Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాత్మ గాంధీ దేశద్రోహి, ఆయన హంతకుడు నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడు అని బహిరంగంగా చెప్పేందుకు హిందూ మహాసభ సిద్దపడింది. అందుకు అనుగుణంగా మధ్యప్రదేశ్ గ్వాలియర్లోని తమ కార్యాలయంలో గాడ్సే జ్ఞానశాలను ఏర్పాటు చేసారు. ఈవార్తను దేశవ్యాపితంగా అన్ని మీడియా సంస్థలు ప్రచురించాయి. అంటే విద్వేష విభజన రాజకీయాలు తారాస్థాయికి చేరాయని అర్ధం అవుతున్నది. గాడ్సే పేరును ఉచ్చరించడానికి కూడా సాహసించని రోజుల నుంచి ఇప్పుడు బహిరంగంగా ఆయన జయంతి ఉత్సవాలను జరపడంతో పాటు గాడ్సే పేరుతో గ్రంథాలయాలను ఏర్పాటు చేసే రోజులొచ్చాయి. దీనిని బట్టి దేశంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో అర్ధం అవుతుంది. ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో! భవిష్యత్లో ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందో ఊహించుకుంటే ఆందోళనకరంగా ఉంది. మోడీ, షాల నాయకత్వంలో 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మతతత్వ శక్తులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలలో మూకదాడులు పెరిగాయి. దళితుల మీద దాడులు కూడా గణనీయంగా పెరిగాయి. దళిత మహిళలపై జరుగుతున్న అత్యాచారాల సంగతి సరేసరి. ఉత్తరప్రదేశ్ అత్యాచారాల మయమై పోయిందంటే అతిశయోక్తి కాదు. మరోవైపు లౌకిక, ప్రజాస్వామ్య శక్తుల మీద దాడి పెరిగింది. అర్బన్ నక్సలైట్ల పేరుతో కుట్ర కేసులు పెట్టి సంవత్సరాల తరబడి బెయిల్ రాకుండా జైళ్లల్లో పెడుతున్నారు. లౌకిక ప్రజాస్వామ్య భావజాలం కలిగి మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని హతమార్చే స్థితి దేశంలో నెలకొంది. గౌరీలంకేశ్ హత్యే ఇందుకు ఉదాహరణ.. బీజేపీని, మతవాదాన్ని విమర్శించే వారు దేశద్రోహులై పోతున్నారు. బీజేపీలో ఉన్నవారు, బీజేపీని సమర్థించేవారు మాత్రమే దేశ భక్తులట! ఈ పరిణామాలు దేశ ప్రజలలో ఆందోళన కలిగిస్తున్నాయి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దేశం మనది. విభిన్న మతాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం, భాషలు కలిగిన భారత్లో మెజార్టీ మతం పేరుతో పెత్తనం చేస్తే జరిగే సంఘటనలు ఎలా ఉంటాయో గుజరాత్లో చూసాం. గోద్రాలో జరిగిన మారణహౌమం నుంచి ఇప్పటికీ చాలా కుటుంబాలు కోలుకోలేదనే చెప్పాలి. ఆ గాయాల వెంట ఇంకా రక్తం కారుతూనే ఉంది. గోద్రాలాంటి సంఘటనలు ఇప్పుడు దేశ వ్యాపితమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయం వేస్తుంది.
ఆర్ఎస్ఎన్ తన వ్యూహాలకు పదును పెట్టింది. లౌకిక, ప్రజాస్వామ్య భావజాలాన్ని సంపూర్ణంగా ధ్వసం చేసే పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకు తగ్గట్టుగా రోడ్మ్యాప్ తయారు చేసింది. తన అనుబంధ సంఘాలను యాక్టివ్ చేసింది. ఒక్కొక్క సంఘానికి ఒకొక్క ఎజెండా అప్పచెప్పింది. ఒక వైపు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో తమకు అనుకూలమైన చట్టాలను చేయిస్తున్నది. సెక్యులర్ భావజాలం కలిగిన రాజకీయ పార్టీలను ఖతం పట్టించే పనిని మోడీ, షాల ద్వయానికి అప్పచెప్పింది. అలాగే పనిలోపనిగా భవిష్యత్లో ప్రాంతీయ పార్టీలలో సైతం తమ ఎజెండాకు అడ్డం పడతాయని భావించే వాటిని కనుమరుగు చేసే బాధ్యతను బీజేపీ ప్రభుత్వానికి ఆర్ఎన్ఎన్ అప్ప చెప్పింది. ఇందులో భాగమే ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు. కేంద్రం తెస్తున్న చట్టాలను పరిశీలిస్తే మనకు అర్థం అవుతున్నది కూడా ఇదే. చాపకింద నీరులా రాష్ట్రాలకు ఉండే అధికారాలను హరించి వేస్తున్నది. నయానో భయానో రీజనల్ పార్టీలను తమ దారికి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. లేదంటే వాటిపై యుద్ధం ప్రకటిస్తున్నది. ఇందుకు తాజాగా పశ్చిమబెంగాల్లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. అంతే కాదు ప్రజల చేత ఎన్నుకోబడిన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఇప్పుడుకాకపోతే మరెప్పుడూ కాదు అనే అభిప్రాయానికి ఆర్ఎన్ఎన్ వచ్చినట్టు కనపడుతున్నది. ఇందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే ఉదాహరణ. దేశానికి జమిలి ఎన్నికల విధానం, అధ్యక్ష తరహా పాలన అవసరం అనే వాదన తెర మీదకు తేవడంతో పాటు, కుల వ్యవస్థ ఉండటం తప్పుకాదు అనే వాదన, రిజర్వేషన్స్ విధానాన్ని, రాజ్యాంగాన్ని సమీక్షించాలి అనే చర్చ కూడా తెరమీదకు తెచ్చారు. గాడ్సే జయంతి వేడుకలు బహిరంగంగా జరిపి, నాడు గాడ్సే గాంధీని ఎలా కాల్చాడో ఆలా ఆయన బొమ్మని కాల్చి నిజమైన దేశభక్తుడు గాడ్సేనే, గాంధీ దేశ ద్రోహి అని నినాదాలు ఇవ్వడం దేనికి సంకేతం. ఈ చర్యను ఆర్ఎన్ఎన్, బీజేపీలు పరోక్షంగా సమర్థించడం చూస్తుంటే వారి వేగం తీవ్రత అర్థం అవుతున్నది. కానీ ఇది దేశానికి ప్రమాదకరం.
ఒక వైపు రైల్వేస్, బ్యాంక్స్, ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, వ్యవసాయ, రక్షణ, అంతరిక్ష రంగాలతో సహా అన్ని ప్రభుత్వ రంగ సమస్థలను బడా కార్పొరేట్ సంస్థలకు అప్ప చెబుతూ.. మరోవైపు ప్రజలలో విభజన భావజాలాన్ని నూరిపోస్తూ వారి మధ్య విద్వేషాలు రగిల్చే చర్యలకు పూను కుంటున్నారు.. ప్రజలు కొట్టుకొని చస్తుంటే ప్రభుత్వ రంగ సంస్థలను బడా బాబులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారు. అభివృద్ధి ఎజెండాను పక్కకు నెట్టి విభజన ఎజండాను తెరమీదకు తెస్తున్నారు. దీనికి దేశభక్తి ముసుగు తొడుగుతూ దీనిని వ్యతిరేకించే వారిని దేశ ద్రోహులు అంటున్నారు. మతాన్ని రాజకీయాలకు ముడిపెట్టి రాజకీయ పార్టీలు బహిరంగంగా వ్యతిరేకించే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. ఒక వేళ వ్యతిరేకిస్తే ఓట్లు రావనే స్థితిని నెలకొల్పుతున్నారు. ఒక్కటి మాత్రం వాస్తవం. అభివృద్ధి ఎజెండా పక్కకు పోతే మొదలు నష్టపోయేది ఆదివాసీ దళిత బడుగుబలహీన వర్గాలే. అంటే మెజార్టీ ప్రజలు నష్టపోతారు అని అర్థం. వీరందరూ హిందూమతం కింద ఉన్నవారే. అంటే ఏ మతమైతే గొప్పది అని, అది మన జీవన విధానం అని అనుకుంటున్నామో ఆ మతమే మన జీవితాలను ద్వంసం చేస్తుంది. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దేశం సెక్యులర్, ప్రజాస్వామ్య పునాదుల మీద నడిచింది. అలాగే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆదివాసీ దళిత బడుగుబలహీన వర్గాలకు, లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు అండగా నిలిచింది. కాబట్టే దేశంలో ఆయా వర్గాలలో అభివృద్ధి సాధ్యం అయ్యింది. కాని ఇప్పుడు అభివృద్ధి పక్కకు పోయి విభజన, విద్వేష రాజకీయాలు ముందుకొస్తున్నాయి. దేశ ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ, దళిత, బడుగు బలహీన వర్గాలు ఈ కుట్రను కనిపెట్టి అప్రమత్తం కావాలి. మాకు అభివృద్ధి ఎజెండా కావాలి, విద్వేష విభజన ఎజండా వద్దు అని నినదించాలి. లేదంటే ఈ విద్వేషం దేశ వినాశనానికి దారితీస్తుందని గుర్తించాలి.
- పి.వి. శ్రీనివాస్
సెల్: 9553955396