Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వం, బీజేపీ కలిసి రాజ్యాంగంపై, దేశంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులపై మరో తీవ్రమైన దాడికి యోచిస్తున్నాయి. ''ఒకే దేశం, ఒకే ఎన్నిక'' అన్న ఆలోచనను ప్రచారం చేసేందుకు గతేడాది డిసెంబరు చివరి వారంలో బీజేపీ 25 వెబినార్లు నిర్వహించింది. ఒకే దేశం, ఒకే ఎన్నిక అవసరంపై ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఈ వెబినార్లు నిర్వహించింది. రాజ్యాంగ దినోత్సవమైన నవంబరు 26న 80వ ప్రిసైడింగ్ అధికారుల సమావేశంలో తాజాగా మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ బీజేపీ వెబినార్లలో పలు వాదనలు వినిపించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల పెద్ద మొత్తంలో ధనం ఆదా అవుతుందని, పదే పదే ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, ఫలితంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందని, ఇలా పలు వాదనలను తీసుకొచ్చారు.
పలుసార్లు ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి మరీ ముఖ్యంగా పాలనకు మంచిది కాదన్నది ఇందులో అంతర్లీనంగా ఉన్న సందేశం. రైతుల పోరాటానికి సంబంధించి భారత్లో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువై పోయిందని నిటి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యలూ ఇక్కడ గమనార్హం. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' అన్న పిలుపు అంతిమంగా 'ఒకే దేశం, ఒకే నేత'కు దారి తీస్తుంది.
అన్ని స్థాయిల్లో కలిసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, అందుకు రాజ్యాంగపరంగా అవసరమైన మార్పులు తీసుకురావడం వల్ల మౌలికంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్వభావమే మారిపోతుంది, దేశంలో ఫెడరలిజం నాశనమైపోతుంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే చట్టసభకు ప్రభుత్వాన్ని జవాబుదారీని చేస్తున్న రాజ్యాంగ నిబంధనను మార్చాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం, అవిశ్వాస తీర్మానం నెగ్గినా లేదా ద్రవ్యబిల్లుపై ఓడిపోయినా ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయలేనప్పుడు చట్టసభను రద్దు చేస్తారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. లోక్సభకు లేదా రాష్ట్రాల అసెంబ్లీలకు కచ్చితంగా స్థిరమైన పదవీ కాలాన్ని రాజ్యాంగంలో పొందుపరచలేదు.
2017లో చర్చా పత్రంలో, 2018లో లా కమిషన్ ముసాయిదా నివేదికలో నిటి అయోగ్ పలు ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతమున్న రాష్ట్ర అసెంబ్లీల్లో కొన్నింటి పదవీ కాలాన్ని తగ్గించడానికి లేదా పొడిగించడానికి ఉద్దేశించినవే ఈ ప్రతిపాదనలన్నీ. అలా తగ్గించడం లేదా పొడిగించడం వల్ల లోక్సభ ఎన్నికలతో కలిపి వాటిని నిర్వహించడానికి లేదా ఐదేండ్ల పదవీ కాలంలో కేవలం రెండు సార్లు మాత్రమే ఎన్నికలు నిర్వహించడానికి వీలు ఉంటుందన్నది ఆ ప్రతిపాదనల సారాంశం. అసెంబ్లీ కాలపరిమితిని తగ్గించడం లేదా పొడిగించడం ఈ రెండు చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధమైనవే. పైగా శాసనసభ్యులను ఎన్నుకునేందుకు పౌరులకు గల మౌలిక హక్కులను ఇది ఉల్లంఘించడమే.
సభను పదవీ కాలం మధ్యలోనే రద్దు చేయడం, తదనంతరం ఎన్నికలు నిర్వహించడాన్ని నివారించేందుకు పదవీ కాలాన్ని స్థిరంగా నిర్దేశిస్తున్నారు. దీని పర్యవసానాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. లోక్సభ రద్దును నివారించ లేనప్పుడు, మిగిలిన పదవీకాలం ఎక్కువగా లేకపోయినప్పుడు తదుపరి లోక్సభను ఏర్పాటు చేసేవరకు రాష్ట్రపతి తాను నియమించిన మంత్రిమండలి సలహాలు, సూచనలతో దేశ పాలనా వ్యవహారాలు సాగించవచ్చనేలా నిబంధన రూపొందించవచ్చని నిటి అయోగ్ పత్రంలో చేసిన ఒక ప్రతిపాదన పేర్కొంటోంది. ఈ దారుణమైన ప్రతిపాదన రాష్ట్రపతిని ప్రభుత్వ అధినేతగా చేస్తుంది. ఇది దొడ్డిదారిన కార్య నిర్వాహక అధ్యక్షుడిని తీసుకురావడమే. రాష్ట్రాల అసెంబ్లీలకు సంబంధించి కూడా ఇదే వైఖరిని సూచించారు. అక్కడ గవర్నర్ స్వల్ప కాలానికి పాలనా పగ్గాలు చేపట్టవచ్చు.
స్థిరమైన పదవీ కాలాన్ని నిర్దేశించడమంటే సభలో సుస్థిరమైన మెజారిటీ వున్న పాలక పార్టీ సభను రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు సిఫార్సు చేయలేదు. లోక్సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తే, ఆ వెనుకే ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నిర్వహించేందుకు కొత్త నేత పేరును పేర్కొంటూ తీర్మానాన్ని చేయాల్సి ఉంటుందని లా కమిషన్ నివేదికలో ప్రతిపాదించారు. దీన్ని 'నిర్మాణాత్మకమైన అవిశ్వాసపు ఓటు' అని పేర్కొన్నారు. అంటే, సభలోని సభ్యులు ప్రభుత్వాన్ని తొలగించినప్పటికీ ఏదో రకమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఉంటుంది. లేదా ప్రజల అభీష్టానికి ఏమాత్రమూ ప్రాతినిధ్యం వహించని విధంగా సంకీర్ణ ప్రభుత్వమైనా ఉంటుందని అర్థం. ఇక్కడ స్థిరమైన పదవీకాలాన్ని నిర్దేశించడం ద్వారా సుస్థిరతకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఓటర్ల అభిప్రాయాలు, వారి ఎంపికలకు అస్సలు ప్రాధాన్యతే ఉండదు. ఇటువంటి వ్యవస్థలో రాష్ట్ర చట్టసభలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేంద్రీకతమైన నియంత్రణ ఏర్పాటవుతుంది. ప్రభుత్వం తన మెజారిటీని కోల్పోయిన పక్షంలో సభను రద్దు చేసే అధికారాలను కత్తిరించిన తర్వాత ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఐదేండ్ల నిర్దిష్ట కాలపరిమితి అవసరమవుతుంది. ఇటువంటి ప్రభుత్వం గవర్నర్ ఆలోచనలు, నిర్ణయాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన నాయకుడు ఎవరన్నది గవర్నర్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఎన్నికలను ఎదుర్కొం టామన్న భయం లేకుండా చట్టసభల సభ్యులు అటూ ఇటూ పార్టీలు మారడానికి ఈ నిర్దేశిత కాలపరిమితి ఒక లైసెన్స్గా మారుతుంది.
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను తీసుకొచ్చేందుకు రాజ్యాంగపరంగా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని 85వ అధికరణ (లోక్సభ రద్దు), 172వ అధికరణ (రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి), 174వ అధికరణ (రాష్ట్ర అసెంబ్లీ రద్దు), 356వ అధికరణ (రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం)లకు సవరణలు చేయాల్సి ఉంటుంది. ఇవికాకుండా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి, ఇతర నిబంధనలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. 2014లో తన ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్నప్పటి నుంచి బీజేపీ ప్రతిసారి 'ఒక దేశం, ఒక ఎన్నిక' అన్న ఆలోచనను తెర పైకి తెస్తూనే ఉంది.
బీజేపీ ప్రస్తుతం సాగిస్తున్న ప్రచారం, దీనిపై పెట్టిన దృష్టి చూస్తుంటే ఈ దిశగా చాలా తీవ్రమైన కృషే చేస్తోందని అర్థమవుతోంది. రాజ్యాంగ సవరణలు, మార్పులు పాలక పార్టీ నిరంకుశత్వ చర్యలకు ప్రధాన అవరోధాలుగా నిలుస్తాయని ఆలోచించడం పెద్ద తప్పు కాగలదు. 370వ అధికరణను రద్దు చేయడానికి, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ధ్వంసం చేయడానికి రాజ్యాంగబద్ధంగానే ప్రయత్నించడం మనం చూశాం. మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎప్పుడు ఈ దిశగా అడుగులు వేస్తుందో ప్రతిపక్షాలకు తెలియదు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. 370వ అధికరణ రద్దుపై కాంగ్రెస్ ఊగిసలాట ధోరణిని బీజేపీ పూర్తిగా సొమ్ము చేసుకుంటోంది.
ఈ నిరంకుశ 'ఒక దేశం, ఒక ఎన్నిక' పథకం వల్ల ఎక్కువగా నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే. ప్రధానంగా రాష్ట్రాల్లో అధికారంలో వున్న పార్టీలే. రాష్ట్ర ప్రభుత్వానికున్న పరిమిత అధికారాలు కూడా పోతాయి. గతంలో మాదిరిగా అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయడం లేదా అసెంబ్లీ ఎన్నికలకు తమదైన రాజకీయ ఎజెండా రూపొందించుకోవడం వంటి ప్రజాస్వామ్య నిబంధనల ప్రక్రియ గాలికిపోతుంది. దాని స్థానంలో అసెంబ్లీ ఎన్నిక అంటే పార్లమెంట్కు నిర్వహించే కేంద్ర ఎన్నికగా మారిపోతుంది.
ఒడిషాలోని బిజూ జనతాదళ్, తెలంగాణ లోని టీఆర్ఎస్, ఏపీలోని వైఎస్ఆర్సీపీ వంటి పార్టీలు అవకాశవాదం, ఆధిపత్యం కారణంగా మోడీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులపై ఇటువంటి అనేక దాడులకు దిగుతోంది. ఆయా ప్రభుత్వాలు వెంటనే మేల్కొని, ఈ నిరంకుశమైన, ప్రజాస్వామ్య విరుద్ధమైన, ఫెడరల్ వ్యతిరేకమైన చర్యను తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ పార్టీలు మిగిలిన ప్రతిపక్షంతో చేతులు కలిపితే బీజేపీ దుర్మార్గపు చర్యలను ఓడించగలుగుతాం.
-'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం