Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకి జేమ్స్ బాండ్ సినిమాలు బాగా తెలుసు. ఆ సినిమాలు అన్నిటిలోనూ హీరోగా అమెరికా గూఢచారి ఉంటాడు! విలన్గా సోవియట్ యూనియన్కు చెందిన కె.జి.బి. కమ్యూనిస్టు గూఢచారి ఉంటాడు. ప్రపంచాన్ని సర్వ నాశనం చేసేందుకు ఆ కమ్యూనిస్టు గూఢచారి చేసే దుర్మార్గ ప్రయత్నాలను అమెరికన్ గూఢచారి వమ్ము చేస్తుంటాడు. ఆ రోజుల్లో జేమ్స్ బాండ్ సినిమాల్లో కథలన్నీ కమ్యూనిస్టులను విలన్స్గా చూపించడానికి మాత్రమే రూపొందించేవారు. మన ప్రధానమంత్రి భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా కొంతమంది దష్టిలో స్థానిక జేమ్స్బాండ్. మరి ఈ జేమ్స్బాండ్కి కూడా ఒక విలన్ కావాలి కదా! వాళ్ళకి కేరళ కమ్యూనిస్ట్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ దొరికారు. అమెరికా రచయితలు బాండ్ సినిమాల కోసం రాసిన పచ్చి అబద్ధాల కథల మాదిరిగానే ఈ కట్టు కథలు రాసిన రచయిత కూడా తలస్సెరి మత ఘర్షణలకు పినరయి విజయన్ను విలన్గా చేశారు.
1971 డిసెంబర్ 28, 29, 30 తేదీలలో తలస్సెరిలో మత ఘర్షణలు జరిగిన మాట నిజమే! వాటి ఉద్రిక్తతలు 1972 జనవరి 1వ తేదీ వరకూ కొనసాగాయి. కానీ ఈ ఘర్షణలలో అజిత్ దోవల్, పినరయి విజయన్ పాత్రల చుట్టూ ఈ కట్టు కథా రచయిత అల్లిన కథలన్నీ మాత్రం పచ్చి అబద్ధాలు. నిజానికి అక్కడి మత ఘర్షణలకు ప్రధాన బాధ్యత ఆర్.ఎస్.ఎస్., జనసంఘ్ పార్టీలదేనని అప్పట్లో కేరళ ప్రభుత్వం నియమించిన ఒక కమిషన్ స్పష్టం చేసింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి జస్టిస్ జోసఫ్ విథాయత్తిల్ నేతత్వంలోని ఆ కమిషన్ 130 పేజీల నివేదికను సమర్పించింది. ఆర్.ఎస్.ఎస్. నిర్వహిస్తూ వచ్చిన ముస్లిం వ్యతిరేక, విద్వేష పూరిత ప్రచారం, జనసంఫ్ు పార్టీ కార్యకర్తల ప్రత్యక్ష కార్యక్రమాల ఫలితంగా ఘర్షణలు జరిగాయని ఆ నివేదిక పేర్కొన్నది. తలస్సెరి ఘర్షణల సందర్భంగా దాదాపు 480 దాడుల ఘటనలు నమోదు అయ్యాయి. అందులో ముస్లింలపై జరిగిన దాడుల సంఖ్య 80 శాతం పైగా ఉన్నాయి. ముస్లింలపై జరిగిన దాడులు అన్నీ పథకం ప్రకారం జరిగాయని, దానికి తక్షణ స్పందనగా హిందువులపై ప్రతి దాడులు జరిగాయని ఆ నివేదిక పేర్కొన్నది. ఘర్షణలలో వివిధ రాజకీయ పక్షాలు నిర్వహించిన పాత్రపై కూడా కమిషన్ సుదీర్ఘంగా చర్చించింది. సెక్యులర్ పార్టీలు అయిన సి.పి.ఐ., సి.పి.ఎం. వంటి వామపక్షాలు ఘర్షణల నివారణ కోసం, శాంతి, సామరస్యం నెలకొల్పడానికి కషి చేసినట్లు ఆ నివేదిక స్పష్టం చేసింది. ఇరుగు పొరుగు ముస్లింలను దాడుల నుండి రక్షించడానికి వామపక్ష కార్యకర్తలు వారికి రక్షణ కల్పించిన ఉదంతాన్ని కమిషన్ ప్రస్తావించింది. ఘర్షణల రెండో రోజు సి.పి.ఎం నాయకులు పట్టణంలో ప్రశాంతత నెలకొల్పడానికి విజ్ఞప్తి చేస్తూ జీపుపై పట్టణంలో పర్యటించిన సంగతిని కమిషన్ ప్రస్తావన చేసింది. అసలు జరిగిన విషయం అది!
సరే మన స్థానిక జేమ్స్బాండ్ చుట్టూ అల్లిన కథ సంగతి చూద్దాం. అప్పటికి కొట్టాయంలో అదనపు ఎస్.పి.గా వున్న అజిత్ దోవల్ను తలస్సెరిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం 1972 జనవరి 2న అక్కడికి పంపించారు. ఎవరు? నాటి హోం మంత్రి కరుణాకరన్. అప్పటి ముఖ్యమంత్రి సి.అచ్యుతమీనన్. ఆయన సుప్రసిద్ధ సి.పి.ఐ. నాయకుడు. అప్పట్లో కేరళలో అధికారంలో వున్నది కాంగ్రెస్, సీపీఐ సంకీర్ణ ప్రభుత్వం. ఈ కట్టు కథా రచయితకు ఇవన్నీ తెలిసినట్లు లేదు. నిజానికి అజిత్ దోవల్ తలస్సెరి వచ్చేసరికే ఉద్రిక్తతలు చల్లారాయి. ఆయన ప్రధానంగా ఇరుపక్షాల ప్రజల నుండి దుండగులు లూటీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకుని బాధితులకు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటికే ముస్లిం బాధితుల రక్షణకు నిలబడిన వామపక్ష పార్టీలు ఆయనకు సహకరించాయి. నిజానికి సి.పి.ఐ అధికార కూటమికి నేతత్వం వహిస్తున్నది. సి.పి.ఎం. ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తున్నది. అయినా ప్రజలను మత ప్రాతిపదికన విభజించేందుకు ఆర్.ఎస్.ఎస్. చేసిన ప్రయత్నాలను రెండు పార్టీలు ఎదుర్కొన్నాయి. అలాగే ముస్లింలీగ్లో పొడసూపిన మతతత్వ ధోరణులను రెండు వామపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకించాయి. అటువంటి పరిస్థితుల్లో సామరస్య సాధన కోసం కృషి చేస్తున్న సి.పి.ఎం. నేతలను అజిత్ దోవల్ అరెస్ట్ చేయాల్సిన అవసరం యేముంది?
కట్టుకథలు రాసే వాళ్ళకి ఇలాంటి లాజిక్ అక్కర్లేదు. వాళ్ళకి కావాల్సింది ఎవరో ఒకళ్ళ మీద బురద చిమ్మడం. అందులో భాగంగానే ఈ కథలో పలు చవకబారు మలుపులు తిప్పారు. తప్పతాగిన గూండాలను వెంటబెట్టుకుని పినరయి విజయన్ జీపులో తిరుగుతున్నట్లూ, ఆయన్ని అజిత్ దోవల్ తెచ్చి పోలీస్స్టేషన్లో పెట్టినట్టూ రాసుకొచ్చిన ఈ కథా రచయితకు దాంతో తృప్తి కలగలేదు. విజయన్ను పీక పట్టుకుని అజిత్ దోవల్ ఎత్తి పట్టినట్టు దాంతో విజయన్ కళ్లు తేలవేసినట్లు పచ్చి అబద్ధాల కట్టుకథను సృష్టించాడు. అక్కడితో ఈ నీచ కథారచయిత ఆగలేదు. అజిత్ దోవల్ రివాల్వర్ చూపించేసరికి పినరయి విజయన్ లుంగీలో మల, మూత్ర విసర్జన చేసుకున్నారట. అజిత్ దోవల్ ఖరాబు అయిన పోలీస్స్టేషన్ను విజయన్ తోనే కడిగించాడట. రచయిత అక్కడ ప్రత్యక్షంగా వుండి దీన్ని స్వయంగా చూసినట్లు పరమ లేకిగా రాశాడు. థర్డ్ రేట్ మనుషుల ఆలోచనలు ఇంతే థర్డ్రేట్గా ఇలాగే ఉంటాయి. నిజానికి అప్పటికి పినరయి విజయన్ స్థానిక శాసన సభ్యుడు. కేరళ స్టేట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా చేశారు. సి.పి.ఎం. అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. అజిత్ దోవల్ కొత్తగా వచ్చిన ఒక జిల్లా అదనపు ఎస్.పి. మాత్రమే. తలస్సెరి ఘటనల సందర్భంగా పినరయి విజయన్ మీద నిజానికి ఎలాంటి కేసులు లేవు. కేసులు లేని వాళ్ళని కూడా స్టేషన్కి తెచ్చి ఉచ్చ పోయిస్తే తప్ప మన జేమ్స్బాండ్ గొప్పవాడు కాలేడు పాపం వీళ్ళ సినిమా కథల దష్టిలో!
విజయన్ ఒక ఎమ్మెల్యే అన్న సంగతిని దాచి ఏదో గాలి రౌడీ అన్నట్లుగా చిత్రీకరించి అజిత్ దోవల్ సూపర్ కాప్ అన్నట్లుగా ఈ కట్టుకథలో రాసుకొచ్చారు. అప్పటికి కొత్తగా ఉద్యోగంలో చేరిన అజిత్ దోవల్ అంత సూపర్ కాప్ కానూ కాడు. పినరయి విజయన్ గాలి రౌడీ అంత కన్నా కాదు. కేరళలో ఒక కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేపై కొత్తగా వచ్చిన అడిషనల్ ఎస్పీ అంత దూకుడుగా వెళ్ళడం కేవలం ఇలాంటి కట్టుకథల్లో మాత్రమే సాధ్యం. ఇదంతా పినరయి విజయన్ మీద కరడు గట్టిన విద్వేషంతో రాసిన రాతలని వాటిని చూస్తేనే అర్థమవుతుంది. పైగా విజయన్ తన పేరు మార్చుకున్నాడని ఒక కుళ్లు జోకు ఒకటి. ఆయన తండ్రి పేరు కొరన్. ఆయన స్వగ్రామం పినరయి. అందులో పేరు మార్చాల్సిన అవసరం ఏముంటుంది?
ఆయన మీద ఎందుకు ఇంత ద్వేషం అంటే కారణం ఒక్కటే కనిపిస్తోంది. ఆయన కమ్యూనిస్టు. కరోనా కట్టడిలో ఆయన ప్రభుత్వం అద్భుత కృషి చేస్తోంది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేరళ ఎంతో ముందంజలో ఉంది. ఐ.రా.స. తో సహా ప్రపంచం అంతా ఆయన్ని ప్రశంసిస్తోంది. అదీ ఆయన మీద అసూయకు, ద్వేషానికి కారణం! కేవలం తమ పని ద్వారా మాత్రమే మంచి పేరు తెచ్చుకునే వారిపై ఏ పనీ చేతకాని, ఏ పనీ చేయలేని వాళ్ళే ఇలాంటి సిగ్గుమాలిన కట్టుకథలు అల్లుతారు. దేశం మీదకి వదులుతారు.
ఇక ఈ కథ చివర ఓ పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. కమ్యూనిస్టు కల్చర్లో ఎవరైనా నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారంటే వాళ్ళ చరిత్ర ఇలాగే వుంటుందట! అంత చరిత్రలోకి వెళ్లదలచుకునే కట్టు కథా రచయితలు కమ్యూనిస్టు సాహిత్యమే చదవనక్కరలేదు. శుభ్రంగా వికీపీడియాలో వెతుక్కోవచ్చు. కొన్నయినా వాస్తవాలు దొరుకుతాయి. ఇ.ఎం.ఎస్. నంబూద్రిపాద్, ఇ.కె.నయనార్, అచ్యుత మీనన్, వాసు దేవన్ నాయర్, జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య, దశరథ్ దేవ్, మాణిక్ సర్కార్ వంటి కమ్యూనిస్ట్టు ముఖ్య మంత్రుల గురించి ఏముందో తెలుస్తుంది! కానీ అవాకులు చవాకులు రాయడానికి చరిత్రలు చదవనక్కర లేదు కదా!
శబరిమలై సంరక్షణ పేరుతో బీజేపి నేతలు కేరళలో యాత్ర ప్రారంభించినపుడు కూడా పినరయి విజయన్ మీద ఇలాంటి కట్టు కథ మరొకటి ప్రచారం లోకి తెచ్చారు. 1968లో జరిగిన ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త వి.రాధాకష్ణన్ హత్య కేసులో పినరయి విజయన్ను అప్పట్లో నిందితునిగా పేర్కొన్నారు. రుజువులు, సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు విజయన్ను నిర్దోషిగా ప్రకటించింది. యాభై సంవత్సరాలు పూర్తయి, ప్రజలంతా మరిచిపోయిన ఈ హత్యోదంతాన్ని తమ యాత్ర సందర్భంగా బీజేపీ వారు మరోసారి వెలుగులోకి తెచ్చారు. ఈ యాత్రలో పాల్గొనడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేరళ వచ్చారు. ఆ సందర్భంగా వాళ్ళకి ఒక మీడియా ఈవెంట్ కావాల్సి వచ్చింది. ఆనాటి హత్యకు ప్రత్యక్ష సాక్షులు అంటూ ఇద్దరు కార్యకర్తలను బీజేపి మీడియా ముందు పెట్టింది. పినరయి విజయన్ గొడ్డలి పట్టుకుని, రెండు వందల మంది పార్టీ కార్యకర్తలతో సహా హత్యాస్థలంలో వుండగా చూశామని వారిద్దరూ చెప్పారు. మరి ఇన్నేళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నకు సి.పి.ఎం. అంటే వున్న భయంతో నోరు విప్పలేకపోయామని వాళ్ళిద్దరూ సమాధానం చెప్పారు. కమ్యూనిస్టు ముఖ్యమంత్రిపై వీళ్ళకి ఉన్న అక్కసు తప్ప ఈ ఆరోపణలో పస లేదని విశ్లేషకులు ఆ రోజే గాలి తీసేశారు. వీలున్న ప్రతి సారీ ప్రచారానికి పనికొచ్చే ఏదో ఒక కట్టు కథతో ముందుకు రావడం ఆర్.ఎస్.ఎస్. ప్రచారకులకు ఒక అలవాటు. ఃఃఇది కథ కాదుఃః అనే కట్టు కథ కూడా అలాంటిదే! అందులో గుడ్డి కమ్యూనిస్ట్టు ద్వేషం తప్ప ఇంకేమీ లేదు. ఇంత ద్వేషం ఆరోగ్యానికి మంచిది కాదు.
లి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్పై సామాజిక మాధ్యమాలలో వ్యాప్తిలో ఉన్న ఒక కట్టు కథకు స్పందన లి
-డి. సోమసుందర్
(వ్యాస రచయిత సీనియర్ పాత్రికేయుడు)