Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సభ్యుల నుంచి పదే పదే డిమాండ్ వస్తున్నప్పటికీ వ్యవసాయ బిల్లులోని వివాదాస్పదమైన రెండు అంశాలపై ఓటింగ్ నిర్వహించడానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ ఆదివారం తిరస్కరించారు. గతంలో ఎన్నడూ సభాధ్యక్షులు ఇటువంటి తీరులో వ్యవహరించడం కనివినీ ఎరుగలేదు. బిల్లు లోని కొన్ని అంశాలను రాజ్యాంగపరంగా, ఆచరణాత్మకంగా ప్రతిపక్షాలు సవాలు చేస్తున్నాయి. అదొక భిన్నమైన అంశం. కానీ, ఓటింగ్కు సంబంధించి అనుసరించిన పద్ధతులు మాత్రం చాలా అసంబద్ధంగా, అస్పష్టంగా వున్నాయి. మూజువాణి ఓటు సవాలు చేయబడినపుడు, ఆటోమేటిక్ ఓటు రికార్డర్ ద్వారా లేదా లాబీల్లోకి సభ్యులు వెళ్లడం ద్వారా ఓట్లు లెక్కించాలి. ఒకవేళ ఓటింగ్ పెట్టాలని ఒక్క సభ్యుడు కోరినా కూడా...దాన్ని నిర్వహించి తీరాలి. చాలాసార్లు, ప్రత్యేకంగా ఒక బిల్లుపై ఫలితం ఎలా ఉంటుందో తెలిసినప్పటకీ, పార్టీల, సభ్యుల వైఖరి రికార్డు చేయడానికి గాను, ఓటింగ్ పెట్టాలని డిమాండ్ చేస్తారు. సభ్యులు సీట్లలో కూర్చుని డిమాండ్ చేయరాదని, పైగా సభలో పరిస్థితులు అదుపు తప్పాయంటూ వివరణ ఇవ్వడం చాలా అసంబద్ధంగా వుంది. ఆ వివరణలో చిత్తశుద్ధి లోపిస్తోంది. ఓటింగ్కు ఆదేశించడానికి సభాధ్యక్షులు తిరస్కరించడంతోనే సభలో పరిస్థితులు అదుపు తప్పాయి. పైగా, ఈ గందరగోళం ఇలా కొనసాగుతుం డగానే బిల్లులు ఆమోదం పోందాయని సభాధ్యక్షులు ప్రకటించారు. ఈసారి సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నా ఆ ప్రకటనకేమీ అడ్డం రాలేదు. ఈ బిల్లులో కొన్ని ముఖ్యమైన సవరణలు చేయాలని సభ్యులు కోరుతున్నారు. పైగా ఆ బిల్లులను పార్లమెంటరీ సెలక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బిల్లుల ఆమోదానికి సభలో నిస్సిగ్గుగా అనైతికంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో బిల్లులను ఆమోదించ డానికి అవసరమైన మెజారిటీ వుందని ప్రభుత్వం చెప్పుకోవడం అసంగతంగా, సందేహాస్పదంగా ఉంది. ఏ కేసులోనైనా, ఏ పక్షానికి మెజారిటీ వుందనే దానితో నిమిత్తం లేకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించడం అత్యుత్తమమైనది. పార్లమెంటరీ అధికారాలను పునరుద్ఘాటించడానికి ఓటింగ్ కీలకమైన సాధనం. అంతేకానీ ఓటింగ్ నిర్వహణను సభాధ్యక్షులు లేదా ప్రభుత్వ దయా దాక్షిణ్యాల స్థాయికి కుదించరాదు.
ఎగువసభలో నెలకొన్న గందరగోళ పరిస్థితులు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగలేదు. పైగా అవాంఛనీయం కూడా. పార్లమెంట్ అనేది చర్చలకు వేదికగా ఉండాలి తప్ప నిరసన ప్రదర్శనలకు వేదికగా ఉండరాదు. ఎన్ని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనలు వెలిబుచ్చుతూనే సభా మర్యాదకు కట్టుబడ్డారు. అయితే, అర్ధవంతమైన పార్లమెంటరీ చర్చలు చాలా అరుదైపోయాయి. తరచుగా ప్రతిపక్షాల వాణిని పెడచెవిన పెడుతున్నారు. మనీ బిల్లులను ఏకపక్షంగా ఆమోదించడం ద్వారా ఇప్పటికే ఎగువసభ అధికారాలు గణనీయంగా కుదించబడ్డాయి. ఓటింగ్కు తిరస్కరించడం పార్లమెంటరీ చరిత్రలోనే ఎన్నడూ లేదు. ఇదొక కొత్త అప్రతిష్టాకరమైన పరిణామం. పైగా అక్కడితో ఆగలేదు, 8మంది ప్రతిపక్ష సభ్యులను వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. సభాధ్యక్షులు వెంకయ్య నాయుడు సమక్షంలోనే డిప్యూటీ చైర్మన్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును తిరస్కరించారు. మూజువాణి ఓటుతో ఆమోదించిన ఈ రెండు వ్యవసాయ బిల్లులకు ఆమోద ముద్ర వేయవద్దని ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కోరాయి. పార్లమెంట్ సమర్ధవంతమైన, అర్ధవంతమైన పని తీరును పునరుద్ధరించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాల్సి వుంది.
- ('ది హిందూ' సంపాదకీయం)