Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''రైతాంగ ఉద్యమం గురించి ప్రపంచానికి చాటిచెప్పడం దేశద్రోహం అయితే నేను జైలులోనే ఉంటాను...''
- కోర్టులో దిశా రవి
ఇరవై ఒకటవ శతాబ్దంలో ఇంతకన్నా శక్తివంతమైన ప్రకటన చేసిన భారతీయ వ్యక్తి ఎవరున్నారు? చాలా శక్తివంతమైన ప్రకటన. ధైర్యంతో, నిజాయితీతో చేసిన ప్రకటన. ఈ మాటలు 21ఏండ్ల యువతి నోటి నుంచి రావడం భారత దేశ ఉజ్వల పోరాట భవిష్యత్తుకు గొప్ప నిదర్శనం. ఢిల్లీలో మూడు మాసాలుగా ఉద్యమిస్తున్న రైతుల మీద, ఆ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన అనేక మంది మీద బీజేపీ ప్రభుత్వం పిరికి పందలా అనేక కేసులు పెడుతోంది. వేధింపులకు గురి చేస్తోంది. ప్రపంచ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బెర్గ్ రైతులకు మద్దతుగా చేసిన ట్వీట్ను షేర్ చేసిందన్న నెపంతో బెంగళూరుకు చెందిన యువతి దిశా రవిని అరెస్టు చేయడం పట్ల దేశ విదేశాల్లో అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెకు ఉగ్రవాదులతో సంబంధాలు న్నాయనీ, ఉగ్రవాద కుట్రలో భాగంగా థన్బెర్గ్ పంపిన 'టూల్ కిట్' (ఉద్యమానికి మద్దతుగా ప్రచురించబడిన పత్రం)ను ఆమె షేర్ చేసిందని ఢిల్లీకి చెందిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ పోలీసులు తప్పుడు కేసు బనాయించారు. ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఆమెపై పోలీసులు చేసిన ఆరోపణల్లో కించిత్ నిజం లేదని ఢిల్లీ కోర్టు తేల్చింది. పోలీసుల చెంప మీద కొట్టినట్లు దిశా రవికి బెయిల్ మంజూరు చేసింది. కోర్టులో తన లాయర్ సిద్ధార్థ అగర్వాల్ ద్వారా దిశా రవి చేసిన వాదనలు వింటే మనకు మన భావితరాల పోరాట పటిమ మీద కొండంత నమ్మకం కలుగుతుంది.
రైతుల ఉద్యమం పట్ల తనకు సానుభూతి ఉందని, అందువల్ల తను ఆ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా అవగాహన కల్పించే కృషిలో భాగం పంచుకున్నానని ఆమె కోర్టులో నిజాయితీగా ప్రకటించారు. తనపై పెట్టిన దేశ ద్రోహ నేరం రుజువైతే కనీసం ఐదేండ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని లాయర్ ద్వారా తెలుసుకున్నాక కూడా ఆమె ఈ ప్రకటన చేసిందంటే ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండగలమా? నేను చేసిన పని నేరమా? అది భారత దేశానికి వ్యతిరేకమా? రైతులు బహిరంగంగా ఆందోళన చేస్తుంటే వారికి మద్దతు కూడగట్టడం దేశ-వ్యతిరేక చర్య ఎలా అవుతుంది?... అని ఆమె ప్రశ్నించారు.
టూల్కిట్ను తయారు చేయడం, ఇంకో మాటలో చెప్పాలంటే రైతుల ఉద్యమాన్ని ప్రపంచ దృష్టికి తీసుకుపోయే మార్గాలను చెబుతూ ఒక పత్రం తయారు చేయడం ''కుట్ర'' ఎలా అవుతుంది? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 'డిజిటల్ దాడి' చేయాలనడం భౌతిక హింసాత్మక దాడి ఎలా అవుతుంది? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా జరుగుతున్న రైతాంగ ఉద్యమంలో తను భాగస్వామినని రవి అంగీకరించారు. అంత మాత్రాన అది దేశద్రోహం అయిపోతుందా? అని ఆమె ప్రశ్నించారు. ''శాంతియుతంగా నిరసన తెలపడమే నేరం అయితే నేను నేరస్తురాలినే! ఈ శాంతియుత నిరసనకు ప్రచారం కల్పించడమే నేరం అయితే నేను నేరస్తురాలినే! ఇదే కొలబద్ద అయితే నేను కచ్చితంగా నేరస్తురాలినే!'' అని ఆమె పేర్కొన్నారు. ''సర్ అక్కడ ఒక ప్రదర్శన జరుగుతోంది, మీరు వెళ్లి పాల్గొనండి అన్నంత మాత్రాన నేను దేశ ద్రోహిని అయిపోతానా?'' అని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసుల ఆరోపణలు ఎంత పనికిమాలినవిగా ఉన్నాయో ఆమె చాటి చెప్పారు. ''ఉదాహరణకు, యోగాసనాలు వేస్తున్నారు. కానీ నేను యోగా కన్నా కుంగ్ ఫూను ఇష్టపడ్డాననుకోండి, చైనా గూఢచారిని అయిపోతానా? ఇది నేను చెబుతున్న విషయం కాదు. ఎఫ్ఐఆర్లో ఉంది. భిన్నమైన దృక్కోణం కలిగిన వారిని మనం ఇలా మార్చేస్తున్నాం'' అని ఆమె పేర్కొన్నారు.
తనకున్న పరిజ్ఞానాన్ని బట్టి, వాతావరణ మార్పు సమస్యపై తను చేస్తున్న కృషిని బట్టి ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకే కాకుండా మొత్తం దేశానికే నష్టదాయకం కనుక ఆ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు తనకు ఉంది అని దిశా రవి తన లాయర్ ద్వారా వాదించారు. రెండు మాసాలుగా రైతు ఉద్యమం సాగుతోంది (ఇప్పటికి మూడు మాసాలవుతోంది). ఇది అందరికీ తెలిసి జరుగుతున్న ఉద్యమం. రైతుల రిపబ్లిక్ డే ప్రదర్శన గురించి పోలీసులకు తెలుసు. దానికి వారు అనుమతించారు. జరిగిన హింసా ఘటనలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. 149మందిని విచారిస్తున్నారు. అవసరమైతే మరింత మందిని విచారించవచ్చు. కానీ అక్కడి హింసకు 'టూల్ కిట్' కారణం ఎలా అవుతుంది?
''టూల్కిట్''లోని విషయానికీ జనవరి 26న హింసకూ నేరుగా సంబంధం ఉందా అని కోర్టు అడిగితే పోలీసుల వద్ద సమాధానం లేదు. ''ఆధారాలు ఏమీ లేకపోతే అది కుట్ర అవుతుంది'' అని దిశా రవి తరపు న్యాయవాది అగర్వాల్ పోలీసులు, ప్రభుత్వంపై వ్యంగ్య బాణం వేశారు. మొత్తం మీత రైతు ఉద్యమం బీజేపీ ప్రభుత్వాన్ని ఎంతగా బెంబేలెత్తిస్తున్నదో... ఉద్యమానికి మద్దతు తెలిపిన దిశా రవి మీద, అనేక మంది పాత్రికేయులు, ఇతరుల మీద పెట్టిన కేసులు తెలియజేస్తున్నాయి.
- ఎస్.వి.ఆర్.