Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన జాతీయ విద్యా విధానం 2020లో మాద్యమం, భాషల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ లభించింది. ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకోగలిగితే తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం ముఖ్యంగా పాఠశాల విద్య కొత్త పుంతలు తొక్కే అవకాశం కలుగుతుంది. పేరా 4.11లో ''సాధ్యమైన చోట, 5వ తరగతి వరకు, అవకాశం ఉంటే 8వ తరగతి దాకా, ఆ తర్వాత కూడా విద్యా మాధ్యమంగా ఇంటిభాష/ మాతృభాష/ స్థానిక భాష/ ప్రాంతీయ భాషలో అమలు చేయాలి'' అని సూచించబడింది. పేరా 4.13లో ''త్రిభాషా సూత్రం కొనసాగించబడుతుందని, ఏ మూడు భాషలు అనేది ఆయా రాష్ట్రాలు/ ప్రాంతాల యిష్టం, విద్యార్థుల అభీష్టం. అయితే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలి'' అని సూచించడం జరిగింది. కానీ పేరా 4.17లో ''మూడు భాషల్లో ఒకటిగా సంస్కృతంను స్వీకరించాలి'' అని చెప్పబడింది.
ఈ విధానం ప్రకారం వివిధ పాఠశాలల్లో అమల్లో వున్న విద్యా మాధ్యమాలు యథాతథంగా కొనసాగవచ్చు లేదా మార్చుకోదలిస్తే మార్చుకోవచ్చు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో ఇంగ్లీష్, హిందీ మాధ్యమాలే కొనసాగుతాయని కేంద్ర విద్యాశాఖ అధికారులు చెప్పారు. ప్రయివేట్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం కొనసాగడానికి అభ్యంతరం ఏమీ లేదు. విద్యార్థుల అభీష్టం అంటే తల్లిదండ్రుల అప్షనే గనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ప్రారంభించిన ఇంగ్లీష్ మీడియంను నిస్సంకోచంగా అమలు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తల్లిదండ్రుల కోరిక మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయాల్సి ఉంటుంది. కానీ తెలుగు మాధ్యమంలోనే చదివించాలను కునే తల్లిదండ్రుల కోరికను అమలు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన ఉంటుంది. 2-8 సంవత్సరాల లేత వయసులోనే పిల్లలు ఏ భాషను అయినా సులభంగా నేర్చుకోగలరని పరిశోధనల్లో తేలిందని పేరా 4.12లో పేర్కొనబడింది. సైన్సు, గణితం పాఠ్య పుస్తకాలను ఇంటి భాష/ మాతృ భాష/ ఇంగ్లీషులో మంచి అందంగా నాణ్యంగా ప్రచురించి సమర్థవంతంగా బోధించగలిగితే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేరా 4.14లో ఉన్నది. అందువలన ఈ సరికొత్త సూత్రీకరణలు, సూచనలను తెలుగు రాష్ట్రాలు తమకు అవరమైన మేరకు సరిగా అన్వయించుకుంటే పాఠశాల విద్యలో విప్లవాత్మకమైన మార్పు రాగలదు.
ఎనిమిదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషలు నేర్పితే చాలు. భారతదేశానికి పరిపాలనా పరంగా ఐక్యత, సమగ్రత బ్రిటిష్ పాలనా కాలంలోనే సమకూరింది. దాదాపు వందేండ్లపాటు భారతీయ భాషలతో కలిసి పరిపాలనలో, కమ్యూనికేషన్లో ప్రజలను ఆవహించిన భాషను విస్మరించడం సాధ్యం కాదు. 72సంవత్సరాల స్వపరిపాలనలో కూడా దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న చట్టాలు, న్యాయస్థానాల్లో ఇంగ్లీష్ భాషే ప్రధానమైంది. 1980 నుంచి ప్రపంచాన్ని ఆవహించిన సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ విధానాలతో ఇంగ్లీష్ అవసరం బాగా పెరిగింది. ప్రపంచ అనుసంధాన భాషగా అలరారుతోంది. అందువలన ఇంగ్లీష్ భాష పట్ల, ఇంగ్లీష్ మీడియం పట్ల ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవాలి. అన్ని విషయాల్లో లిబరల్గా వ్యవహరిస్తున్నట్టే మీడియం విషయంలో కూడా లిబరల్గా ఉండవచ్చు. ఈ విషయం నూతన విద్యా విధానంలో కూడా ఉందనే విషయాన్ని గుర్తించాలి. భాషేతర సబ్జెక్టులు అయిన సైన్సు, గణితంలను తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లో మేళవించి ద్విభాషా మాధ్యమం (బైలింగ్వల్ మీడియం)గా బోధించాలి. నార్వే, స్కాండినేవియా, కొన్ని ఆఫ్రికా దేశాల్లో బైలింగ్వల్ మీడియా అమల్లో ఉంది. మరాఠా మాధ్యమం గల మహారాష్ట్రలోని మెజారిటీ స్కూళ్లలో మాథ్స్, సైన్స్ సబ్జెక్ట్లను, హిందీ మాధ్యమం గల ఉత్తరాఖండ్లోని 15వేల పాఠశాలల్లో సైన్స్ సబ్జెక్ట్ను ఇంగీషులో బోధిస్తున్నారు. అది కూడా ద్విభాషా మాద్యమమే అవుతుంది. భౌగోళిక, సామాజిక, ఆర్థిక, పరిపాలనా పరమైన విషయాలకు సంబంధిచిన సాంఘిక శాస్త్రంను తెలుగులోనే బోధించాలి. ఎలిమెంటరీ లెవెల్లో రెండు భాషలు, మూడు భాషేతర మొత్తం ఐదు సబ్జెక్టులకే పరిమితమైతే విద్యార్థులపైన భారం కూడా తగ్గుతుంది.
మూడు భాషల్లో ఒకటిగా సంస్కృతం ఉండాలని చేసిన సూచనను పాటించాల్సిన అవసరం లేదు. కమ్యూనికేషన్కి గానీ, ఉపాధి ఉద్యోగ అవకాశాలకు గానీ ఉపయోగపడని సంస్కృత భాషను పాఠశాల స్థాయిలో నేర్పడం ఎందుకు? 2011 జనాభా లెక్కల్లో 24,852 (0.00198) మంది మాత్రమే మాతభాషగా చెప్పుకున్న అత్యంత మైనార్టీ భాషకు అంత ప్రాధాన్యత యివ్వడం బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసం తప్ప విద్యార్థులకు ఏమి ప్రయోజనం? భారతీయ సమాజానికి అత్యంత అవమానకరమైన అంటరానితనం, కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న మనువాద సనాతన సంస్కృతిలో భాగమైన భాషను నేర్పితే సమాజానికే నష్టం. విద్యార్థుల భవిష్యత్తుకు, జీవితానికి తోడ్పడని విద్యా విధానంలోని ఏ అంశాన్ని అయినా అమలు చేయకుండా వదిలివేసే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. తమిళనాడు రాష్ట్రంలో 1968 నుంచి రెండు భాషల (తమిళం, ఇంగ్లీష్) విధానమే అమల్లో వున్న విషయం తెలిసిందే. ఆమాటకొస్తే హిందీ రాష్ట్రాల్లో మూడో భాషగా హిందీయేతర రాష్ట్రాల్లోని ఏదో ఒక భాషను బోధించాలనే త్రిభాషా సూత్రంను హిందీ రాష్ట్రాలు కూడా అమలు చేయడం లేదు. మూడోభాషగా సంస్కృతం అమల్లో ఉంది. హిందీయేతర రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో కూడా ఆయా రాష్ట్రాల్లోని అధికార భాషను విస్మరించి సెకండరీ స్థాయిలో సంస్కృత భాషనే అమలు చేస్తున్నారు. అందుచేత తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషలు చాలు. తాజా విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని కూడా అమలు చేసేది లేదని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విద్యా విధానంలో వదిలివేయబడిన హిందీ భాషను బోధించాల్సిన అవసరమూ లేదు. మే నెల 31న ప్రకటించిన ముసాయిదా విధాన పత్రంలోని త్రిభాషా సూత్రంలో సూచించిన హిందీ భాషను తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలు వ్యతిరేకించడంతో రెండు రోజుల్లోనే ఆ వాక్యాన్ని మార్చేసి హిందీని అప్షనల్ సబ్జెక్టుగా పెట్టారు. ఆమోదించిన పత్రంలో హిందీ మాటే లేకుండా చేశారు. విద్యారంగంలో బీజేపీ అనుసరిస్తున్న సంకుచిత రాజకీయ అవకాశవాద ధోరణికి అదొక నిదర్శనం.
నాగటి నారాయణ
సెల్: 9490300577