Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో నగరాల నడుమ బుల్లెట్ రైళ్ళు, తెలంగాణలో ఆరు ప్రాంతాలలో విమానాశ్రాయాలు అనే మాటలు వినసొంపుగా ఉంటాయి. పశ్చిమ కనుమల్ని చీల్చుకుంటూ ముందుకు సాగే రైల్వేలైన్లు అనే మాటలు ఆకట్టుకుంటాయి. ఫలితంగా అభివృద్ధి మన దరిదాపుల్లోకి వచ్చిందని సంబరపడటం విస్మయంగొల్పదు. ఎందుకంటే అభివృద్ధి మంత్రం జపించే యుగంలో ఉన్నాం. ఆరుగాలం పంటలు పండించే రైతు గిట్టుబాటు ధర రాక పడే వెతలు ఎవరికీ వినిపించవు. ఏ చానల్ కూడా వినిపించదు. కానీ తెలంగాణలో ఆరు నగరాల్లో విమానాశ్రయాల అనే మాటకు ఎనలేని ప్రచారం లభిస్తుంది. అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నామన్న భావన మురిపిస్తుంది. కానీ ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి?
దేశంలో బీజేపీ పాలన మొదలయ్యాక ఉదారవాద ఆర్థిక విధానాల అమలు వేగం పెరిగింది. పెట్టుబడిదారీ వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతూ ప్రాకృతిక వనరుల్ని అతిశీఘ్రంగా కొల్లగొట్టే అభివృద్ధి వ్యూహాలు అమలవుతున్నాయి. ఈ క్రమంలోనే బుల్లెట్ రైళ్ళ గురించిన ప్రస్తావన పదేపదే వినిపిస్తున్నది. దేశంలో ఉన్న రైళ్ళలో కనీస సౌకర్యాల లేమి బాహాటంగా కనిపిస్తున్నది. అవసరమైన ప్రాంతాలకు రైల్వే లైన్లు వేయడానికి కేంద్రం చొరవ చూపింది తక్కువ. రద్దీగా ఉండే రూట్లలో రైళ్ళ సంఖ్యని పెంచేందుకు, వసతి సౌకర్యాల కల్పనకు సంబంధించిన విధానాలు కనిపించవు. రైలు ప్రమాదాల నివారణకు అవసరమైన సిగలింగ్ వ్యవస్థ, రైల్వే క్రాసింగ్ వంతెనల నిర్మాణం వంటి పలు సమస్యలు పరిష్కారానికి నోచుకోవు. కానీ ఆకస్మికంగా బుల్లెట్ రైలు ప్రాజెక్టుల గురించిన హంగామా ఎవరికోసం? ఎందుకోసం?
పెట్టుబడిదార్ల కోసమే 'అభివృద్ధి' జపం
మానవాళి పురోగతికి, జీవన ప్రమాణాల ఉన్నతికి తోడ్పడాలి అభివృద్ధి. ఇందుకు భిన్నంగా తమ లాభాలకు అనువైన అభివృద్ధి వ్యూహాల్ని అమలు చేస్తూ వ్యాపింపజేయడం పెట్టుబడిదారీ వ్యవస్థ లక్షణం. 'అభివృద్ధి' భావనని పెంచి పోషించింది పెట్టుబడిదారీ వ్యవస్థ. పశ్చిమ దేశాల 'అభివృద్ధి' నమూనాల్ని తూర్పుదేశాల మీద రుద్దింది. ఈ వ్యూహాల అమలుకు నగర కేంద్రిత అభివృద్ధి అవసరమైంది. ఈ క్రమాన గ్రామాల విధ్వంసం, నగరాల విస్తృతి ప్రపంచీకరణ అభివృద్ధి నమూనాలకు మరింత అవసరమైంది. గత మూడు దశాబ్దాల అభివృద్ధి తీరుతెన్నుల్ని గమనిస్తే ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
పల్లెల్లో బతకలేక పట్టణాలకు, నగరాలకు వలసపోవడం అనివార్యమైన స్థితిని కల్పిస్తారు. అమెజాన్ లాంటి సంస్థలకు లాభసాటి వ్యాపార కూడళ్ళు నగరాలే. అందుకోసమే 2040 నాటికి దేశంలో సగం జనాభా నగరాల్లో ఉండేలా అభివృద్ధి వ్యూహాలు అమలు చేస్తున్నారు. జనాభా కేంద్రీకరణ నగరాల మీద ఎంత ఒత్తిడి పెంచుతుందనడానికి రెండు నెలల కిందట హైదరాబాద్ నగరంలో వెల్లువెత్తిన వరద ఉధృతే దాఖలా. మురుగు నీటి సదుపాయం, మంచినీటి వసతి కల్పించలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నా, నగర కేంద్రిత అభివృద్ధి గురించి మాట్లాడటం ప్రభుత్వాలకు పరిపాటి. రియల్ఎస్టేట్ బేహారులకు, అమెజాన్ వంటి బహుళజాతి సంస్థలకీ, బ్యాంకింగ్ కార్యకలాపాలకు నగరాలు ప్రయోజనకరం. కానీ సామాన్య ప్రజలు నింపాదిగా, నిశ్చింతగా, హాయిగా ఉండేందుకు నగరాలు అనువుగా లేవు. బతకడమంటే కేవలం ప్రాణాలతో ఉండటం, గంటల తరబడి పని చేయడం కాదు. పనికోసమే పుట్టినట్టుగా కొందరు ఊహ తెలిసినప్పట్నించి పనిలోనే పగలు రేయి గడపాల్సి రావడం విషాదం. ఈ విషాదానికి మూలాలు 'అభివృద్ధి' మంత్రాన్ని జపించే పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నాయి.
గ్రామాల్లోనే అధిక జనాభా
ఏడు దశాబ్దాల స్వాతంత్య్రానంతరం కూడా దేశ జనాభాలో అరవై శాతం మంది గ్రామాల్లోనే నివశిస్తున్నారు. వ్యవసాయం, దాని అనుబంధమైన పనుల్లో నిమగమై బతుకు సాగిస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు వచ్చే నెలసరి ఆదాయం రూ.8000 కన్నా తక్కువే. అయినప్పటికీ గ్రామాల్లోనే అరవై శాతం జనాభా ఉందన్నది వాస్తవం. గ్రామాల్లో పనుల్లేక వలసపోయే వారి సంఖ్య బాగానే ఉన్నప్పటికీ దేశజనాభాలో అత్యధికులు పల్లెపట్టుల్లోనే ఉన్నారు. వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన అభివృద్ధి వ్యూహాల గురించి పాలకులు యోచించడం మానేశారు. స్మార్ట్ సిటీల పేరుతో లక్షలు గుమ్మరిస్తున్నారు. పల్లెల ప్రగతి గురించి మాట్లాడటం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యోచనలన్నీ నగరాలతో ముడిపడటం వైచిత్రి కాదు, ఉద్దేశపూర్వక వ్యూహాల సరళి.
తెలంగాణలో చాలాచోట్లకు సరయిన రైల్వే సౌకర్యం లేదు. కానీ ఇప్పుడు విమానాశ్రయాల నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. పల్లెలకీ, పట్టణాలకీ నడుమ బస్సు సౌకర్యాలు సైతం అంతంతమాత్రమే. అయినప్పటికీ విమానాశ్రయాల నిర్మాణంపై యోచించడం ఎవరి ప్రయోజనాల కోసం? తెలంగాణ భూముల్ని ఎవరికి అప్పనంగా అప్పగించడం కోసం? ఇవి మౌలికమైన ప్రశ్నలు. తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతానికయినా కనీస ప్రయాణం ఆరు గంటలకు మించదు. ఈ పరిస్థితిలో బుల్లెట్రైళ్ళు, విమానాలు అవసరమా?
బుల్లెట్ రైళ్ళు
దేశంలో పన్నెండు బుల్లెట్ రైళ్ళను నడపాలని కొన్నాళ్ళ కిందట రైల్వేశాఖ నిర్ణయించింది. పదిలక్షల జనాభా దాటిన నగరాల మధ్య హైస్పీడ్ రైళ్ళను నడపాలని ప్రతిపాదించింది. హైదరాబాద్-బెంగుళూరు, ముంబయి-హైదరాబాద్ల మధ్య బుల్లెట్ ట్రైన్లను నడపాలనే మాటలు, ప్రతీకాత్మక చిత్రాలు వినటం, చూడటం ముచ్చట గొల్పుతాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వస్తే కొన్నేండ్లుగా కొత్త రైల్వేలైన్లకు కేంద్రం ఏమాత్రం సుముఖత కనబరచకపోవడం తెలిసిందే. ఇప్పుడు ఆకస్మికంగా బుల్లెట్ ట్రైన్లు, విమానాశ్రయాల గురించి మాట్లాడటం పుంజుకున్న ప్రయివేటీకరణ వాణిజ్య వ్యూహాల దుష్ఫలితమని గ్రహించాలి. ప్రజల మౌలిక అవసరాలని విస్మరించి లాభదాయకమైన ప్రాజెక్టుల వ్యూహాల్ని రూపొందించడం పెట్టుబడిదారీ కుటిలనీతి. ఈ కుటిలత్వానికి 'అభివృద్ధి' అనే ట్యాగ్లైన్ను జోడించి అమలు చేసే దాష్టీకం కాషాయపాలకుల హయాంలో పెచ్చరిల్లింది. కనుకనే ఇవాళ హైస్పీడ్ రైళ్ళు, బుల్లెట్ రైళ్ళంటూ మాట్లాడుతున్నారు. ఇవ్వన్నీ పక్కాగా కార్పొరేట్ల పేరాశకు లోబడి రూపొందినవే తప్ప ప్రజల అవసరాల దృష్టితో ప్రతిపాదించినవి కావు. కార్పొరేట్ తరహా అభివృద్ధికి మానవముఖం ఉండదు. ప్రకృతిపైన, ప్రాకృతిక వనరులపైన ఏమాత్రం జాలి, దయ ఉండవు. ప్రతిపాదిత హుబ్లీ-అంకోలా రైల్వేలైన్ పట్ల వ్యతిరేకతకు ఇదే మూలం. పశ్చిమ కనుమల సౌందర్యాన్ని, జీవావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసే ఈ రైల్వేలైన్ నిర్మాణం పట్ల పర్యావరణవేత్తలే గాక విభిన్నవర్గాల వారు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ కనుమలకు పెను ప్రమాదం
మన దేశంలో ప్రకృతి సహజమైన సంపదలకు నిలయం పశ్చిమ కనుమలు. ఇవి హిమాలయాల కన్నా పురాతనమైనవి. అత్యున్నతమైన జీవావరణం, జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) ఉన్న ప్రాంతం పశ్చిమ కనుమలు. ఇనుము, మాంగనీసు, అభ్రకం వంటి వాటి కోసం ఇక్కడ గనుల తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నాయి. చట్టవిరుద్ధంగా లక్షలాది టన్నుల ఇనుమును తవ్వి తరలిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు కండ్లు మూసుకున్నాయి. ప్రతి ఏటా లక్షలాది చెట్లను కొట్టివేస్తున్నారు. అరుదైన జంతుజాలం, వృక్షాలు పశ్చిమ కనుమల్లో కనుమరుగవుతున్నాయి.
జీవవైవిధ్యానికి సంబంధించి హాట్స్పాట్గా ప్రసిద్ధి చెందిన పశ్చిమ కనుమల పర్వతశ్రేణి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు ఉన్న ప్రదేశాల్ని సంరక్షించడం, కాపాడటం ఆయా దేశాల ప్రభుత్వాల విధి. ఇందుకు భిన్నంగా అభివృద్ధి పేరిట పశ్చిమ కనుమల విధ్వంసానికి ప్రభుత్వమే పాల్పడటం దుర్మార్గం. ఈ దుష్టత్వంలో భాగమే హుబ్లీ-అంకోలా రైల్వే లైన్. అపారమైన ప్రాకృతిక వైవిధ్యం ఉన్న పశ్చిమ కనుమల పర్వతశ్రేణి విధ్వంసానికి దారితీసే ఈ రైల్వేలైన్ నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం ఆమోదం తెలపడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రతిపాదిత రైల్వే లైన్ ప్రాజెక్టు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉన్నప్పటికీ 'అభివృద్ధి' ప్రవక్తలకు ప్రకృతి వనరులు, జనాల మనోభీష్టం పట్టదని చెప్పడానికి ఇదే ప్రబలమైన ఉదాహరణ.
ఆహారం - అభివృద్ధి
అభివృద్ధి అంతిమంగా మానవాళికి మెరుగైన జీవనాన్ని అందించాలి. ఆరోగ్యకరంగా జీవించడానికి తోడ్పడాలి. ఇందుకు విరుద్ధంగా మనుషుల్ని రోగగ్రస్థుల్ని చేసే విధానాలు ఎల్లెడలా అమలవడం పెట్టుబడిదారీ వ్యవస్థల దుర్మార్గ విధానాల ఫలితమే అన్న గ్రహింపు అవసరం. కొంతకాలం కిందట ఏలూరు, చీరాల ప్రాంతాలలో వింతయిన వ్యాధులతో జనం ఆస్పత్రుల పాలయిన వైనం గురించి విన్నాం. ఆహారంలో కల్తీ, రొయ్యల చెరువుల్లో కల్తీ, నీటిలో వదిలే విషరసాయనాల కారకాల దుష్ప్రభావాల ఫలితంగానే మనుషులు జబ్బుల పాలయ్యారనే సంగతి వైద్య, శాస్త్ర పరిశోధనలతో తేటతెల్లమైంది. అక్కడనే కాదు, అనేకరకాల ఆహార పదార్థాల తయారీలో, మనకు అక్కర్లేని ఆహార ఉత్పత్తుల సరఫరాలో మనుషుల ఆరోగ్యాన్ని క్షీణింపజేసే కారకాలున్నాయి. అయినప్పటికీ వాటిని మద్యం కన్నా ఎక్కువగా అలవాటు చేసి కోట్లు గడించే కార్పొరేట్ కంపెనీల దుర్మార్గం నిరాటంకంగా సాగుతున్నది. మనం గొప్పగా చెప్పుకునే 'అభివృద్ధి' వ్యూహాల విషమ ఫలితాల తీరుతెన్నులకు ఇది నిదర్శనం.
అసమ ప్రాధాన్యాలు
పెట్టుబడిదారీ వ్యవస్థ కన్నా ముందు కూడా మార్కెట్లు, వాణిజ్యం ఉన్నాయి. దేశాల మధ్య వ్యాపార సంబంధాలు, లావాదేవీలు శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కానీ 500ఏండ్ల కిందట మొదలయిన పారిశ్రామిక విప్లవం పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భావానికి దారితీసి సకల దేశాల్ని ముట్టడిస్తూ వచ్చింది. ఈ వ్యవస్థ మనుగడకు అవసరమైన 'అభివృద్ధి'ని ప్రగతికాముక నినాదంగా మార్చింది. పశ్చిమదేశాలకు అభివృద్ధిగా తోచింది తూర్పుదేశాలకు అనువు కానిదని ఎడ్వర్డ్ సెయిద్ లాంటి వారు నలభై ఏండ్ల కిందటనే 'ఓరియంటలిజం' అనే పుస్తకంలో విస్పష్టంగా విశ్లేషించి చూపారు. తమ అవసరాలకు అనువైన అభివృద్ధి వ్యూహాల్ని రూపొందించుకోకపోతే అభివృద్ధి చెందిన దేశాల విషకోరల విన్యాసాలకు వర్థమానదేశాలు బలవుతాయని ఆర్థికవేత్తలు హెచ్చరించారు. వీటిని పెడచెవినపెట్టి ప్రపంచీకరణ పేరిట ఆవాహన చేసుకున్న విధానాలు మన దేశ ఆర్థికవ్యవస్థని చిన్నాభిన్నం చేశాయి.
దేశభక్తి జపం చేసే మన కాషాయ పాలకులు... బహుళజాతి కంపెనీలకు మోకరిల్లి ఈ దేశ 'అభివృద్ధి'ని కార్పోరేట్ల లాభాలకు అనువైన వనరుగా పరిమార్చారు. కనుకనే పచ్చదనం విలసిల్లే అడవుల్లో, పర్వతాల్లో గనుల తవ్వకాలు, భారీ ప్రాజెక్టుల నిర్మాణాలు, అభివృద్ధి పేరిట పెను విధ్వంసం నిరాటంకంగా సాగుతున్నది. ఈ క్రమంలోనే జనం పక్షాన నిలబడ్డవారు ఎవరి అభివృద్ధి? ఎవరి కోసం అభివృద్ధి? అని ప్రశ్నలు సంధించడం అవసరం. ప్రకృతికీ, పర్యావరణానికీ ముప్పు వాటిల్లకుండా, ప్రజల నిజమైన జీవన ప్రమాణాలు మెరుగు పడేలా అభివృద్ధి విధానాలు రూపొందాలి. నగరాల కేంద్రితంగా కాకుండా, గ్రామాల శ్రేయస్సుకు, అక్కడి ప్రజల జీవనానికి అనువైన అభివృద్ధి వ్యూహాల రూపకల్పన అవసరం.
- గుడిపాటి
సెల్: 9490099327