప్రభుత్వం భరిస్తున్నది. ఆడబ్బు కూడా పరోక్షంగా ప్రజల పన్నుల ద్వారా వసూలైన సొమ్మే. నష్టాలు వస్తున్నాయి, సౌకర్యాలు మెరుగు పరచాలి కాబట్టి ప్రయివేటీకరిస్తాం అనేది పాలకుల వాదన. మరి అటువంటప్పుడు నష్టాలొచ్చే రూట్లను, స్టేషన్లు కదా ప్రయివేటుకు ఒప్పజెప్పాల్సింది? లాభాలొస్తున్న 109 రైల్వే స్టేషన్లు, 151 ప్యాసింజర్ రైళ్ళు నడపడానికి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రయివేటుకు పిలుపునిచ్చింది. ఇప్పటికే 6స్టేషన్లు ప్రయివేట్కు అప్పగించారు. 400 రైల్వే స్టేషన్ల ప్రయివేట్కరణకు రంగం సిద్ధం చేశారు.
నష్టాలకు కారకులు కూడా ప్రభుత్వ పెద్దలే: ఖాళీ పోస్టులు 1.5లక్షలకు పైగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు. రైళ్ళు, స్టేషన్లు పెరిగాయి. పనిభారం పెరిగింది. అందుకు అనుగుణంగా నియమకాలు జరపకపోవడం వల్ల ఉద్యోగులు, కార్మికులపై విపరీతమైన పని భారం పెరిగింది. సిగలింగ్ సిస్టం అప్గ్రేడ్ చేయడం లేదు. కొత్త ట్రాక్స్ వేయటం లేదు. ప్రభుత్వ రంగంలో రాయబరేలి, చెన్నై, చిత్తరంజన్, వారణాసిలలో ఇంజన్లు, వ్యాగన్లు, రైలు పట్టాలు, ఇతర సామాగ్రి తక్కువ ఖర్చు, ఎక్కువ నాణ్యతతో తయారవుతున్నాయి. కానీ ప్రభుత్వం మన రైళ్ళ పరిశ్రమలకు ఆర్డర్లు ఇవ్వకుండా విదేశాల నుంచి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తెప్పిస్తున్నారు. మనకు సామర్థ్యం ఉంది. కాని వినియోగించుకోవడం లేదు.
3. విధానాలే కారణం: ప్రభుత్వ రంగం ప్రజల సొమ్ముతో, ప్రజలచేత, ప్రజల కోసం నిర్వహించబడేది. విస్తారమైన ఉపాధి అవకాశాలు, మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రయివేట్ రంగానికి తమ లాభాలే పరమావధి. ప్రభుత్వ ఆస్తులు లక్షలకోట్లు ప్రయివేట్కు ధారదత్తం చేయబడతాయి. ప్రభుత్వ అజమాయిషీ ఉండదు. ప్రయాణీకుల ఛార్జీలు అపరిమితంగా పెరుగుతాయి. సరుకులు, యంత్రాలు, నిత్యావసర యంత్రసామాగ్రి, వాహనాలు మొదలైన రవాణా ఛార్జీలు పెరుగుతాయి. దాని ఫలితంగా పరోక్షంగా అన్ని రకాల వస్తువులు, సరుకుల ధరలు పెరుగుతాయి. అంతిమంగా నష్టపోయేది ప్రజలే. రెగ్యులర్ ఉద్యోగాలు తగ్గుతాయి. కాంట్రాక్టు ఉద్యోగాలు పెరుగుతాయి. జీతభత్యాలు పెరగవు. పెన్షన్ ఉండదు. పనిగంటలు పెరిగి శ్రమ దోపిడీ చేయబడుతుంది. కార్మికచట్టాలు కాలరాయబడుతున్నాయి. రైల్వేల ప్రయివేటీకరణ వల్ల ప్రమాదాలు పెరుగుతాయి. సరిపడినంతమంది ప్రయాణీకులు లేరనే సాకుతో రైళ్ళు రద్దు చేయబడుతాయి. నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రభుత్వమే ఆ ప్రాంతాలకు రైళ్ళు తీసివేయడం లేదా డొక్కు రైళ్లు నడిపే అవకాశం ఉంది. ఇది మనం ఆర్టీసీలో చూసాం. ఎయిరిం డియా విమానయాన రంగంలోనూ చూశాం.
వివేక్దేవ్ రారు కమిటీ సిఫారసుల అమలు: రైల్వేవ్యవస్థను చిన్నముక్కలుగా చేసి కంపెనీలుగా ప్రయివేట్కు కారుచౌకగా అమ్మివేయనున్నారు. 100శాతం ఎఫ్డీఐ, స్వదేశీపెట్టుబడులను ఆహ్వానిం చడం-దేశప్రగతికి గొడ్డలిపెట్టు. భవిష్యత్తు తరాలు నష్టపోతాయి.. ''రైల్వే రత్నాలను ధ్వంసం చేయడంతో మేక్ ఇన్ ఇండియా బండారం బట్టబయ లయింది.'' పెట్టుబడిదారులు అంతగొప్ప వాళ్ళు అయితే దేశంలో 5లక్షల పరిశ్రమలు ఎందుకు ఖాయిలా పడ్డాయి?
ఈ పెట్టుబడిదారులను కొత్త రూట్లలో ప్రజలనుంచి స్థలాలు సేకరించి, రైల్వేట్రాకులు వేయడం, స్టేషన్లు నిర్మించడం. విద్యుదీకరణ చేయడం, నూతనరైళ్ళు కొనడం, స్వంత గ్యారేజ్లు నిర్మించి నిర్వహించమనండి! (మనఛాలెంజ్) ఆ పని చేయరు. కారణం పెట్టుబడి ఎక్కువకావాలి. దీర్ఘకాలం పడుతుంది. లాభాలొస్తాయో, లేదో తెలియదు. రిస్కు ఎందుకని! పెట్టుబడిదారులకు ప్రజల సంక్షేమం కంటే లాభాలే పరమావధి.
4. వివిధ రంగాల్లో ప్రయివేటీకరణ-ప్రతిఘటన
బీఎస్ఎన్ఎల్-4జిని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని, 37,500 కోట్ల ఆస్తుల రక్షణ కోసం బొగ్గు గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ 100శాతం కార్మిక వర్గం సమ్మె చేశారు. రక్షణ రంగంలో 42 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 100శాతం ఎఫ్డీఐలను అనుమ తించడాన్ని వ్యతిరేకిస్తూ 99శాతం మంది సమ్మెచేశారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణ, నిరర్థక ఆస్తులు పెరిగి పోవడాన్ని నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు, ఇన్స్యురెన్స్ రంగంలో ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటాలు జరిగాయి. వ్యవసాయరంగంలో రైతాంగ ఆత్మహత్యలు నిరసిస్తూ, జీవన భద్రత, ఉపాధి కోసం ఏఐఏడబ్ల్యూయు, టీయూ రంగాలు పోరాటాల్లోకి వస్తున్నాయి.
విద్యారంగంలో కార్పొరేటీకరణ, కాషాయి కరణను నిలువరించాలనీ, సీబీయస్ఈ సిలబస్లో 30శాతాన్ని ప్రభుత్వం తగ్గించడం రాజ్యాంగ మౌలికలక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్నదని ఆ చర్యలను నిరసిస్తూ ఉపాధ్యాయ లోకం పోరాటానికి సిద్ధపడింది.
పోరాటాల వల్ల ఫలితం ఉంటుందా?
రైల్వేలను ప్రయివేటీకరించిన బ్రిటన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్లో ప్రజల పోరాటాలతో రైళ్ళను జాతీయం చేశారు. ప్రపంచ మంతటా పాలకులు ఇవే అనుభవాలను చవిచూస్తున్నారు. మన దేశంలోనూ ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన రైల్వే సమ్మె ఇందిరాగాంధీ గద్దె దిగడానికి కారణమైంది. ఇప్పుడున్న రైల్వే వ్యవస్థలో లోపాలు లేవని కాదు. వాటిని సరి చేసి స్వావలంబన కాపాడాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కానీ బీజేపీ ప్రభుత్వం సీట్ల రూపంలో బలం ఉంది కదా అని బరితెగించి, ప్రజల ప్రయోజనా లకు వ్యతిరేకంగా ప్రయివేటీకరణను వేగవంతంచేస్తే ప్రజలు పోరాటాల ద్వారానే తగిన సమాధానం చెబుతారు. నేడు ప్రజలకు తీవ్రంగా హాని కలిగిస్తున్న, దేశ ఆర్థిక వ్యవస్థను దివాళా తీయిస్తున్న కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడటమే అసలైన దేశభక్తి.
utfbnr@gmail.com
- బి. నరసింహారావు