Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నెల పదిహేను రోజులుగా దేశరాజధానిలో రైతులు చేస్తున్న ఆందోళనల్ని కవర్ చేయడంలో ప్రధాన స్రవంతి మీడియా విఫలమైంది. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన వార్తలు, విశ్లేషణలు పత్రికల్లో, చానల్స్లో అరుదు. కానీ వ్యవసాయ చట్టాల్ని సమర్థిస్తూ నేతలు చెప్పే మాటలకు మాత్రం విపరీతమైన కవరేజ్ వస్తున్నది. రైతులకు ఏం కావాలో రైతులకు తెలియదని, ఇతరులు వారిని రెచ్చగొడుతున్నారని బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి హేమామాలిని వ్యాఖ్యలకు దండిగా ప్రచారం లభిస్తున్నది. పథకం ప్రకారం కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు, వారికి వత్తాసు పలికే వారు టీవీ చర్చల్లో అనేకసార్లు కనిపిస్తారు. కానీ వ్యవసాయ చట్టాలు మొత్తం వ్యవసాయ రంగాన్ని ఏవిధంగా చిన్నాభిన్నం చేస్తాయో సాధికారికంగా చెప్పేవారికి మీడియాలో చోటు లభించదు. కీలకమైన అంశాల మీద మీడియా అనుసరిస్తున్న ధోరణి మొత్తం మీడియా వ్యవస్థనే విశ్వసనీయత సంక్షోభంలోకి నెట్టివేసింది.
క్రమం తప్పిన ప్రాధాన్యాలు
కరోనా సంక్షోభ కాలంలో మరింత విశ్వసనీయత సంక్షోభంలో కూరుకుపోయింది మీడియా. సంచలనాలకు ఇచ్చినంత ప్రాధాన్యం నిజానిజాలు చెప్పడానికి ప్రయత్నించకపోవడమే దీనికి మూలం. వలస కార్మికుల సంవేదనలు, లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారి ఆక్రందనలు మీడియాలో తగినంతగా కనిపించవు. దేశ ప్రధాని నరేంద్రమోడీ మాటలకీ, చెప్పిన చిట్కాలకీ బహుళ ప్రచారం ఇచ్చింది మీడియా. మోడీ అయోధ్యలో రామాలయం శంకుస్థాపనకు హాజరయిన దృశ్యాల్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. వేలు, లక్షలుగా రోజుల తరబడి రోడ్లమీద నడిచిపోయే వలసకార్మికుల కష్టాలు, కన్నీళ్ళు మీడియాకు పట్టలేదు. కరోనా చికిత్స పేరిట కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ గురించి మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యలకు ప్రాధాన్యం లభించని పక్షాన వార్తాచానళ్ళను ఎందుకు చూడాలనే ప్రశ్న వీక్షకుల నుంచి వస్తున్నది. అలాగే తమ గురించి రాయని పత్రికల్ని చదవడం వృధాకలాపమనే మాటలు పాఠకుల నుంచి వినిపిస్తున్నాయి.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య, రియాచక్రవర్తి అరెస్టు, కంగనా రనౌత్ సంచలనాత్మక ప్రకటనలకు విశేష ప్రచారం లభించడం ప్రధాన స్రవంతి మీడియాలో పతనమైన విలువలకు పరాకాష్ట. 'పేజీ-3' జర్నలిజం ధోరణులు ప్రైమ్ టైమ్ వార్తలకీ, పత్రికల పతాకశీర్షికలకీ పాకడం దుష్పరిణామం. అసలయిన వార్తల్ని తొక్కిపట్టి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాల్ని పదేపదే ప్రచారం చేయడం ఎలక్ట్రానిక్ మీడియాలో, వెబ్ జర్నలిజంలో స్పష్టంగా కనిపిస్తున్నది.
అసలు వార్తలకు పాతర
హిందీ, ఇంగ్లీష్ మీడియాలోనే కాదు, ప్రాంతీయ భాషల్లోని జర్నలిజంలోనూ అసలు వార్తలకు పాతర వేసి సెలబ్రిటీల వేడుకలకు ప్రచారం ఇచ్చే జాడ్యం ముదిరింది. తెలుగు టీవీ, వెబ్ జర్నలిజం పోకడలు గమనిస్తే అసలు ఎవరయినా వార్తా చానళ్ళు, వెబ్సైట్లు ఎందుకు చూడాలనే ప్రశ్న రేకెత్తుతుంది. ఎందుకంటే అసలు వార్తలు కనిపించవు. వార్తలుగా కనిపించే వాటిలోనూ సిసలయిన వార్తలు ఉండవు. ఉద్యోగుల ప్రమోషన్లకు సంబంధించి సమాచారశాఖ నుంచి ఒక ప్రకటన రాగానే ఉద్యోగులకు సిఎం వరాలంటూ 'పబ్లిసిటీ స్టంట్'కు చానళ్ళు, వెబ్సైట్లు పాల్పడటం జుగుప్సాకరం. కానీ, ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సర్కార్వారి స్టంట్గానే ప్రభుత్వోద్యోగులు, ముఖ్యంగా ఉపాధ్యాయులు తలపోస్తున్నారు. సోషల్మీడియాలో వెల్లువెత్తే పోస్టుల్ని గమనిస్తే ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న అసంతృప్తి, అపనమ్మకం స్పష్టంగా తెలుస్తాయి. ఆరు సంవత్సరాలుగా ప్రమోషన్లకు నోచుకోక అల్లాడుతున్న ఉపాధ్యాయులు ఈ ప్రభుత్వాన్ని నమ్మడానికి సిద్ధంగా లేరని సోషల్మీడియా స్పందనలు చెప్పకనే చెబుతున్నాయి. మరి ఈ స్పందనల ఆధారంగా వార్తా కథనాలు, విశ్లేషణలు రాయడానికి అవకాశం ఉంది. కానీ తెలుగుమీడియా అందుకు సిద్ధంగా లేదు. అబద్ధాల, వక్రీకరణల, సర్కారు భజంత్రీలుగా దిగజారిన ప్రసార సాధనాల ధోరణి ఎబ్బెట్టు కలిగిస్తున్నది.
వ్యక్తిగతంలోకి చొరబాటు
రాజుగారి ఇంట్లో పెండ్లికి రాజ్యమంతా సందడి అన్నట్టుగా ఎవరి ఇంట్లోనే పెండ్లయితే ఊరంతా మాట్లాడుకోవటం అవసరమా? కానీ ఒక హీరో కూతురు పెండ్లి, ఒక గాయని రెండో పెండ్లి గురించిన చర్చోపచర్చలు, ఫోటోలు, రైటప్లు, విశ్లేషణలు జనాలకు ఏం అవసరం. ఇదంతా సమాచార కాలుష్యం. వార్తలు కాని వాటిని వార్తలుగా చేయడం. గాయని సునీత మళ్ళీ పెండ్లి చేసుకోడం పూర్తిగా ఆమె వ్యక్తిగత అంశం. దానిపై సోషల్మీడియాలో ఎవరేం మాట్లాడుకున్నా అది ప్రధాన స్రవంతి మీడియాలోకి ఎక్కాల్సిన అంశం కాదు. అయినప్పటికీ నాలుగురోజులుగా ఆమె పెండ్లి గురించిన వార్తల హంగామా ఓ విడ్డూరం, ఓ పరిహాసం.
రోజూ ఎంతోమంది పిల్లల్ని ప్రసవిస్తారు. ఈ దేశంలో ప్రతి గంటకు అనేక ప్రసవాలు జరుగుతుంటాయి. కానీ విరాట్కోహ్లి-అనుష్కలు మాత్రమే బిడ్డను కన్నట్టుగా 'బిల్డప్' ఇవ్వడం ఏ పరమార్థం కోసం. వార్తలు కాని వాటిని వార్తలుగా చేసి, అసలు వార్తల్ని వెనక్కి నెట్టడం లేదా లేకుండా చేయడమనే వ్యూహం పకడ్బందీగా అమలవుతున్నది.
కరోనా వార్తల కల్లోలం
పది నెలలుగా కరోనా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కరోనాకు సంబంధించి నిజానిజాలు మన మీడియా చెప్పలేదు. విపరీతమైన భయానికి, బీభత్సానికి లోను చేశాయి కరోనా వార్తలు. కుప్పలుతెప్పలుగా శవాలు రోడ్ల మీద తేలుతాయన్నట్టుగా బెంబేలెత్తించారు. కానీ ఆస్పత్రిలో చేరకుండానే తొంభై శాతం మంది కరోనా బాధితులు ఇంట్లో ఉంటూ కోలుకున్నారు. తొలుదొలుత కరోనా వస్తే బతకడం కష్టమనే రీతిన మీడియా చెప్పిన దాంట్లో అబద్ధాలే అధికమని క్రమంగా తేలిపోయింది. సంచలనం కోసం అబద్దాల్ని వెళ్ళగక్కే మీడియా తీరును చూస్తే ''పెట్టుబడులకు కట్టుకథలకు పుట్టిన విషపుత్రికలు పత్రికలు'' అని ఏనాడో శ్రీశ్రీ చెప్పిన మాట స్ఫురణకొస్తుంది.
నిజాలు చెప్పాల్సి వచ్చినపుడు మీడియా కలాలు, గళాలు మూసుకుపోతాయి. తెలంగాణలో పెరుగుతున్న నిరుద్యోగం, ప్రయివేటు టీచర్ల, లెక్చరర్ల అగచాట్లు, కరోనా కాలంలోనూ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీ గురించి వరుస కథనాలు రాయవచ్చు. తెలంగాణలో అనేక సంస్థలని, కార్పొరేషన్లనీ నీరుగారుస్తున్న ప్రభుత్వ స్పందనా రాహిత్యం గురించి అనేక ప్రశ్నల్ని గుప్పించే వీలుంది. కానీ మీడియా ఆ పని చేయదలుచుకోలేదు. అదే సమయంలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గొప్పగా ఏదో చేయబోతున్నట్టుగా కథనాలు వండి వార్చారు. నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేకున్నా పదేపదే అబద్ధాలు చెప్పడానికి పత్రికలు అలవాటు పడ్డాయి.
చతికిలబడిన ఫోర్త్ ఎస్టేట్
ప్రజాస్వామ్య పరిరక్షణకు తోడ్పడే నాలుగో స్తంభం (ఫోర్త్ ఎస్టేట్)గా ప్రసార సాధనాలు నిలుస్తాయని పుస్తకాల్లో చదువుకున్నాం. వాస్తవంలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నప్పటికీ మౌనందాల్చింది భిన్న రూపాల మీడియా. వారసత్వ రాజకీయాలు ప్రమాదకరమని మాట్లాడే ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా నియంతలా వ్యవహరిస్తున్న వైనం తెలియంది కాదు. బీజేపీలోనూ ఈ వారసత్వ రాజకీయాల పోకడలు రాజ్యం చేస్తున్నది తెలిసిందే. అసలు పార్టీలో ఎన్నికల ప్రక్రియని స్తంభింపజేసి నామినేషన్ సంస్కృతికి దారులు వేసింది మోడీ-అమిత్షాల ద్వయం. వారసత్వ రాజకీయాల కన్నా ఎక్కువగా ప్రమాదకరమైన రాజకీయ క్రీడకు తెరలేపిన ఈ ద్వయం గురించి జాతీయమీడియా ఒక్క కథనాన్ని ప్రసారం చేయదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మంట గలుపుతున్న మోడీ ధోరణి గురించి ప్రశ్నించదు.
జాతీయ మీడియాలో ప్రముఖ వ్యాఖ్యాతలుగా, విశ్లేషకులుగా పేరొందిన జర్నలిస్టులంతా మోడీపై ప్రశంసల జల్లులు కురిపించేవారిగా పరిణమించడం గమనార్హం. ఒకనాడు మోడీ విధానాల్ని వ్యతిరేకించిన వారే ఇవాళ ఆయన 'నాయకత్వ ప్రతిభ' గురించి వేనోళ్ళ పొగుడుతున్నారు. ఈ పరిణామం క్రమక్రమంగా మీడియా కార్పొరేట్ల అధీనంలోకి వెళ్ళిన విషమ ఫలితం. ప్రజాస్వామ్యం ప్రమాదపుటంచుల్లో ఉన్నపుడు గౌరవంతో నిలబడాల్సిన ఫోర్త్ ఎస్టేట్ చతికిలబడింది. కార్పొరేట్ల కీలుబొమ్మగా మారింది. ఇది జర్నలిజం అస్తిత్వానికి పెను సవాల్గా నిలిచింది.
ప్రశ్నార్థకమైన వృత్తి నిబద్ధత
గతంలో ప్రభుత్వోద్యోగాలను కూడా వద్దనుకొని జర్నలిజంలోకి వచ్చిన జర్నలిస్టులు ఎందరో. పోటీపరీక్షలు రాసి సర్కారు ఉద్యోగం సాధించుకోగలిగే ప్రతిభ ఉన్నవారు సైతం ఇష్టపూర్వకంగా జర్నలిజంలోకి వచ్చారు. జర్నలిజాన్ని కేవలం వృత్తిగానే కాదు జీవనవిధానంగా భావించిన వారు అనేకులు. జర్నలిస్టుగా ఉండటం కేవలం కొన్ని గంటల పనిదినంగా తలపోయలేదు. కలలో, మెలకువలో 24 గంటలు జర్నలిస్టులుగా ఉండేవారు. నిజాలు వెలికి తీయడానికి, నిజాలు చెప్పడానికి వెరవనితనం జర్నలిజంలోని సాహసం, సుగుణం. ప్రజలకు నిజం చెప్పాలన్న సంకల్పంతో ఎంతోమంది జర్నలిజంలోకి వచ్చారు. ఈతరహా జర్నలిస్టులకు ఇవాళ మీడియాలో సంకటస్థితి నెలకొన్నది. నిజాల్ని చెప్పలేరు. నిజం చెప్పి ఉద్యోగాల్లో మనలేరు. నిబద్ధతతో కొనసాగడం కష్టమైన వ్యవహారం. ఈ పూర్వరంగంలో జర్నలిజం విలువలనీ, గౌరవాన్నీ ఇనుమడింపజేసిన నిబద్ధ జర్నలిస్టులు మీడియాకు దూరమవుతున్నారు. కొందరు పరిస్థితులకు తగినట్టుగా తలవంచడం అలవరుచుకున్నారు. కనుకనే వృత్తిగా జర్నలిజం పవిత్రత, ఔన్నత్యం, గౌరవం సారం, సారాంశం కోల్పోయింది.
చరిత్ర పునరావృతం
ఇంతటి విశ్వసనీయత సంక్షోభం ఎదుర్కొంటున్న మీడియా తన పూర్వ వైభవాన్ని సంతరించుకోడం తన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవడం ద్వారానే సాధ్యం. మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం ఉద్యమాల్నించి, ఉద్యమ అవసరాల్నించి పత్రికలు పుట్టుకొచ్చాయి. ఇవాళ కూడా ప్రజలు తమకు కావాల్సిన మీడియా సాధనాల్ని తామే సృష్టించుకోడం అనివార్యం, అవసరం. ఈ మధ్యన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమక్రమంలోనే డిసెంబర్ 17న 'ట్రాలీ వాయిస్' అనే ద్విభాషా పత్రిక ఆరు ప్రింట్ ఎడిషన్లతో ప్రారంభమైంది. డిజిటల్ ఎడిషన్ కూడా వస్తున్నది. వెబ్సైట్ కూడా ఆరంభించబోతున్నారు. రైతు ఉద్యమాల సాధికారిక స్వరంగా వెలువడుతున్న ఈ పత్రిక ఇప్పటికే బహుళ ఆదరణ నెలకొన్నది. ప్రధాన స్రవంతి మీడియా నిర్లక్ష్యం గమనించాక తమ గురించి తామే చెప్పుకోవాలన్న పట్టుదలనే 'ట్రాలీ వాయిస్' ఆవిర్భావానికి మూలం. ట్రాక్టర్లనే వేదికలుగా చేసుకొని ఉద్యమాలు చేస్తున్న రైతులు సంకేతప్రాయంగా పత్రికకు 'ట్రాలీవాయిస్' అని పేరు పెట్టారు.
ప్రధాన మీడియా అంతా సర్కారు బాకాగా మారినపుడు ప్రజలు తమ మీడియా సాధనాలని తామే సృష్టించుకోక తప్పదు. రైతుల ఉద్యమం ఓ పత్రిక ఆవిర్భావానికి దారితీసినట్టుగానే అనేక చోట్ల బులెటిన్లు, పత్రికలు రావడం అవసరం. నిజాం వ్యతిరేక పోరాటంలో తెలంగాణలో సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని పాదు కొల్పడానికి 'గోల్కొండ' పత్రిక ఆవిర్భవించింది. ఇవాళ కూడా తెలంగాణ సమాజం ఇప్పటికే జనం పక్షం నిలిచిన పత్రికల బలం ఇనుమడించేందుకు తోడ్పడాలి. మరిన్ని కొత్త ప్రచారసాధనాల్ని సృష్టించుకోవాలి. తద్వారా మీడియాలో ప్రత్యామ్నాయ వేదికల ప్రాబల్యానికి దారులు సుగమమవుతాయి.
- గుడిపాటి
సెల్: 9490099327