Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్న తల్లిని, పుట్టిన ఊరును ఎవరూ మర్చిపోలేరు. ఆ ఊరు వీడేటప్పుడు కలిగే బాధ అలవికానిది. పండుగలకు, పబ్బాలకు, పంక్షన్లకు ఊరికి వెళ్లి అందరినీ కలిసి వస్తాం. ఇదంతా శరమాములే. దేశ విభజన సందర్భంగా ఇక్కడ బతుకుతున్న వారు అక్కడికీ, అక్కడి వారు ఇక్కడికీ వచ్చారని చరిత్ర పుస్తకాల్లో చదువుకున్నాం. దేశ విభజన కాబట్టి ఎవరికి ఇష్టమైన దేశానికి వారు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎన్నో అనుబంధాలు, బంధాలు కష్టంగానే తెంచుకుని వెళ్లారు. తమ జ్ఞాపకాలను సంచుల్లో మూటకట్టుకుని, రైళ్లలోనూ, కాలినకాడనా వెళ్లారు. ఎంతో మంది ఉన్న చోటును వదిలి వెళ్లలేక పోయారు. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి. కానీ ఈ ఆరేండ్ల కాలంలో కూడా 25వేల మంది మాతృదేశాన్ని శాశ్వతంగా వీడారు. ఉపాధి కోసం వెళ్లి తిరిగొస్తారని అనుకుంటున్నారా? లేదండీ బాబూ శాశ్వతంగా మాతృభూమిని వదిలి వెళ్లారు. దేశంలో నెలకొన్న హింస, మతవిద్వేషాలు, హత్యలు, అత్యాచారాలు, ఆర్థిక పరిస్థితులు దిగజారిపోవడం, అసమానతలు పెరిగిపోవడం, ఉపాధి కోల్పోవడంతోపాటు ప్రశాంతమైన జీవనానికి తీవ్రమైన అంతరాయం కలగడంతో ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దేశ విభజన సమయంలోనూ ఇంత భయంకరమైన పరిస్థితులు లేవన్న నిర్ణయానికొచ్చారు వారు. స్వేచ్ఛగా బతికేందుకే మాతృదేశం వదిలి...పొరుగుదేశాలకు శాశ్వతంగా వలసపోవడమంటే...ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
- గుడిగ రఘు