Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రాల హక్కులను కాజేస్తూ, రాష్ట్రాలను తమ జేబు సంస్థలుగా మార్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నది. ఫెడరలిజం, లౌకికతత్వం, ప్రజాస్వామ్యం అను పదాలకు అర్థాలను మార్చడం, అందుకనుగుణంగా గత చట్టాలను సవరణ చేయడం లేదా కొత్త చట్టాలు రూపొందిం చడం, పార్లమెంట్లో తనకున్న బలాన్ని వినియోగించుకొని ఆమోదింప జేసుకోవడమే మోడీ ప్రభుత్వం పనిగా ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వమూ రాష్ట్రాల హక్కులను కాజేయడానికి సహసించలేదు. కానీ ఈ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత భారత రాజ్యాంగానికి విరుద్దంగా చట్టాలను రూపొందిస్తున్నది. కార్పొరేట్ సంస్థలకు, బహుళ జాతి గుత్త సంస్థలకు, పెట్టుబడిదారీ భూస్వాములకు, లాభాలు చేకూర్చి పెట్టడమే కాక, ఆస్తుల సంపాదనకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం ఈ చట్టాలను చేస్తున్నది.
1. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ.
బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు, పప్పు ధాన్యాలు, నూనెగింజలు, ఆలుగడ్డ, ఉల్లి, విత్తనాలు తదితర ఉత్పత్తులన్ని రాష్ట్రాలలో నిత్యావసర సరుకుల చట్టంలో ఉన్నాయి. వీటిని నిత్యావసర వస్తువుల చట్టం నుండి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం జూన్ 5, 2020న ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ చట్ట సవరణతో ప్రభుత్వానికి ధరల నిర్ణయంపైనగానీ, ఆక్రమంగా నిల్వ చేసుకోవడంపైన గానీ ఎలాంటి నియంత్రణ ఉండదు. సరుకులు కొనుగోలు చేసి మార్కెట్లలోకి రానివ్వకుండా దాచిపెట్టు కొని అధిక రేట్లకు అమ్మి, రైతుల్ని, వినియోగదారులను దోచుకోవటానికి ఈ సవరణ లైసెన్స్ ఇచ్చింది. గతంలో మ్యాన్శాంటో బీటీ విత్తనాల ధరలు 450 గ్రాములకు రూ.1830లు ఉండగా ఈ చట్టం కిందకు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర తగ్గించి రూ.730కి రైతులకు అందజేసింది. వినియోగదారులకు, ఉత్పత్తి దారులకు ఉపయోగపడే ఇంత కీలక చట్టాన్ని కార్పొరేట్ వ్యాపారులకు లాభాలు కట్టబెట్టడానికి కేంద్రం సవరణ చేసింది. ఈ చట్టం లోక్ సభలోనూ, రాజ్యసభలోను ఆమోదింప చేసుకున్నారు.
2. మండి (మార్కెట్) సమితులు, ఏపీయంసీ
(వ్యవసాయోత్పత్తులు, వాణిజ్యం, వ్యాపారం) సవరణ చట్టం - 2020
రైతులకు ఆదాయ భరోస ఇచ్చేదిగా పిలుస్తూ, రైతులను మభ్య పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దేశంలో ఈ చట్టం కింద 6500 మార్కెట్లు గుర్తించారు. వీటికి సబ్ యూనిట్లుగా 28000 మార్కెట్లు ఉన్నాయి. ఇంత వరకు మార్కెట్ బయట కొనుగోళ్ళకు అవకాశం లేదు. 2015లో వ్యవసాయ మార్కెట్ల చట్టాన్ని సవరణ చేస్తూ నిటి ఆయోగ్ ముసాయిదా చట్టాన్ని రాష్ట్రాలకు పంపింది. అప్పటి నుంచి ఏకీకృత మార్కెట్ చట్టం చేయటానికి కేంద్రం ప్రయత్నించి 2020 జూన్ 5న ఆర్డినెన్స్ తెచ్చి ప్రస్తుతం 20 సెప్టెంబర్ 2020న లోక్సభ, రాజ్యసభ ఆమోదం పొందారు. ఈ చట్టం ద్వారా ప్రయివేట్ మార్కెట్ యార్డులను కార్పోరేట్ సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. వీరు కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉండదు. క్రమంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయాన్ని కూడా ఎత్తివేస్తుంది. ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు ఇస్తున్న బోనస్లు, రాయితీలు, ఇతర రక్షణ చర్యలు రైతులు కోల్పోవాల్సి వస్తుంది. ఈ కంపెనీలు ఎగుమతి, దిగుమతులను కూడా నిర్వహిస్తాయి. ఎగుమతులు చేయడానికి ఇక్కడి వ్యవసాయోత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయాలి. ఆ రైతులకు గిట్టుబాటుకాక ఉత్పత్తి నుంచి దూరం అవుతారు. చివరకు ఈ దేశం దిగుమతుల దేశంగా మారిపోతుంది. మండిల చట్టం వల్ల రైతులు కార్పొరేట్ సంస్థల చేతుల్లో బలిపశువులు అవుతారు.
3. ఒప్పంద సాగు (కాంట్రాక్ట్ ఫార్మింగ్) చట్టం
దీనిని ధరల గ్యారెంటీ ఒప్పంద సాగు, సేవల (సాధికారం, రక్షణ) చట్టం 2020గా పిలుస్తున్నారు. ఈ చట్ట ప్రకారం రైతులు కార్పొరేట్ సంస్థలతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని సాగు చేయాలి. టోకు వ్యాపారాస్తులతో, ఎగుమతి దారులతో, పెద్ద రిటైల్ సంస్థలతో మన రైతులు కాంట్రాక్ట్ కుదుర్చుకోవాలి. కంపెనీ ఆంగీకరించిన ధరకు నియమించిన నియమాలకు అనుగుణంగా ఉత్పత్తులు చేయాలి. సహజంగా నియమాలకు అనుగుణంగా ఉత్పత్తులలో తేడాలు ఉంటాయి. వాటిని అవకాశంగా తీసుకొని నిర్ణయించిన ధరలు తగ్గించి కొనుగోలు చేస్తారు. అలాగే కాంట్రాక్ట్ వ్యవసాయంలో భూములను ఏకీకరణ చేసి భారీ యంత్రాలతో సాగుచేసి చివరకు రైతుల భూములను కాజేస్తారు. ఇప్పటికే దేశంలో 43 కోట్ల ఎకరాల సాగు భూమిలో 25శాతం భూమి కాంట్రాక్ట్ వ్యవసాయం కిందనే సాగు అవుతున్నది. దేశంలో గల 14.65 కోట్ల రైతు కుటుంబాలలో 85శాతం మంది రైతులు 5ఎకరాలకు లోపు కలిగిన వారే ఉన్నారు. వీరు తమ భూములను కోల్పోతారు. చివరకు కార్పోరేట్ సంస్థల వల్ల ఉత్పత్తి ధర రాక రైతులు భూములను కోల్పోవాల్సి వస్తుంది. ప్రకృతి వైఫరీత్యాల వల్ల జరిగే నష్టాలన్నీ రైతే భరించాల్సి ఉంటుంది. ఒకసారి కంపెనీ నియంత్రణలోకి పోయిన తరువాత వారు ప్రమాదకరమైన జన్యూమార్పిడి విత్తనాలతో పాటు, సస్యరక్షణ మందులను కూడా తమ ఇష్టం వచ్చినట్లు ప్రవేశ పెడతారు. ఆ విధంగా రైతులు భూముల నుండి నెట్టి వేయబడతారు.
4. విద్యుత్ సవరణ చట్టం
ఈ చట్ట ప్రకారం రాష్ట్రాల విద్యుత్ హక్కులన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయి. కేంద్రం కేటాయించిన విద్యుత్ను రాష్ట్రాలు వినియోగించుకోవాలి. అత్యధిక రేటు ఉన్న సంప్రదాయ విద్యుత్ను, కార్పొరేట్ సంస్థలు ఉత్పత్తి చేసిన విద్యుత్ను వినియోగించు కోవాలని చట్టంలో సూచించారు. చివరకు రాష్ట్రాల్లో రెగ్యులేటరీ కమిషన్లపైన కేంద్ర రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసి రేట్లు నిర్ణయిస్తారు. 2003 చట్టంలో 39 సవరణలు చేశారు. అందులో సెక్షన్ 109కి 10 (ఏ) కొత్తగా చేర్చారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్ మెంట్ ఆథారిటీ కేంద్రం ఏర్పాటు చేస్తుంది. రీజినల్ డిస్పాచింగ్ బాధ్యతలు సెంట్రల్ డిస్పాచింగ్ పవర్కు దఖలు పరుస్తారు. రాష్ట్రాలకు ఎలాంటి హక్కులూ ఉండవు. ట్రాన్స్ మిషన్, వీలింగ్ చార్జీలు తగ్గించి ఎక్కడి నుంచి ఎక్కడికైనా విద్యుత్ సరఫరా చేసి ఉత్పత్తి దారులకు లాభాలు కట్టబెడతారు. ప్రస్తుతం దేశంలో సంప్రదాయ విద్యుత్ అనగా హైడల్ 46 వేల మెగావాట్లు, సోలార్, గాలి 70,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నారు. దీని రేట్లు ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ ఈ విద్యుత్ను వినియోగంలోకి తేవటానికి ఈ చట్టం సహకరిస్తుంది. విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న కార్పొరేట్ సంస్థలకు వీపరితమైన లాభాలు చేకూర్చడానికి, వినియోగదారు లపై వేల కోట్ల భారాలు వేస్తారు.
5. విత్తన చట్టం
కార్పొరేట్ సంస్థల లాభాల కొరకు పార్లమెంట్లో విత్తన చట్టం 2004 నుంచి 2020 సెప్టెంబర్ వరకు పెండింగ్లో ఉంది. మోడీ ప్రభుత్వమూ కార్పొరేట్ల వత్తిడికి విత్తన చట్టం తేవటానికి నిరాకరి స్తున్నది. వాస్తవానికి రాష్ట్రాలలోనే విత్తన చట్టం చేయాలి. కానీ బడా కార్పొరేట్ విత్తనోత్పత్తి సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లపై వత్తిడి తెచ్చి విత్తన చట్టం రాకుండా చూస్తున్నారు. 1966 దిగుమతి విత్తన చట్టం నేటికి కొనసాగుతూనే ఉన్నది. నేడు భారత దేశం విత్తనాలను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఈ స్థితిలో కూడా విత్తన చట్టం లేకపోవడం వల్ల విత్తనోత్పత్తి రైతులు కార్పొరేట్ విత్తన వ్యాపార సంస్థలకు బలి పశువులు అవు తున్నారు.
6. ఇ-నాం మార్కెట్
2017లో కేంద్ర ప్రభుత్వం ఇ-నాం మార్కెట్ (ఎలక్ట్రానిక్ నేషనల్ ఆగ్రికల్చర్ మార్కెట్) చట్టాన్ని తెచ్చింది. రాష్ట్రాలలోని మార్కెట్ చట్టాలను సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం విఫలమైందని స్వయంగా ప్రధాని మోడీ ఆగస్టు 2020లోనే ప్రకటించాడు. అయినప్పటికీ ఈ చట్ట ప్రకారం ఏక గవాక్ష పద్ధతి, వ్యవసాయోత్పత్తి, మార్కెట్ కమిటీ సమాచారం, సేవలు తదితర అంశాలపై సవరణలు తెచ్చారు. మండీల ద్వారా ఆన్లైన్లో మార్కెటింగ్ చేయటానికి ఇందులో సూచించారు. రాష్ట్రాలలోని అనేక మార్కెట్లు విడిగా నిర్వహణ చేయకుండా అన్ని మార్కెట్లను కలిపి ఇ-నాం పద్ధతిలోకి తెచ్చారు. దేశంలోని మార్కెట్లను ఆన్లైన్ ద్వారా ఏకీకరణ చేయడం, కార్పొరేట్ కొనుగోలు దారులకు అనుకూలం గా ధరలు నిర్ణయించడం జరిగింది. ఇ-నాం మార్కెట్లో ధరలు తగ్గడంతో రైతులు దేశవ్యాప్తంగా ఈ పద్ధతిని అమలు జరపటానికి నిరాకరించారు.
ఒకే దేశం, ఒకే భాష, ఒకే మార్కెట్, ఒకే పన్ను పేర్లతో ఇంత వరకు అనేక చట్టాలను తెచ్చి రాష్ట్రాల హక్కులను కాజేశారు. ఒకే పన్ను పేరుతో జీఎస్టీ అమలులోకి తెచ్చి నేడు రాష్ట్రాలకు మూడు లక్షల కోట్ల రూపాయల నష్టాలను కలిగించారు. ఇంత వరకు తెచ్చిన చట్టాల వల్ల ఇప్పటికే రాష్ట్రాలు కేంద్రం చుట్టూ చేతులు కట్టుకొని తిరిగే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ప్రజాస్వామ్యాన్ని కాపాడు కోవటానికి, ఫెడరల్ విధానాన్ని రక్షించు కోవటానికి లౌకికవాదులు, మేధావులు, దేశాభివృద్ధి కోరేవారు, ఐక్యంగా కృషి చేయాలి.
- సారంపల్లి మల్లారెడ్డి
సెల్:9490098666