Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి తన చుట్టూ తాను తిరు గుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెపుతుంటారు. కాని ఈ భూప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందని ఆర్థిక శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అవును నిజమే లేకపోతే మనిషి డబ్బు సంపాదన కొరకు ఎందుకింత ఆరాటపడుతాడు. రాత్రింబగళ్లు తెగ హైరానా పడిపోతున్నాడు. అడ్డదారుల్లో అయినా లక్షలు పోగేయలను కుంటున్నాడు, కోటీశ్వరుడు కావాలను కుంటున్నాడు. ప్రాణమున్న మనిషికన్నా ప్రాణంలేని డబ్బుకే ఈరోజు సమాజంలో విలువ ఎక్కువ. డబ్బున్నవాడి మాటకున్న విలువ డబ్బులేనివాడి మాటకు లేదు. ఎంత చదువుకున్నా, ఎంత విజ్ఞానమున్నా కూడా. అందుకే భూప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతుందనడంలో తప్పు లేదనిపిస్తుంది.
మనిషి తను బతకడానికి, అదేవిధంగా తన భవిష్యత్ అవసరాల కోసం డబ్బు సంపాదించాలనుకుంటాడు. ముఖ్యంగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు కావాలి మనిషికి. అదేవిధంగా పిల్లలను పెంచి, పెద్దచేసి వారిని ప్రయోజకులుగా చేయాలి. ఇవిపోను తన ఆరోగ్య అవసరాలకు ఇంకా ఇంట్లో జరిగే రకరకాల వేడుకలకు, అనుకోకుండా సంభవించే కొన్ని ఆపత్కాల అవసరాలకు, ఇంకా ఇతరత్రా అవసరాలకు డబ్బు అవసరం. అయితే ఈ అవసరాలన్నీ తీరడానికి ఎంత డబ్బు కావాలి. దానికేమన్నా ఒక పరిమితి ఉందా? లేక ఒక కొలమానమేమైనా ఉందా? తమ తమ సామాజిక స్థాయిని బట్టి ఈ అవసరాలన్నీ తీరడానికి కొంతమందికి కొన్ని వేలు సరిపోతాయి కావచ్చు. ఇంకొంత మందికి కొన్ని లక్షలు సరిపోతాయి కావచ్చు. మరికొంత మందికి కొన్ని కోట్లు అవసరం కావచ్చు.
ఉదాహరణకు ఒక వ్యక్తి తన జీవితం ఎలా ఉండాలో నిర్దేశించుకుంటాడు. దానికనుగుణంగా అతను అడుగులు వేస్తుంటాడు. తాననుకున్న దాన్ని సాధించడానికి అనుక్షణం కష్టపడుతుంటాడు. ఎవరైనా కూడా తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రతి ప్రయత్నం న్యాయంగా, ధర్మంగా, చట్టపరంగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి ప్రయత్నంలో తాను అనుకున్నది సాధించలేకపోతే, తన శక్తి సామర్థ్యాలకన్నా తను ఏర్పరుచుకున్న టార్గెట్ పెద్దగా ఉంటే అప్పుడు అతడు తన సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి లేదా తన టార్గెట్ని కుదించుకోవాలి. కానీ అందుకు అవకాశమివ్వదు ఈ పెట్టుబడిదారీ సమాజం. కానీ సామర్థ్యాన్ని పెంచుకోకుండా, టార్గెట్ని కుదించుకోకుండా ఉండాలనుకున్నప్పుడు మనిషి అడ్డదారులకై వెతుకుతాడు. ఇందుకు అనేక అవకాశాలను కల్పిస్తూ ప్రేరేపిస్తుంది ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ.
ఈ మధ్యనే ఒక మండల రెవెన్యూ అధికారి ఒక కోటి పది లక్షల రుపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత తెలిసిందేమిటంటే అతనికి అప్పటికే వంద కోట్ల ఆస్తిపాస్తులు ఉన్నాయని. అయినా కూడా ఆయన దాహం తీరడం లేదు. అది మరిచిపోకముందే ఒక అదనపు కలెక్టర్ స్థాయి వ్యక్తి 1.12 కోట్లు లంచం డిమాండ్ చేసి 40లక్షలు తీసుకుంటూ రెడ్హ్యండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తున్నాం ఈనాటి సమాజంలో. మనిషి ఒకసారి అక్రమ సంపాదనకు అలవాటు అయితే మద్యం సేవించడం, పొగతాగడం లాగా అది కూడా వ్యసనంగా మారుతుంది. సునాయాసంగా వచ్చే అలాంటి డబ్బును వదులుకోలేడు. వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లడం చూశాం. అయినా కూడా ఇంకా లంచాలు తీసుకునే వాళ్లు తీసుకుంటూనే ఉన్నారు.
పెరిగి పెద్దయిన తరువాత ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం దొరకాలని చిన్నప్పటినుంచే తల్లిదండ్రులు పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నారు. దాంతో పిల్లలు స్వతహాగా బాల్యంలో గడపాల్సిన జీవితం కోల్పోయి పుట్టిందే చదవడానికన్నట్టుగా రాత్రింబగళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఎక్కువ డబ్బులు సంపాదించడానికి మనిషి కన్నవాళ్లను, పుట్టిన దేశాన్ని వదలి విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తూ లేదా ఇతర వ్యాపారాల్లో మునిగి పిల్లలతో గడపడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటు న్నారు. ఎందుకంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి గనక.
రోడ్డు పక్కన పుట్ పాత్ మీద ఉన్న బిచ్చగాణ్ణి చూస్తే వీడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో అనిపిస్తుంది. పొద్దున లేచినప్పటినుంచి టాటా బిర్లాల దగ్గరనుంచి మొదలుపెట్టి చిరుద్యోగి వరకు డబ్బు సంపాదనలో తలమునకలై ఎంతో మానసిక సంఘర్షణకు గురవుతుంటారు. కానీ ఆ బిచ్చగాడు మాత్రం కాలుమీద కాలు వేసుకొని పడుకొని వచ్చే పోయే ట్రాఫిక్కుని చూస్తుంటాడు. అతనికి ఏ విధమైన ఆరాటాలు లేవు. ఎలాంటి మానసిక సంఘర్షణలు ఉండవు. కేవలం ఆకలయినప్పుడు అడుక్కోవడం తప్ప. ఎందుకంటే అతనికి డబ్బు సంపాదించే ఆలోచన లేదు కాబట్టి.
ఈరోజుల్లో ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు తగ్గిపోతున్నాయి. ఆస్తుల పంపకాలలో గొడవలతో పిల్లలు తల్లిదండ్రులతో విభేదిస్తున్నారు. సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు బద్ద శత్రువులైపోతున్నారు. డబ్బు కోసం వ్యాపార భాగస్వాములు ఒకరిని ఒకరు మోసం చేసుకుంటున్నారు, చంపుకొంటున్నారు. కట్నం డబ్బులు సరిపోలేదని అత్తింటివారు కోడళ్లను వేధించి, కడతేర్చిన ఉదాహరణలు కూడా ఎన్నో చూశాం. డబ్బు సంపాదనలోపడి మనిషి స్వతహాగా తనకుండాల్సిన దయ, జాలి, పక్కవారి పట్ల సానుభూతి, నైతిక విలువలు అన్నీ కోల్పోతున్నాడు. అది వ్యక్తి లోపం కాదు, వ్యవస్థలోపం. పెట్టుబడిదారీ వ్యవస్థలో డబ్బుకు లోకం దాసోహం. మనిషి మనిషిగా మనగలిగేది సోషలిస్టు సమాజంలోనే.
వి. రవిశంకర్
సెల్:9440768894