Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీపీ) పూర్తి సంకోచానికి కచ్చితంగా కరోనా మహమ్మారి, లాక్డౌన్లే కారణమవుతున్నాయి. కానీ ఇవి అంతకు ముందు జరుగుతున్న, పెద్ద సంఖ్యలో ఉన్న కార్మికుల నిజ ఆదాయాల క్షీణత లాంటి తీవ్రమైన విషయాలను అర్థం కాకుండా చేస్తున్నాయి.
ఈ వాస్తవాన్ని తెలియజేయడానికి కొన్ని సూచికలు ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో దీర్ఘకాలిక నిరుద్యోగిత రేటు (సాధారణంగా ఉండే నిరుద్యోగిత రేటు 2 నుంచి 3శాతంతో పోలిస్తే) ఈ 45సంవత్సరాలలో గరిష్టంగా 6శాతం ఉంది. 2017-18 నేషనల్ సాంపుల్ సర్వే నివేదిక ప్రకారం గ్రామీణ భారతంలో తలసరి నిజ వినియోగపు ఖర్చు, 2011-12 సంవత్సరం కన్నా (అంతకు ముందు నిర్వహించిన పెద్ద సాంపుల్ సర్వే నివేదిక ప్రకారం) 9శాతం తక్కువ. పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజానీకం యొక్క సగటు వినియోగపు ఖర్చులో ఆ విధమైన పూర్తి క్షీణత గతంలో ఎప్పుడూ లేదు. కలత చెందే విషయమేమిటంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ సర్వే ఫలితాలను తొక్కిపట్టి ఉంచాలని నిర్ణయించింది. ఈ సర్వే ఫలితాలు అవిశ్వసనీయమైనవనే ప్రభుత్వవాదన అసంబద్ధమైనది. ప్రపంచంలోనే కొన్నిదశాబ్దాలుగా కొనసాగుతున్న అతి పెద్ద ఆవర్తన సాంపుల్ సర్వే అకాస్మాత్తుగా ఒక్క సంవత్సరానికే ఎందుకు అవిశ్వసనీయమైనదిగా మారుతుంది? భారత ఆర్థిక వ్యవస్థలో ఏదో ఒక తీవ్రమైన విషయం జరుగుతూ ఉంటుందనేది స్పష్టం.
ఇటీవల ఆహార వ్యవస్థలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ వాస్తవాన్ని నిర్ధారిస్తాయి. మొత్తం నయా ఉదారవాద కాలాన్ని 1991 నుంచి లెక్కలోకి తీసుకుంటే, 1991 - 2018 మధ్య కాలంలో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల రేటు, జనాభా పెరుగుదల రేటు కన్నా కొంచెం ఎక్కువగా ఉంది. సంవత్సరానికి జనాభా పెరుగుదల రేటు సుమారు 1.6శాతం ఉంటే, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల రేటు సంవత్సరానికి 1.8శాతంగా ఉంటూ వస్తున్నాయి. అయినప్పటికీ, ఆసక్తికరంగా మనకు రెండు స్పష్టమైన దగ్విషయాలు (పైకి కనిపించేవి) ఇక్కడ ఉన్నాయి. మొదటిది, మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) ద్వారా చేసిన ధాన్యం సేకరణ నయా ఉదారవాద కాలంలోనే పెరిగింది. కానీ 2008 ప్రపంచ పెట్టుబడి సంక్షోభం తర్వాత ఆ వేగం ఇంకా ఊపందుకుంది. 1991లో మొత్తం ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాలలో, ప్రభుత్వం సేకరించిన ధాన్యాలు 12.7శాతం ఉంటే, 2017 నాటికి అది 29.6శాతానికి పెరిగింది. 2001 నుంచి 2008 వరకు ఉన్న ధాన్యం సగటు సేకరణ 22.4శాతంగా ఉంటే, 2011 నుంచి 2017 వరకు ఉన్న సగటు సేకరణ 28.5శాతంగా ఉంది. ప్రయివేటు వాణిజ్య సంస్థలు, ఇంకో మాటలో చెప్పాలంటే వ్యవసాయిక వ్యాపారంలో ఆధిపత్యం వహించే సంస్థలు, సాధారణ ఆహార ధాన్యాల వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో ఆహార ధాన్యాల వ్యాపారం చేయడానికి అనాసక్తిగా ఉంటున్నాయి.
రెండవ గమనించదగిన దగ్విషయం ఏమంటే, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రభుత్వం నిల్వ ఉంచే ఆహార ధాన్యాల పరిమాణం, నియమ నిబంధనల ప్రకారం అత్యవసర పరిస్థితుల కోసం నిల్వ చేసిన ఆహార ధాన్యాల (బఫర్ స్టాక్) నిల్వల కన్నా మించి ఉండడమే కాక, ఆ పరిమాణంపైకి కూడా ఎగబాకుతుంది. 2017 సంవత్సరం నుంచి మొదలు పెట్టి వరుసగా నాలుగు సంవత్సరాలలోని జూన్ నెల నిల్వలు వరుసగా 55.7, 68.1, 74.3, 83.5 మిలియన్ల టన్నులుగా నమోదు అయ్యాయి. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి కన్నా నిల్వల పెరుగుదల రేటు వేగవంతంగా ఉంటుంది. ప్రతీ సంవత్సరం జూన్ నెల నిల్వల స్థాయి, ఆ సంవత్సరంలోని మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో నాల్గవ వంతు కన్నా ఎక్కువ ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థలో గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున నిల్వలు లేవు.70వ దశకంలో, మొత్తం ధాన్యం ఉత్పత్తిలో సుమారు 12శాతం ధాన్యం నిలువలు ఉండేవి. 90వ దశకం చివరిలో కూడా నిల్వలు 15శాతం కన్నా ఎక్కువ ఉండేవి కాదు.
ఈ రెండు దగ్విషయాలకు పరస్పర సంబంధం ఉంది. ఆహార ధాన్యాల వ్యాపారం అంటేనే ప్రయివేటు వ్యాపారులు అనాసక్తిగా ఉండేట్టు చేసిన మార్కెట్లోని డిమాండ్ను బట్టి చూస్తే, ప్రభుత్వం వద్ద పోగు పడిన నిల్వలు ఒక దీర్ఘ కాలిక ''అదనపు సరఫరా''ను సూచిస్తాయి. తగినంత డిమాండ్లేని కారణంగా ఇంత పెద్ద ఎత్తున నిల్వలు పోగుపడినాయన్న వాస్తవం తెలవడంతో, ప్రయివేటు వ్యాపారులు తమ కంటే ప్రభుత్వమే ఈ నిల్వలను ''కొనుగోలుదారుల మార్కెట్''కు తీసుకొని పోవాలని భావిస్తారు. ఈ వాస్తవం వ్యాపారుల స్వంత సేకరణను తగ్గిస్తుంది. ఫలితంగా మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తిలో, ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ పెరుగుదల కనిపిస్తుంది.
ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల రేటు జనాభా పెరుగుదల రేటు కన్నా (బొటాబొటికి కొంచెం) మించినపుడు, ఆహార ధాన్యాల మార్కెట్లో నిరంతరం అదనపు సరఫరా దిశగా సాగే ధోరణి ఎందుకు అనేదే ప్రశ్న. భారత ఆర్థిక వ్యవస్థ నయా ఉదారవాద కాలంలో అధిక రేటుతో వృద్ధి చెందుతూ ఉంటుందన్న వాస్తవం అంటే, ఆహార ధాన్యాల కోసం తలసరి డిమాండ్ అధిక రేటు కూడా పెరగాలని అర్థం. పెరుగుతున్న ఆదాయాలతో విభిన్నమైన ఆహారపు అలవాట్ల వలన ఆహార ధాన్యాలకు డిమాండ్ పడిపోయిందనడం పూర్తిగా తప్పుడు వాదన. ఆహార ధాన్యాలను ప్రత్యక్షంగా ఆహారం కోసం మాత్రమే కాకుండా, పరోక్షంగా జంతు ఉత్పత్తుల (పాలు, పౌల్ట్రీ లాంటి) ఉత్పత్తి కోసం కూడా ఉపయోగిస్తున్నారు. ఒక భాగం మానవ వినియోగానికి, పారిశ్రామికంగా ఉపయోగించే విధంగా తయారు చేస్తారు. నిజ ఆదాయాల పెరుగుదల, విభిన్నమైన ఆహారపు అలవాట్ల వలన ఆహారధాన్యాల కోసం (అన్ని రకాల ఉపయోగాల కోసం) తలసరి డిమాండ్ పెరగాలి, తగ్గకూడదు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా ఆహార ఉపయోగంలో ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది.
భారతదేశంలో తలసరి ధాన్యాల ఉత్పత్తి పెరుగుదల సరిపడా లేనందున, ఆహార ధాన్యాలకు నిరంతరం అదనపు డిమాండ్ ఉండాలి. కానీ మనకు భిన్నమైన పరిస్థితి ఉంది. అందువల్లే ప్రపంచ మార్కెట్లో భారతదేశం ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే దేశంగా ఉద్భవించిందా?
కారణమేమంటే, జీడీపీ పెరుగుదల రేటు అధిక స్థాయికి పెరిగినప్పటికీ, కార్మికుల చేతుల్లో తలసరి నిజ ఆదాయాలు గమనించదగిన విధంగా పెరగలేదు. ఇటీవల కాలంలో ప్రభుత్వం వద్ద ఉండే ఆహార ధాన్యాల నిల్వల పెరుగుదల వేగంగా ఉన్నప్పుడు కూడా ఆదాయాలు బాగా క్షీణించాయి.
వాస్తవానికి ఒక చిన్న సందేహం ఏమిటంటే, కార్మికుల్లో తలసరి ఆహారధాన్యాల వినియోగం ఈ నయా ఉదారవాద కాలంలో, ముఖ్యంగా ఇటీవల సంవత్సరాలలో కచ్చితంగా బాగా క్షీణించి ఉండాలి. 1990-91, 2017-18 మధ్య కాలాన్ని తీసుకుంటే, తలసరి ఆహార ధాన్యాల లభ్యతలో ముందుగా ఒక తగ్గుదల, తరువాత ఒక పెరుగుదలను గమనిస్తాం. ఉదాహరణకు, రోజుకు తలసరి ఆహార ధాన్యాల లభ్యతను చూస్తే 1991లో 510గ్రాములు, 2007లో 442.8గ్రాములు, 2018లో 494 గ్రాములుగా ఉన్నాయి. ఈ కాలం నుంచి అసమానతలలో విపరీతమైన పెరుగుదల ఏర్పడుతూ వచ్చింది. ధనిక వర్గాలకు చెందిన ప్రజల ఆదాయాల పెరుగుదల కూడా మొత్తం జీడీపీ కంటే కచ్చితంగా అధికం అయి ఉండి ఉండాలి. వారి తలసరి ఆహార ధాన్యాల వినియోగం (ప్రత్యక్ష, పరోక్ష వినియోగం కలిపి) కూడా గణనీయంగా పెరిగి ఉండి ఉండాలి. అంటే కార్మిక వర్గానికి చెందిన ప్రజల తలసరి ధాన్యాల వినియోగం (వినియోగం ఆహార ధాన్యాల లభ్యతను మించి ఉండి ఉండదు అనుకుంటే) కచ్చితంగా క్షీణించి ఉండి ఉండాలి.
ఆహార ధాన్యాల డిమాండ్ యొక్క స్థితిస్థాపక ఆదాయం సానుకూలంగా ఉన్నంతకాలం, అంటే నిజ ఆదాయ పెరుగుదలకు తోడుగా అనివార్యంగా మొత్తం ఆహార ధాన్యాల డిమాండ్ పెరుగుదల ఉన్నప్పుడు, తలసరి ఆహార ధాన్యాల వినియోగ క్షీణత కూడా తప్పకుండా తలసరి నిజ ఆదాయాల తగ్గుదలతో సహవాసం చేయవలసిందే. అంటే నయా ఉదారవాద విధానాల ప్రారంభానికి, కరోనా మహమ్మారి వ్యాప్తికి మధ్య కాలంలో (రెండు కాలాల ముగింపుల మధ్య) కార్మికవర్గ ప్రజల తలసరి నిజ ఆదాయాల తగ్గుదల కచ్చితంగా ఉండి ఉండాలి.
ఈ అభిప్రాయం, పోషకాహార సమాచారాన్ని కూడా అనుసరిస్తుంది. నేషనల్ సాంపుల్ సర్వే నిర్వహించిన 1993-94, 2011-12 సంవత్సరాల మధ్య కాలంలో (గ్రామీణ భారతదేశంలో పేదరికాన్ని నిర్వచించడానికి తీసుకునే కొలమానం 2200 కేలోరీలు) రోజుకు ఒక వ్యక్తి 2200 కేలోరీల కన్నా తక్కువ పోషకాహారాన్ని తీసుకునే గ్రామీణ ప్రజల సంఖ్య 58శాతం నుంచి 68శాతానికి పెరిగింది. అదేవిధంగా పట్టణ పేదరికాన్ని నిర్వచించడానికి తీసుకునే కొలమానం రోజుకు ఒక వ్యక్తికి 2100 కేలోరీల పోషకాహారం. భారతదేశ నగర ప్రాంతాల్లో 2100 కేలరీల పోషకాహారం పొందలేని వారి సంఖ్య 57శాతం నుంచి 65శాతానికి పెరిగింది.
2011-12 తరువాత పరిస్థితి మరింతగా దిగజారింది. 2012లో రోజుకు తలసరి నికర ఆహార ధాన్యాల లభ్యత 463.8గ్రాములు. 2013 నుంచి వరుసగా 2018 సంవత్సరం వరకు 491.9, 489.3, 465.1, 486.8, 488.7, 494.1 గ్రాముల ఆహార ధాన్యాల లభ్యత ఉంది. లభ్యత, వినియోగం సమానం కాదు. ఎందుకంటే లభ్యత ప్రయివేటు నిల్వలలోని మార్పులను మినహాయిస్తుంది. కానీ ఈ రెండు కలిసి ప్రయాణిస్తాయి అని అనుకోవచ్చు. పెరుగుతున్న అసమానతల కారణంగా ధనవంతులలో తలసరి వినియోగం పెరుగుతూ వస్తుంది కాబట్టి కార్మికవర్గ ప్రజానీకం యొక్క తలసరి ఆహార ధాన్యాల వినియోగం కచ్చితంగా తగ్గి ఉండాలి. 2014 సంవత్సరం నుంచి మోడీ ప్రభుత్వ హయాంలో కార్మికవర్గ ప్రజల తలసరి ఆహార ధాన్యాల వినియోగం బాగా పడిపోయింది. దానికి, ప్రజల నిజ ఆదాయాలు పడిపోయాయి అన్న వాస్తవం తప్ప, వేరే కారణమే లేదు. మనకున్న ఇతర ఆధారాలు, ఇటీవల కాలంలో పెరుగుతున్న నిరుద్యోగంతో పాటు గ్రామీణ భారతంలో 2011-12, 2017-18 మధ్య కాలంలో ప్రజల నిజ వినియోగపు ఖర్చు కూడా బాగా క్షీణించింది.
కార్మికవర్గ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి బదులుగా, మోడీ ప్రభుత్వం ఆహార ధాన్యాలను ఈథనాల్గా మార్చేందుకు అనుమతించడం ద్వారా ఆహార ధాన్యాల ''అదనపు సరఫరా''ను వదిలించుకొనే పథకం రచించడం విచిత్రం గాను, ఆశ్చర్యం గాను ఉంది.
''పీపుల్స్ డెమోక్రసీ'' సౌజన్యంతో
ప్రభాత్ పట్నాయక్
అనువాదం: నీహాగౌతమ్,సెల్:9848412451