Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ శాసనమండలి రెండు పట్టభద్రుల నియోజకవర్గాలనూ టీఆర్ఎస్ కైవశం చేసుకుంది. ప్రస్తుత ఎంఎల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, పివి కుమార్తె వాణీదేవి విజయం సాధించారు. అయితే అదేమీ సునాయాసంగా జరగలేదు. అందుకు చాలా ప్రాధాన్యతా దశలు దాటవలసి వచ్చింది. తొలగింపుల అవసరం పడింది. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్లో ప్రస్తుత బీజేపీ ఎంఎల్సీ రామచంద్రరావుకూ, నల్గొండ వరంగల్-ఖమ్మంలో జర్నలిస్టు తీన్మార్ మల్లన్నకూ దగ్గర దగ్గరగా ఓట్లు వచ్చాయి. హైదరాబాదులో ప్రొఫెసర్ నాగేశ్వర్, మరోచోట ప్రొఫెసర్ కోదండరాంలు కూడా బాగా ఓట్లు తెచ్చుకున్నారు. అంతిమంగా బీజేపీ సీటు టీఆర్ఎస్ గెలుచుకుంది. బీజేపీ ఉన్నసీటు పోగొట్టుకోవడమే గాక పోటీ చేసిన మరో చోట వారి అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి చాలా వెనకబడిపోయారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ తర్వాత తెలంగాణలో గద్దెనెక్కడమే తరువాయి అని హడావుడి చేస్తున్న బీజేపీకి ఇది పెద్ద దెబ్బ. రేపు జరగబోయే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ బీజేపీకి సరైన అభ్యర్థి ఎంపికే గగనమైన పరిస్థితిలో విజయం సాధించడమనే ఊసే ఉండదు. మరోవైపున చూస్తే గతంలో తెలంగాణ జెఎసి చైర్మన్గా అన్నీ నడిపించిన కోదండరామ్ తీన్మార్ మల్లన్న కన్నా బాగా వెనకబడి పోయారు. ప్రభుత్వ వ్యతిరేకత హైదరాబాదులో బీజేపీ అభ్యర్థికీ అక్కడ మల్లన్నకూ కలసి వచ్చిందని ప్రొఫెసర్ నాగేశ్వర్ అంచనా వేశారు. ఆయన వరకూ గతంలో వచ్చిన నిష్పత్తిలోనే ఓట్లు వచ్చినా ఈ కారణం వల్లనే మూడో స్థానానికి వెళ్లినట్టు కనిపిస్తుంది. బీజేపీ కూడా టీఆర్ఎస్పై గాక నాగేశ్వర్పైనే దాడి కేంద్రీకరించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడివుండొచ్చు. నాగేశ్వర్కు టీఆర్ఎస్ మద్దతు ఉందనేది చాలా రోజుల పాటు బీజేపీ చేసిన దుష్చ్రచారం. లౌకిక విధానాల కోసం మాట్లాడతారనే కోపంతో వేసిన నిందలు మరికొన్ని. తీరా ముఖ్యమంత్రి కేసీఆర్ వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించడమే గాక గట్టి ప్రచార వ్యూహంతో పాలక వర్గాలకు అలవాటైన పద్ధతులతో రంగంలోకి దిగి గెలిపించుకున్నారు. ఇదీ స్థూలంగా శాసనమండలి ఎన్నికల ఫలితాల తీరు.
కోదండ, రామచంద్ర గెలవాల్సిందా?
ఏ విధంగా చూసినా ఇది కేంద్రంలో పాలన వెలగబెడుతూ మతతత్వ రాజకీయాలతో నిరంకుశ పోకడలతో చెలరేగిపోతున్న బీజేపీ వ్యతిరేక తీర్పు, అదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపైనా ఖచ్చితమైన వ్యతిరేకత పెరుగుతున్నదని హెచ్చరించిన విజయంతో కూడిన తీర్పు. ఇటీవల ఓ రెండు పత్రికలలో ఈ ఫలితాలపై వచ్చిన పాక్షిక విశ్లేషణలు అవాస్తవికంగానే గాక అభ్యంతరకరంగానూ ఉన్నాయి. పట్టభద్రులయితే మాత్రం కొమ్ములుంటాయా అని ఒకాయన ప్రశ్నించడం, కోదండరాం ఓటమికి తెలంగాణ సమాజాన్ని తప్పు పట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా ప్రజా ఉద్యమాలను, ప్రత్యామ్నాయ శక్తుల పోరాటాలను తక్కువ చేసే చాలా వ్యాఖ్యలు అలవోకగా దొల్లించుతూ బీజేపీకి మాత్రం ఎక్కడలేని మినహాయింపులు ఇవ్వడంలో ఔచిత్యం కూడా అర్థం కాదు. అశ్వమేథం తర్వాత రాజసూయం వంటివ్యాసాల నుంచి దుబ్బాక జీహెచ్ఎంసీ సమీక్షలు ఏవి తీసుకున్నా ఇదే ధోరణి. టీఆర్ఎస్ పాలనపై ఆయన విమర్శలు సహేతుకమైనా ఆ పేరుతో బీజేపీ విజయాలకు సాకులు సమకూర్చవలసిన అవసరం ఏమిటో ఇతర లౌకిక వామపక్షాలపై ఆరోపణలు చేసి వారిని దోషులుగా నిలపాల్సిన అగత్యం ఏమిటో అర్థం కాదు. ప్రధాని మోడీతో సహా బీజేపీ నాయకత్వం తమపై పెరుగుతున్న వైముఖ్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని తంటాలు పడుతున్నదీ కనిపిస్తూనే ఉంది. అయినా సరే వారు అప్రతిహతంగా దూసుకుపోతున్నట్టు, ఇతరులకు ఠికాణా లేకుండా పోయినట్టు ఈయన రాస్తుంటారు. తెలంగాణలో కమ్యూనిస్టులకు కార్యకర్తలే దొరకడం లేదట! ఎన్నికల విజయాలు సాధించలేకపోతున్నారు, ప్రభావం పరిమితమై పోతుందంటే అది వేరు గాని అసలు కమ్యూనిస్టులకు తప్ప కార్యకర్తలనే వారు ఖచ్చితమైన ఉద్యమాల ఎజెండా మరెవరికి ఉందో ఆయన చెబితే బాగుండేది. ఒక వేళ అభ్యుదయ శక్తుల శ్రేయోభిలాషిగా చెబుతున్నారని అనుకుంటే బీజేపీ విషయంలో వంకరటింకరగానూ నిందాస్తుతులనూ చెప్పే సంపాదకులు కమ్యూనిస్టులు ఇతర పార్టీలపై మాత్రం నిరాధార నిందలతో ఎందుకు సూటిగా దాడి చేేస్తున్నట్టు? ఇందుకు చాలా ఉదాహరణలు ఇవ్వొచ్చు.
తెలంగాణ సమాజానిదే తప్పా?
ఆయన రాసిన అణిముత్యాలు కొన్ని.. ''దక్షిణాదిలో బీజేపీకి చలామణి తక్కువనేది బడాయి పరిశీలన''ట, కేరళలో ఈసారి ఎల్డీఎఫ్ తిరిగి వస్తుందని సర్వేలు చెబుతున్నా ఆ తర్వాత తర్వాత బీజేపీ తప్ప వేరే దిక్కు ఉండదట. పురోగామి ప్రాంతాలలో కట్టుబాటు సడలిపోయి శిథిలమవుతున్నదట. అసలు చదువుకున్న వాళ్లకే వివేకం లేకుండా పోయిందట. దానికి నిదర్శనం ఏమంటే విద్యాధికులు ప్రభుత్వ వ్యతిరేకంగా ఉంటారనే భావనకు అనుగుణంగా కోదండరాంనూ రామచంద్రరావును గెలిపించకపోవడమట. నాగేశ్వర్ కాకపోతే రెండవ స్థానం దాకా వచ్చిన రామచంద్రరావునైనా గెలిపించి ఉండాలట. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే గాక గట్టిగా ప్రశ్నించేవారట. వాస్తవానికి సరిగా ప్రశ్నించలేదని పనిచేయలేదని ఆయనపై బీజేపీలోనే అసంతృప్తి ప్రచారం జరిగిన ముచ్చట సంపాదక ప్రముఖులకు తెలియకపోవడం విచిత్రమే. ఇంతకూ ఈ మొత్తంలో ఎక్కడా బీజేపీ మతతత్వ ప్రచారాల పరాకాష్ట గురించి మాత్రం ప్రస్తావించకపోవడం మరీ విడ్డూరం. తీన్మార్ మల్లన్నకు బాగా ఓట్లు వచ్చిన నేపథ్యంపై పరిశీలన జరపాలట. ఆయన తీవ్ర విమర్శల వల్లనే ఓట్లు తెచ్చుకున్నారనేది నిజమైతే కోదండ, రామచంద్రలు ఎందుకు ఓడిపోయారని ఈయన ఆక్షేపణ. ఈ మొత్తం తర్కం ఎంత గజిబిజిగా వైరుధ్యభరితంగా ఉందో ఈ వ్యాఖ్యానం ఎవరి గురించి విచారిస్తున్నదో తెలుసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇంత రాసిన ఈ పెద్దమనిషి తెలంగాణ సమాజం ప్రభుత్వంపై విమర్శను కోరుకోవడంలేదని తేల్చిపారేశారు. తమాషా ఏమంటే బీజేపీ కూడా జాతీయంగా పాలకపార్టీ అనీ దానిపైనా వ్యతిరేకత వుండొచ్చనీ, ప్రజాస్వామ్య లౌకిక విలువలు మతసామరస్యం కోరేవారు దాన్ని ప్రత్యేకంగా వ్యతిరేకించాలని ఆయన గుర్తించలేకపోయారు. విద్యాధికులు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదని తప్పు పట్టిన సంపాదకులు ఇంత విజ్ఞత కలిగిన తాము బీజేపీ ఓటమిని ఎందుకు హర్షించలేకపోతున్నారు? ఏ తర్కంతో రామచంద్రరావు విజయాన్ని కోరుకున్నారు? అన్నట్టు ఈయన ఇంతగా నెత్తికెత్తుక్నున్న కోదండరాం గాని, ఆఖరుకు తీన్మార్ మల్లన్న గాని బీజేపీని ఎక్కడా రాజకీయప్రత్యర్థిగా భావించి విమర్శించకపోవడం యాధృచ్చికంకాదు. టీఆర్ఎస్ తప్పిదాలపై పోరాడే పేరిట దేశాన్ని ఆవరించిన మతతత్వ నిరంకుశత్వ పోకడలను చూడకపోవడం ఏమి వాస్తవికత? పట్టభద్రులకే కాదు, సంపాదకులకూ కొమ్ములుండవని దీంతో తేలిపోతున్నది. అది భాషా భావ పద విన్యాసాలతో దాచలేని పరమసత్యం.
అంతా గులాబీ భజనేనా!
ఇక దీనికి సమాధానంగా శుక్రవారం మరో ''సర్కారీ''వాదన పొడుచుకొచ్చింది. పట్టభద్రులకు కొమ్ములున్నాయి అంటూ రాసిన వ్యాసం తోక ముక్క మరో విపరీతం, ఒక పార్టీ పట్ల (అంటే టీఆర్ఎస్ పట్ల) ఆ సంపాదకుడికి భిన్నమైన భావజాలం కావచ్చుగాని దాన్ని అందరిపైనా రుద్దడమేమిటని ఈయన ప్రశ్నించారు. ప్రభుత్వం మంచి చేసినా పట్టభద్రులు ఓడించాలని చెప్పడం పొరపాటని హితబోధ చేశారు. బాగానేవుంది గానీ స్వతంత్రులు కూడా అన్ని ఓట్లు తెచ్చుకున్నారంటే వాస్తవంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే అత్యధికంగా ఉన్నాయని, కేవలం సాంకేతికంగానే సర్కారు అభ్యర్థులు గట్టెక్కారని ఒప్పుకోవడం సమంజసం. ఇక పోతే ఈయన కూడా మండలి స్థానాల ఫలితాన్ని ప్రభుత్వ భజనకు ఉపయోగించుకున్నారే తప్ప కేంద్ర విధానాలను, బీజేపీ మత రాజకీయాలను విమర్శనాత్మకంగా చెప్పిందేమీ లేదు. ఇది బహుశా టీఆర్ఎస్ రాజకీయ ఝంఝాటంలో భాగమే కావచ్చు. తెలంగాణ సమాజంలో పెరిగిన నిరాసక్తతకూ నిరసనకూ కారణాలేమిటనే చీమతలకాయంత ఆత్మ విమర్శ కూడా ఇందులో లేకపోవడం విచారకరం. గతంలో బీజేపీ హడావుడి చేస్తే ఇప్పుడు మా వంతు అన్నట్టే మొత్తం వ్యాఖ్యానం నడిచింది
అతీతశక్తి కాదు...
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ బెంగాల్ ఏ రాష్ట్రమైనా సరే పాలకవర్గాలు ఇచ్చిన వాగ్దానాలను ఉల్లంఘించి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడటం పరిపాటి. ఈ వ్యవస్థలో ఎన్నికల అక్రమాలు ప్రలోభాలు కూడా అందులో భాగమే. ఇందుకు ఒక రాష్ట్రం ప్రాంతం మినహాయింపుగా అతీతంగా ఉంటుందని మాన్య సంపాదకులొకరు అనుకోవడం మొదటి పొరబాటు. రాష్ట్రంలోనే తలదూర్చి దేశాన్ని చూడలేకపోవడం మరింత గ్రహపాటు. అటూ ఇటూ తిప్పి చెబుతూ అసలైన పాఠాలు ప్రజలకు అందకుండా చేయడం ఇలాంటి వారి అలవాటు. చెప్పగలిగింది, చెప్పవలసింది ఒక్కటే - పట్టభద్రులకూ సంపాదకులకూ కూడా కొమ్ములుండవు. కమ్ముకువచ్చే దుష్చ్రభావాల నీలి నీడలే ఉంటాయి. వాటిని సూటిగా ఒప్పుకోకుండా డొంకతిరుగుడు వంకరటింకర వాదనలు చేస్తే ఇలాగే పరిణమిస్తాయి. నిరంతరం విప్లవ పదోచ్చారణ చేస్తూనే ఆ శక్తుల పోరాటాలను ఉద్యమాలను ఎదురీతను అపహాస్యం చేయడానికీ బీజేపీ విజయాలు కోరుకోవడానికీ దారితీస్తాయి.
- తెలకపల్లి రవి