Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫిబ్రవరి 4న భారతదేశం ఒక గొప్ప ప్రజా చరిత్రకారుణ్ణి కోల్పోయింది. పుక్కిటి పురాణాలనే చరిత్రగా చలామణీ చేస్తున్న చీకటిశక్తుల బెదిరింపులకూ, దాడులకూ తలొగ్గక భారతదేశ చరిత్రను శాస్త్రీయ పరిశోధనల పట్టాలపై నిలపడానికి చివరికంటా కృషి చేసిన చరిత్రకారుడు ద్విజేంద్ర నారాయణ్ ఝా (డిఎన్ ఝా) తన 81వ ఏట కన్నుమూశారు. భారతదేశ చరిత్ర కారుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆర్ఎస్ శర్మ, బిపన్ చంద్ర, సతీశ్ చంద్ర, ఇర్ఫాన్ హబీబ్, రొమిలా థాపర్, బిడి చటోపాధ్యాయ, ఎంజిఎస్ నారాయణ్ తరానికి చెందిన సుప్రసిద్ధ చరిత్ర కారుడు ప్రొఫెసర్ ఝా. అటు బ్రిటిష్ వారి వలసవాద దృక్కోణం నుంచి ఇటు భారత మతతత్వ వాదుల ముస్లిం వ్యతిరేక విశ్లేషణల నుంచి భారతదేశ చరిత్రను రక్షించి పరిశోధనల ఆధారంగా శాస్త్రీయమైన పద్ధతిలో భారత ప్రజల నిజమైన చరిత్రను మనకు అందించిన వ్యక్తి ఆయన. గో మాత, గోవు పవిత్రత, గో వధ నిషేధం అంటూ ఆర్ఎస్ఎస్ మతతత్వ శక్తులు తీవ్రస్థాయిలో గగ్గోలు పెడుతున్న సమయంలో, ఆ పేరుతో ప్రజలపై ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్న తరుణంలో 2001లో ఝా ''గోవు పవిత్రత : ఓ కట్టు కథ'' అనే పరిశోధనా గ్రంథాన్ని విడుదల చేశాడు. భారతదేశ చరిత్రలో ఏనాడూ గోవును పవిత్రంగా బావించలేదు, అందువల్లనే నందికి ఆలయాలున్నాయి గానీ ఆవుకు ఆలయాలు కట్టలేదు, పైగా బ్రాహ్మణులు కూడా గోమాంసాన్ని పరమ ఇష్టంగా తినేవారు అని శాస్త్రీయ ఆధారాలతో ప్రకటించిన ధీశాలి ఆయన. భౌతికవాద దృక్పథంతో దేశచరిత్రను పరిశోధించే క్రమంలో ఆయన ఎటువంటి భావావేశాలకూ స్థానం కల్పించలేదు, ఎటువంటి ఒత్తిళ్లకూ లొంగలేదు. పైన పేర్కొన్న పుస్తకంతోపాటు ఆయన రాసిన ''ప్రాచీన భారత దేశం'', ''ప్రాచీన భారత దేశంలో ఆహారపు అలవాట్లు'' అన్న పుస్తకాలను ప్రజాశక్తి ప్రచురణ సంస్థవారు తెలుగులో ప్రచురించారు. ఈ పుస్తకాలు ప్రాచీన భారత ప్రజల చరిత్ర గురించి మతతత్వ వాదులు చేస్తున్న వాదనలను చీల్చి చెండాడుతాయి, మనకు సరైన అవగాహన కల్పిస్తాయి.
డిఎన్ ఝా బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. కలకత్తా యూనివర్సిటీకి చెందిన ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్రలో బీఏ (హానర్స్) చదివారు. అక్కడే ఆయనకు జీవిత కాల సహచరుడైన బిడి చటోపాధ్యాయతో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి పాట్నా యూనివర్సిటీకి వెళ్లి అక్కడ చరిత్రలో ఎంఏ చదివారు. ప్రఖ్యాత చరిత్రకారుడు ప్రొఫెసర్ ఆర్ఎస్ శర్మ ఆయనకు గురువు. భారతదేశ చరిత్రలో ప్రాచీన, మధ్యయుగాల సమాజాల్లో ఆర్థిక పునాదులపై అధ్యయనం జరిపిన ఝా దానిపై వ్యాసాలు రాయడం ప్రారంభించారు. తరువాత ఢిల్లీ యూరివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్గా నియమితుడై ప్రాచీన, మధ్య యుగాల చరిత్రపై స్పెషలైజ్ చేశారు. అప్పటికే ఆ యూనిర్సిటీకి మారిన ఆర్ఎస్ శర్మతో కలిసి ఆయన ఢిల్లీ యూనివర్సిటీని భారతీయ చరిత్రపై గొప్ప పరిశోధనా కేంద్రంగా మార్చడానికి తోడ్పడ్డారు. అనేక మంది యువ చరిత్రకారులను యూనివర్సిటీ ఆకర్షించింది. పక్కనే ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో పనిచేసే బిడి చటోపాధ్యాయ, రొమిలా థాపర్, సువిరా జైశ్వాల్ వంటి వామపక్ష చరిత్రకారులతో కలిసి వారు భారతీయ చరిత్ర పరిశోధనను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయారు.
మూడు దశాబ్దాల చరిత్ర పరిశోధనలో ఝా, ప్రాచీన భారతదేశ సామాజిక-ఆర్థిక నిర్మాణం గురించీ, సంస్కృతికీ, సాంకేతిక శాస్త్రానికీ మధ్య సంబంధాల ఫలితంగా ఏర్పడిన సామాజిక, రాజ్య వ్యవస్థల గురించి అనేక విషయాలు కనుగొన్నారు. ప్రాచీన భారతదేశంలో రెవెన్యూ వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థకూ సామాజిక నిర్మాణానికీ మధ్య సంబంధాలను తెలియజేశారు. భారతదేశ చరిత్రను శాస్త్రీయంగా పరిశీలించారు గనుకనే ఆయన హిందూ జాతీయ వాదం పేరుతో ముందుకు వచ్చిన ఆర్ఎస్ఎస్ మతతత్వాన్నీ, దేశ చరిత్రను కాషాయీకరించడాన్నీ తుదకంటా వ్యతిరేకించాడు. అయోధ్యలో బాబ్రీమసీదు కింద ఆలయం ఉన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవని ఆర్ఎస్ శర్మ, సూరజ్ భాన్లతో కలిసి 1991లో ఆయన ఒక పత్రాన్ని తయారుచేశారు. ''రామజన్మభూమి-బాబ్రీ మసీదు'' దేశానికి ఒక చరిత్రకారుని నివేదిక (1991) పేరుతో రూపొందిచిన పత్రంలో ఆయన భారత పురాతత్వ సర్వే నివేదికలోని అనేక అంశాలతో విభేదించారు.
2001లో ఆయన ''గోవు పవిత్రత: ఒక కట్టుకథ'' అనే పుస్తకం రాస్తూ ప్రాచీన కాలంలో బ్రాహ్మణులతో సహా భారతీయుల ఆహారంలో గోవు మాంసం ఒక భాగంగా ఎలా ఉండేదో ప్రాచీన హిందూ గ్రంథాలనుంచి ఉదాహరణలతో సహా నిరూపించాడు. ఆహారంగానే కాకుండా ఆవు మాంసంతో చేసిన సూప్ జ్వరాలు తగ్గించడానికీ, నీరసం వదిలించడానికీ, క్షయవ్యాధికీ ఉపయోగపడుతుందని, ఆవు కొవ్వు కీళ్ల నొప్పులను నయం చేస్తుందని చెరకసంహితలో చెప్పిన విషయాలను ఉటంకించారు. దేవుళ్లకు పశువులను బలి ఇవ్వడం ప్రాచీన భారతీయుల సంప్రదాయం అని వేదాలు, ఉపనిషత్తులను ఉటంకిస్తూ చెప్పారు. గోవును ఇటీవలి కాలంలో మాత్రమే పవిత్ర జంతువుగా పేర్కొనడం ప్రారంభించారని తెలిపారు. గో రక్షణ పేరుతో మానవ హత్యలకు పాల్పడుతున్న కాషాయ మూకలకు ఝా పరిశోధనలు మింగుడుపడలేదు. ఆయనను హత్య చేస్తామని బెదిరించారు. దాడులకు దిగారు. సోషల్ మీడియాలో పనిగట్టుకుని దుర్భాషలకు దిగారు. అయినా ఝా ఏమాత్రం బెసక లేదు. తను పరిశోధించి తేల్చిన విషయం నుండి కొంచెం కూడా పక్కకు మళ్లలేదు.
మొఘలులు భారత దేశానికి రాకముందు గుప్తుల కాలం స్వర్ణయుగంగా భాసిల్లిందని ఉన్న భావనను కూడా ఆయన తిరస్కరిం చారు. ఇదంతా స్వాతంత్య్రోద్యమాన్ని బలపరిచేందుకు చరిత్రకారులు సృష్టించిన భావన అని అందులో నిజం లేదని తేల్చారు. భారతీయులు ప్రాచీన యుగాలనుంచి శాంతియుత సహజీవనాన్ని సాగించేవారనీ, శాకాహారం ఆరగించేవారనీ, సహనాన్ని ప్రదర్శించేవారనీ చెబుతూ హిందూత్వ చరిత్ర కారులు భారతదేశ వాస్తవ చరిత్రను కాషాయీకరణ గావించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ప్రొఫెసర్ ఝా వారి ప్రయత్నాలను వాస్తవ పరిశోధనల ద్వారా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. బ్రాహ్మణ్యానికీ, శ్రామికుల మతాలైన బౌద్ధం, జైనం వంటి వాటికీ మధ్య జరిగిన యుద్ధాలను గురించి వివరిస్తూ, బౌద్ధాన్ని ఈ దేశం నుంచి వెళ్లగొట్టడానికి బ్రాహ్మణ్యం భీకర యుద్ధాలు చేసిందని చెప్పారు. అలాగే పరదేశీయులను మ్లేచ్ఛులు, అప్రాఛ్యులు అని దూషిస్తూ అసహనం ప్రదర్శించిన విషయాన్ని కూడా పేర్కొన్నారు.
డిఎన్ ఝా ''దక్షిణ భారత దేశంలో దేవాలయాలు, వ్యాపారులు (క్రీ.శ. 900-1300)'' అన్న పరిశోధనా పత్రంలో దేవాలయాలకూ, వ్యాపారులకూ ఉన్న సంబంధాన్ని గురించి విపులంగా తెలియజేశారు. ఆ రోజుల్లో దేవాలయాలు సంపద పోగుచేసుకునే కేంద్రాలుగా ఉండేవి. వ్యాపారులు ఈ దేవాలయాలను ఆధారం చేసుకుని వ్యాపారాలు సాగించేవారు. చోళులు, ఇతర చక్రవర్తులు దేవాలయాలకు పెద్ద ఎత్తున భూములు ఇవ్వడంతో క్రమంగా గ్రామీణ వ్యవసాయంలో ఫ్యూడల్ సంబంధాలు ప్రారంభమైనాయని, చక్రవర్తుల అధికారం క్రమంగా తగుతూ వచ్చిందని చెప్పారు. ఝా చివరిగా రాసిన పుస్తకం ''అమత పానం'' (డ్రింక్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ) 2020లో ప్రచురితమైంది. ప్రాచీన భారత దేశంలో స్త్రీ, పురుషులు 50రకాల మద్యాలు సేవించేవారని ఆయన వేదాలు, రామాయణ, మహాభారతాలనుండి ఉటంకిస్తూ తెలియజేశారు.
ఫ్రొఫెసర్ ఝా తన చరిత్ర పరిశోధనల ద్వారా భారతదేశ చరిత్రలోని గొప్ప అంశాలను మనకు తెలియజేయడమే కాదు భారత చరిత్ర కాంగ్రెస్ కార్యదర్శిగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా, అధ్యక్షునిగా వివిధ హౌదాల్లో పనిచేసి చరిత్ర కాంగ్రెస్ను గొప్ప సంస్థగా తీర్చిదిద్దారు. అకడమిక్ జీవితంలోనూ, సామాజిక జీవితంలోనూ ఉన్నత విలువలు నెలకొల్పిన ఝా నిత్య జీవితంలో ఎంతో ఉల్లాసంగా, జోక్లు వేస్తూ కలుపుగోలుగా వ్యవహరించేవారు. చివరి రోజుల్లో ఆయన పక్షవాతంతోనూ, వినికిడి పనిచేయక బాధపడ్డారు. భారతీయ ప్రాచీన చరిత్రపై అతి గొప్ప పరిశోధనా సంపదను మనకు విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆయన మరణించినా వామపక్ష వాదిగా, నిబద్ధత కలిగిన ప్రజా చరిత్రకారుడిగా ఆయన అందించిన ఆయుధాలు మతతత్వ చీకటి శక్తులపై పోరాటంలో మనకు నిత్యం ఆయుధాలుగా ఉపయోగపడతాయి.
- ఎస్. వెంకట్రావు