Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వం 2020 జూలై 29న నూతన జాతీయ విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. విద్యా విషయంపై ఎన్డీఏ ప్రభుత్వ మొట్ట మొదటి ప్రధాన విధాన పత్రమిది. అంతకు ముందు వాజ్పేయి ప్రధాన మంత్రిగా ఉన్న ప్రభుత్వం స్కూల్ టెక్స్ట్ పుస్తకాలలో ముఖ్యంగా చరిత్ర పుస్తకాలలో కొన్ని మార్పులను తీసుకొచ్చింది. మోడీ ప్రభుత్వం ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యా మంత్రిత్వశాఖ రూపొందించిన 67పేజీల విధాన పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. విద్యావిధానానికి సంబంధించిన ఈ కొత్తపాలసీ మన దేశాన్ని ఒక జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతుందని ప్రధానమంత్రి ప్రకటించారు. కానీ ఈ నూతన పాలసీని విశ్లేషిస్తే ప్రభుత్వం చెబుతున్నట్టుగా విద్యా విషయంలో మనదేశం ప్రపంచానికి మార్గదర్శిగా మారుతుందన్న దాఖలాలు ఏమీ కనిపించడం లేదు.
ప్రపంచ బ్యాంక్ జోక్యం
కొత్త విద్యావిధానం అమలు వల్ల భారతదేశ విద్యావ్యవస్థలో ఒక నూతనశకం మొదలవుతుందన్న ప్రభుత్వ వాదనను విశ్వసించలేం. మోడీ ప్రభుత్వం కూడా ఇంతకు ముందున్న ఇతర ప్రభుత్వాలలాగానే విద్య విషయంలో ప్రపంచ బ్యాంక్ నమూనానే అమలు చేస్తున్నది. నయా ఉదారవాద విధానాల అమలు వల్ల విద్యారంగంలో కూడా కార్పొరేట్ అనుకూల విధానాలు అమలయ్యాయి. విద్యారంగంలో మార్కెట్ నమూనాను తీసుకురావడం వల్ల విద్యారంగంలో ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ పెరిగింది. ప్రయివేటు పెట్టుబడిదారుల కోసం విద్యారంగంలో పబ్లిక్ పెట్టుబడులను ఉపసంహరించడం లేదా తగ్గించడం జరిగింది. ప్రభుత్వం కన్నా ఎక్కువగా ప్రభుత్వేతర సంస్థలు విద్యారంగంలో పెట్టుబడులు పెట్టాలన్న విధానం వల్ల నాన్ స్టేట్ ఏక్టర్స్ పేరు మీద బహుళ జాతి, స్వచ్ఛంద, ధార్మిక, మత సంస్థల జోక్యం విద్యారంగంలో విపరీతంగా పెరిగింది.
ప్రధానమంత్రి భారతదేశాన్ని ఆత్మనిర్భర దేశంగా మార్చేద్దామన్న పిలుపునిచ్చారు. భారతదేశం ప్రపంచానికే గురువు అని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వ మానవవనరుల మంత్రిత్వశాఖ ఇటీవలనే ప్రపంచ బ్యాంక్తో ఒక ఒప్పందాన్ని చేసుకున్నది. ఇది ఆరు రాష్ట్రాలలోని విద్యారంగంలో జోక్యం చేసుకొనే అవకాశాన్ని ప్రపంచ బ్యాంక్కు కలుగచేస్తుంది. విద్యారంగంలో ప్రపంచ బ్యాంక్ మొదటి జోక్యం 1993-2002 మధ్యన డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (డిపెప్) ద్వారా జరిగింది. ఇది ప్రభుత్వ రంగంలోని ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి ప్రయివేటు బడులకు పెద్ద మార్కెట్ను సృష్టించింది. ప్రపంచ బ్యాంక్ రెండవ జోక్యం 2002లో సర్వ శిక్ష అభియాన్ ద్వారా జరిగింది. ప్రాథమిక విద్యను సార్వజనీనం చేసే ఉద్దేశంతో చేపట్టబడిన ఈ పథకం చివరకు వివిధ రకాల బడులను ఏర్పర్చడానికి మాత్రమే పరిమితమైపోయింది. 20కోట్ల విద్యార్థులున్న ప్రాథమిక స్థాయి విద్యా మార్కెట్ను మరింతగా ప్రయివేటు సంస్థలకు, ఎడ్యుటెక్ కంపెనీలకు అప్పగించే ఉద్దేశంతో ప్రపంచ బ్యాంక్ మన విద్యా వ్యవస్థలో ఇప్పుడు ముచ్చటగా మూడవసారి జోక్యం చేసుకోబోతున్నది.
విద్యారంగ ప్రయివేటీకరణ
నయా ఉదారవాద విధానాల అమలు వల్ల విద్యారంగంలో ప్రయివేటీకరణ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం పాఠశాలల్లో చేరే విద్యార్థులలో 45శాతం మంది ప్రయివేటు బడులలోనే చేరుతున్నారు. కాలేజీలలో చేరే విద్యార్థులలో 66.4శాతం మంది ప్రయివేటు కాలేజీలలోనే చేరుతున్నారు. వృత్తి విద్యా కోర్సులలో చేరే విద్యార్థులలో 72.5శాతం విద్యార్థులు ప్రయివేటు కాలేజీలలోనే చేరుతున్నారు. 2014-15, 2018-19 మధ్య ప్రయివేటు యూనివర్సిటీలలో అడ్మిషన్లు 55శాతం పెరిగాయి. ఈ కాలంలోనే విద్యపై పెట్టే ఖర్చు ప్రతి ఇంటికి 50శాతం కన్న ఎక్కువగా పెరిగింది.
ఇంత పెద్దగా ప్రయివేటీకరణ జరుగుతున్న నేపథ్యంలో విడుదల చేయబడిన నూతన విద్యా విధాన పత్రం విద్యారంగ ప్రయివేటీకరణను అడ్డుకోవడానికి ఉపయోగపడాలి. కానీ, ఎన్ఈపీి 2020 ప్రయివేటీకరణ గురించి ఏమీ మాట్లాడదు. ఇంకా చెప్పాలంటే ప్రయివేటీకరణను ఎన్ఈపీ 2020 ప్రోత్సహిస్తుంది. విద్యారంగ వ్యాపారీకరణను ఎన్ఈపీ 2020 గుర్తించినా దాన్ని కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలనూ సిఫారసు చేయదు. పబ్లిక్ సంస్థలతో సమానంగా ప్రయివేటు సంస్థలను ఎన్ఈపీ 2020 గుర్తిస్తుంది. విద్యారంగ అభివృద్దిలో ప్రయివేటు సంస్థలకు పబ్లిక్ సంస్థలతో సమానమైన భాగస్వామ్యం ఉండాలని ఎన్ఈపీ 2020 చెపుతున్నది. ప్రయివేటు రంగం పాత్ర మరింత పెరగాలని విద్యారంగంలో వాటికి ముఖ్యమయిన పాత్ర ఉండాలని ఎన్ఈపీ 2020 అభిప్రాయపడింది. విద్యారంగానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయ పత్రంలో ప్రయివేటు రంగానికి ఇంత ప్రాధాన్యత దక్కడం ఇదే మొదటిసారి.
బహుళత్వంపై దాడి
నయా ఉదారవాద విధానాల అమలుతో పాటు మితవాద రాజకీయాల ఆలోచనా సరళి ఈ విద్యావిధాన పత్రంలో కనిపిస్తుంది. విద్యావిధానంలోకి హిందూత్వ సిద్ధాంతాలను చొప్పించే ప్రయత్నం చేసారు. పాలకపార్టీ విద్యావ్యవస్థను తన ప్రయోజనాలకు అనుకూలంగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నది. విధాన పత్రం సంస్కృతి రక్షణ గురించి విపులంగా చర్చించింది. సంస్కృతి రక్షణ పేరుతో సాంస్కృతిక జాతీయవాదం అన్న తన లక్ష్యం వైపు విద్యా వ్యవస్థను నడిపించే ప్రయత్నం ఈ విధాన పత్రం ద్వారా చేసింది.
భారతీయ భాషలు అత్యంత గొప్ప భాషలనీ, అలాగే శాస్త్రీయమైన సుందరమైన భాషలనీ ఎన్ఈపీ 2020 పేర్కొంది. అయితే విద్యా విధాన పత్రంలో మాత్రం కొన్ని భాషలకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. త్రిభాషా సూత్రంలో హిందీ, సంస్కృత భాషలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఉర్దూ కూడా భారతీయ భాషనే కానీ ఉర్దూ భాషకు క్లాసికల్, ప్రాంతీయ భాషల లిస్ట్లో చోటు దక్కలేదు. విదేశీ భాషల లిస్ట్లో రష్యన్, స్పానిష్, జర్మన్, జపనీస్ ఉన్నాయి కానీ మండారిన్ (చైనా)కి చోటులేదు. భారతదేశ చరిత్రలోని కొన్ని అధ్యాయాలను తీసివేసే ఉద్దేశంతో పాఠ్యాంశాలను మార్చి వేసే ప్రయత్నం జరుగుతున్నది. ప్రాచీన భారతదేశ జ్ఞానం ఆధునిక భారత దేశానికి ఎలా ఉపయోగపడిందో చెప్పడం బాగానే ఉంది. కానీ మధ్య యుగాలనాటి చరిత్రను, అది భారతీయ విజ్ఞానాన్ని సుసంపన్నం చేసిన విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం విధానకర్తల పక్షపాత ధోరణికి నిదర్శనంగా ఉంది. ప్రాచీన భారతదేశ వారసత్వ జ్ఞానం కింద బుద్ధుడు, మహావీరుడు, చార్వాకుడు, లోకాయత సిద్ధాంతల గురించి కానీ, ద్రవిడ సాహిత్యం గురించి కానీ, సూఫీ వారసత్వం గురించి కానీ విధాన పత్రంలో ఎలాంటి ప్రస్తావన లేదు.
రిజర్వేషన్స్ గురించి విధాన పత్రం ఏమీ మాట్లాడలేదు. అణగారిన వర్గాలకు విద్య అందుబాటులో లేకపోవడంలో పితృస్వామ్యం, కుల ఆధిపత్య ధోరణుల పాత్ర గురించి విధాన పత్రం ఏమీ చెప్పలేదు. కుల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా మాట్లాడిన ఫూలే దంపతులు, సాహు మహారాజ్, పెరియార్, నారయణగురు, అంబేద్కర్ లాంటి వారి గురించి కూడా ఎలాంటి ప్రస్తావన లేదు.
అధికారాల కేంద్రీకరణ
ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు అన్ని నిర్ణయాల కేంద్రీకరణను ఎన్ఈపీ ప్రతిపాదిస్తున్నది. దీనికిగాను హైయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్, నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్, జనరల్ ఎడ్యుకేషన్ కమిషన్, నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ లాంటి సంస్థలను ఏర్పరిచే ప్రతిపాదనలను విధాన పత్రం చేసింది. దీని వల్ల విద్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, బాధ్యతలు కుచించుకుపోతాయి. స్థానిక సంస్థలు, ట్రైబల్ కౌన్సిల్లకు వివిధ చట్టాల ద్వారా సంక్రమించిన అధికారాలు బలహీనపడుతాయి. విద్యా విధానాన్ని తమ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా మార్చుకొనే హాక్కు రాష్ట్రాలకు ఉండదు. విద్య అనే అంశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యతగా (కంకరంట్ లిస్ట్) ఉన్నది. కానీ ప్రతిపాదించిన ఈ మార్పుల వల్ల మన దేశ సమాఖ్య స్వభావం దెబ్బ తినే ప్రమాదం ఉన్నది.
కార్పొరేట్ వ్యాపార ప్రయోజనాల రక్షణ
విద్యావిధానంలో ఆన్లైన్ విద్యకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు. ఆన్లైన్ విధానం వల్ల విద్యలో నాణ్యత పెరుగుతుందని, ప్రపంచ స్థాయి విద్య భారతీయ విద్యార్థులకు అందుతుందని చెబుతున్నారు. ఈ వాదనలకు ఎలాంటి ప్రామాణికత లేదు. ఉపాద్యాయుని రూపంలో మానవజోక్యం ఉండడమే సరైనదనీ, విద్యార్థి, ఉపాద్యాయులకు ఉండే సంబంధాలు విద్యలో నాణ్యతను పెంచుతాయనీ విద్యావేత్తల అభిప్రాయం. అయితే ఆన్లైన్ విద్యా మార్కెట్ రానున్న నాలుగైదు ఏండ్లలో 15బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఒక అంచనా. ఆన్లైన్ విద్యకు కేంద్ర ప్రభుత్వ మద్దతును, రిలయన్స్ ఇండిస్టీలో గూగుల్ పెట్టిన పెద్ద మొత్తాల పెట్టుబడులను ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి.
స్థూల జాతీయ ఉత్పత్తిలో 6శాతం విద్యపై ఖర్చు పెడతామని ఎన్ఈపీ 2020 వాగ్దానం చేసింది. కానీ దీనికై ఎలాంటి నిర్దిష్ట ప్రతిపాదనలను విధాన పత్రం చేయలేదు. విద్యార్థుల సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా విద్యార్థులందరికీ ఒకే విధమైన పాఠశాలలు ఉండేట్టుగా ఉమ్మడి పాఠశాల వ్యవస్థను రూపొందించడంలో ఎన్ఈపీ 2020 విఫల మయ్యింది. జ్ఞానాన్ని వస్తువీకరించే ప్రయత్నాలను, విద్యను వ్యాపారీకరించే ప్రయత్నాలను అడ్డుకోవడానికి ఏన్ఈపీ ఎలాంటి చర్యలను చేపట్టలేదు. ప్రపంచ బ్యాంకుకు మన విద్యావ్యస్థలో జోక్యం చేసుకొనే అవకాశాన్ని ఇచ్చారు. విద్యాహక్కు చట్టాన్ని బలహీనం చేశారు. విధానపత్రంలోని ప్రతిపాదనలు విద్యావకాశాలలో, విద్యా వసతులలో ఉన్న అసమానతలను మరింత పెంచుతాయి. అన్ని స్థాయిలలో విద్య నాణ్యతను తగ్గిస్తాయి. నయా ఉదారవాద విధానాల వైఫల్యం, మహమ్మారి వల్ల సృష్టించబడిన ఆరోగ్య, ఆర్థిక సంక్షోభం విద్యా వ్యవస్థలో ఉన్న అసమానతలనూ, సంక్షోభాన్నీ మరింత పెంచుతుంది. ఈ పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం చాలా వేగంగా విద్యారంగంలో సంస్కరణలను తెచ్చే ఉద్దేశంతో ముందుకు సాగుతుంది. ఎన్ఈపీ 2020 విద్యారంగంలో ప్రయివేటు పెట్టుబడులను పెంచి మొత్తం విద్యావ్యవస్థను ప్రయివేటు పెట్టుబడులకు అప్పగించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలి.
- కె. వేణుగోపాల్