Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నాకు సంబంధించినంత వరకు నేను ఇండియాలో ప్రతి ఎన్నికలో ఓడిపోయేందుకు సిద్ధపడి ఉన్నాను. కానీ, మతతత్వానికి లేదా కులతత్వానికి చోటివ్వను'' అని అన్నారు భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆయనకు ఉండిన గుండెధైర్యం, నిజాయితీ, హేతువాద దృక్పథం నేటి పాలకులకు, నాయకులకూ ఉందా? వాళ్ళెలాగూ ఆలోచించుకోలేరు. సామాన్య పౌరులుగా, ఓటర్లుగా కనీసం మనమైనా ఆలోచించుకోవాలి కదా? కుల, మత రహిత ధృవీకరణ పత్రం పొందిన మొదటి వ్యక్తి, తమిళనాడుకు చెందిన న్యాయవాది - పార్థిబ రాజా! కులం, మతం లేనివారికోసం ప్రత్యేక చట్టం అమలు కావాలన్నది ఆమె డిమాండ్.
ఒక పాస్టర్ ఒక ఊరికి వెళ్ళాడు. అతను ఆ ఊరికి కొత్త. పక్కన ఆడుకుంటున్న పిల్లవాణ్ణి పిలిచి ''ఇక్కడ - చర్చ్కి ఎలా వెళ్ళాలీ?'' అని అడిగాడు. ఆ పిల్లవాడు మర్యాదగా దగ్గరికొచ్చి, చర్చ్కి వెళ్ళేదారి ఎటో వివరంగా చెప్పాడు. అంతా విని ''సరే బాబూ! రాత్రికి నీ స్నేహితుల్ని తీసుకుని చర్చ్కి రా- మీకు స్వర్గానికి ఎలా వెళ్ళాలో చెపుతాను'' అని అన్నాడు పాస్టర్. ఆ పిల్లవాడు పగలబడి నవ్వి ''మీకు చర్చ్కి ఎలా వెళ్ళాలో దారి తెలియదు. కానీ మాకు స్వర్గం దారి చూయిస్తారా?'' అని ఆన్నాడు. ఒక చిన్న పిల్లవాడే కాదు, పెద్ద సంగీత కారులు, శాస్త్రవేత్తలు కూడా ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. ''రుజువుల కందని దైవాన్ని ప్రార్థించాల్సిన అవసరం గాని, భయపడాల్సిన అవసరం గాని నా కెన్నడూ కనిపించలేదు'' అని అన్నది భౌతిక శాస్త్రవేత్త రిచర్డ్ ఫిలిప్స్ ఫిన్మెన్!
కాగితం - అచ్చు యంత్రం కనిపెట్టక ముందు జరిగే సంగతి. ఒక బైబిల్ రాయడానికి 250 గొర్రెల చర్మాన్ని వాడేవారని చెపుతారు. ఒక మత గ్రంథం ప్రతి తయారుకావాలంటే అన్ని ప్రాణాలు గాల్లో కలవాల్సి వచ్చేది? భారతరత్న, నోబెల్ గ్రహీత అయిన మదర్ థెరిస్సా జీవించి ఉన్నప్పుడు ఆమె ఆశ్రమంలో పిల్లలకు రోగాలొస్తే మందులు వాడేవారు కాదు. ప్రార్థనలు నిర్వహించేవారు. అదే మరి మదర్ థెరిస్సాకు గుండెపోటు వచ్చినప్పుడు ప్రార్థనలు చేయలేదు. ఖరీదైన ఆస్పత్రిలో చేరారు. పిల్లలు మరణిస్తే - 'జీసస్ ముద్దు పెట్టుకున్నాడు' అని చెప్పే మదర్.. తనను కూడా జీసస్ ముద్దుపెట్టుకుంటున్నాడులే- అని సర్ది చెప్పుకోలేదు. భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో వేలాది మంది పిల్లలు, తల్లులు, కార్మికులు చనిపోయినప్పుడు ప్రజల గురించి ఏ ప్రకటన చేయని ఆమె అమెరికా కంపెనీ యాజమాన్యాన్ని క్షమించాలని మాత్రం ప్రకటించారు. ఐర్లాండ్లో కేథలిక్లు అధికం. అక్కడ తరచూ జరిగే విడాకుల గురించి, గర్భస్రావాల గూర్చి ఒకసారి అక్కడి పార్లమెంట్లో చర్చ జరిగింది. ఆ సందర్భంలో తమ మతానుసారం గర్భస్రావం - విడాకులు ఏమాత్రం వీలు కాదని చెప్పారు మదర్. ఆమె దైవభక్తి, జీవకారుణ్యానికి గీటురాయి కదా! అని అందరూ హర్షించారు. అయితే బ్రిటిష్ యువరాణి డయానా విడాకులు తీసుకుంటే, అది మాత్రం 'దైవేచ్ఛ'గా ఆమె ప్రకటించారు. మదర్ థెరిస్సా చాలా చోట్ల లౌక్యం ప్రదర్శించారే తప్ప, నిజానికి నిబద్ధురాలై తన ఔన్నత్యం చాటుకోలేక పోయారు. ఇవన్నీ ఏవో కల్పించిన విషయాలు కావు. లాన్సెట్ పత్రిక సంపాదకుడు రాబిన్ ఫాక్స్ 1991లో ఈ విషయాలు ప్రకటించారు. అంతే కాదు, విశ్వవిఖ్యాత జర్నలిస్ట్, హేతువాది క్రిస్టోఫర్ హిచ్చెన్స్ స్వయంగా మదర్తో కలిసి మాట్లాడి విషయాలు వెల్లడించారు.
భారత దేశ ఉపాధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి చూద్దాం.. ఏడాది పొడవునా గుర్తు చేసుకోకపోయినా, 'టీచర్స్ డే' నాడు అందరూ తప్పక గుర్తు చేసుకుంటున్నారు. అది అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది కాదు. ఆయనకు ఆయనే ప్రకటించుకున్నదన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదముద్ర వేయడమన్నది ఆ తర్వాత సంగతి. సెప్టెంబర్ 5న రాధాకృష్ణన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి అంగీకరించి, అనుమతించాలని ఆయన పూర్వ విద్యార్థులు అడగగా ఆయన అంగీకరించారు. అయితే దానికి ఒక షరుతుపెట్టారు. అది తన పుట్టిన రోజుగా కాకుండా, 'ఉపాధ్యాయ దినోత్సవం'గా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు అలాగే చేశారు. అప్పటి నుంచి అదొక ఆనవాయితీ అయ్యింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితంలో ఎక్కువ భాగం అధ్యాపకుడిగా పనిచేశారు గనక, ఆ రోజును 'టీచర్స్ డే'గా జరుపుకుంటే బావుంటుందని ఆయనే అలా మార్చేశారు. దేశాధ్యక్షుడి పదవిలో ఉండి చేసిన సూచనను ఎవరైనా ఎలా తోసిపుచ్చగలరూ? అందరూ ఇది గమనించాలి. భారతీయ సమాజంలోని విద్యారంగానికి సర్వేపల్లి ప్రొఫెసర్గా, వైస్-ఛాన్సలర్గా సేవలందించారు తప్పిస్తే, ఆ రంగంలో తెచ్చిన మార్పేమే లేదు. దేశంలో అణగారిన వర్గాలకు ఆయన వల్ల ఏమేలూ జరగలేదు. ఆయన వ్యక్తిత్వంలో, ఆలోచనా ధోరణిలో ఆరోగ్యకరమైన అంశాలేవీ లేవు. భారతీయ సమాజంలోని విద్యారంగంలో మార్పు తెచ్చిన వారి గురించి చెప్పుకోవాలంటే ఫూలే దంపతుల గురించి చెప్పుకోవాలి. సావిత్రీబాయి ఫూలే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అణగారిన వర్గాలలో స్త్రీ విద్యకు, స్త్రీ చైతన్యానికి తన సర్వశక్తుల్ని ఒడ్డిన ధీరవనిత ఆమె. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆమెను గుర్తుచేసుకోవడం మేలు.
మతం గురించి, మతాభిప్రాయాల గురించి గొప్పగా మాట్లాడి తత్త్వవేత్తగా గుర్తింపు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇంట్లో తన అర్థాంగిని నిరక్షరాస్యురాలిగా ఉంచారు. తను మాత్రం వైస్-ఛాన్స్లర్గానూ, రాష్ట్రపతిగానూ అయ్యారు. మనువాద భావజాలాన్ని వంటబట్టించుకుని కన్నతల్లినే వేధించారు. ఇవి కాక, చేసిన ఉద్యోగంలోనూ నిజాయితీ లోపించిందనే విమర్శ ఉంది. ఇతరుల థీసిస్లు కాపీచేసి, తనను తాను మేధావిగా ప్రచారం చేసుకున్నారనే విమర్శ ఉంది. అంతటి విద్యావంతుడై ఉండి, కూతుర్లకు బాల్య వివాహాలు చేసి, తన సనాతన భావజాలాన్ని ప్రదర్శించుకున్నారు కదా? ఇవన్నీ ఎవరో కాదు, దేశం గర్వించ దగ్గ చరిత్ర కారుల్లో ఒకరైన స్వయాన ఆయన కొడుకే సర్వేపల్లి గోపాల్ చెప్పిన వివరాలు. ఆధునిక చరిత్రలో ఆయన నిష్ణాతుడు. తన తండ్రి దేశంలో అత్యున్నత పదవిని అనుభవించినా కొడుకుగా సంతోషపడలేదు. నైతికంగా దిగజారిన తండ్రి గురించి వాస్తవాల్ని వెల్లడించారు. సర్వేపల్లి గోపాల్ ధైర్యాన్ని, నిజాయితీని అభినందించాల్సిందే!
రాకెట్ సైంటిస్ట్గా వినుతికెక్కిన డాక్టర్ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి అయ్యారు. రామేశ్వరం దేవాలయం పరిసరాల్లో పెరిగిన ఆయన హిందూ ధర్మాన్ని ఆ విలువల్ని వంటబట్టించుకున్నారు. ముస్లిం అయి ఉండి, విద్యాధికుడై ఉండి, హిందూ పీఠాధిపతుల కాళ్ళమీద పడుతుంటాడని, బాబాల్ని పొగడుతుంటాడని.. బీజేపీ ప్రభుత్వం ఆయన్ని వెతికి వెతికి పట్టుకుంది. 'పుట్టపర్తి సాయిబాబా చుట్టూ గ్రహాలు తిరుగుతున్నా'యని ప్రశంసించిన ''మహానుభావుడాయన!'' అందుకే సైన్సు చదివితే సరిపోదు. సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచుకోవడం అవసరం. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మదర్ థెరిస్సా లాంటి మహానుభావుల్ని తక్కువగా చేసి చూపడం లేదు. వారికి ఉండే గౌరవం వారికి ఉంటుంది. కానీ, ఉన్నత స్థానాల్లోకి ఎగబాకినా, ఎంత అహేతుకంగా ప్రవర్తించారన్నది అర్థం చేసుకోవాలి. ఉన్నత స్థానాల్లోని వారంతా ఉన్నతులు అనే భావన తప్పు - హేతుబద్ధంగా విశ్లేషించుకుంటేనే కదా! ఎవరి వ్యక్తిత్వంలో ఏమేం లోపాలున్నది తెలిసేదీ? కొద్దిగా ఉన్న మంచిని అతి పెద్దగా చేసుకుని వ్యక్తి ఆరాధనకు పూనుకోవద్దు.
ప్రాచీన చైనా తత్త్వవేత్త - క్జున్ జి (312-230బీసీఈ) ఒక మంచిమాట చెప్పాడు... అందరూ శ్రద్ధగా అర్థం చేసుకుని ఆలోచించాలి.. ''అర్థవంతమైన జీవితం కావాలంటే.. నిన్ను నువ్వు బేరీజు వేసుకో, ప్రపంచ జ్ఞానం పెంచుకో, జాగ్రత్తగా సహేతుకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో - అంతే! నీ మాటల్ని, నీ చర్యల్ని విశ్లేషించుకుంటూ ఉండు.. నీక్కావల్సినంత ప్రార్థించుకో అయితే దాన్ని ఏ స్వర్గమూ వినదు. నువ్వు చలికి వణికి పోతున్నావని చలికాలం ఆగిపోదు. నువ్వు ప్రయాణించలేవని భూమి చిన్న పరిమాణంలోకి కుచించుకుపోదు. కావాలంటే వర్షాల కోసం ప్రార్థనలు చేసుకో. వర్షం కురుస్తుంది. కానీ, నీ ప్రార్థనలకూ దానికీ ఏమీ సంబంధం ఉండదు. ప్రార్థనలు చేయకపోయినా అది కురుస్తుంది. అంటే ప్రకృతిలో జరిగే ప్రతి సంఘటనా నియమానుసారం జరగాల్సిన సమయంలో జరగాల్సిన రీతిలో జరుగుతుంది. నువ్వు చేసే ప్రార్థనకూ దానికీ లంకె కుదరదు.'' ప్రార్థన అంటే గాల్లో అడుక్కోవడం. విశ్వాసమంటే - తమ అభిప్రాయాలకు ఏ ఆధారమూ లేకపోయినా నమ్ముతూ ఉండటం. మత జీవిగా మారిన వారి మెదడు పనిచేయడం మానేస్తుంది. అంటే ఒక రకంగా చనిపోతుంది. దాన్ని పునర్జీవింపజేయాలంటే, రిఆక్టివేట్ చేయాలంటే.. అందులో పేరుకుపోయిన చెత్తనంతా తొలగించి శుభ్రం చేసుకోవాలి! కొందరు ఏదో విధంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు కానీ మెదళ్ళను రిఆక్టివేట్ చేసుకోలేరు. పాపం!! అలాంటి వారికి ఎక్కువగా విలువివ్వకపోవడమే మంచిది.
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్ర వేత్త.