Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి 1, 2021 నాటికి భారతదేశంలో 9.2కోట్ల టన్నుల ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. ఇవి ఉండాల్సిన నిల్వల కంటే మూడు రెట్లెక్కువ. భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) వార్షిక నివేదిక ప్రకారం, 2019-2020లో ఉండాల్సిన నిల్వల కంటే కొంచెం తగ్గినప్పుడు, ఆహార నిల్వలను తీసుకొని రావడానికి 12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యింది. ప్రపంచ ఆకలి సూచిక (Global Hunger Index)లో, 107 దేశాల్లో 92వ స్థానంలో ఉన్న దేశం, సరిపడా ఆహార ధాన్యాల నిల్వలు కలిగి ఉన్న పరిస్థితుల్లో, పోషకాహార లోపంతో ఉన్న ప్రజానీకానికందరికీ ఉపశమనం కలిగే విధంగా ప్రతి ఒక్కరికీ సరిపడా ఆహారధాన్యాలను అందించడం ద్వారా ఒక నైతిక ఆహార భద్రతా విధానాన్ని కలిగి ఉండాలి. కానీ ప్రభుత్వం దీనికి వ్యతిరేకమైన ప్రణాళికలను రూపొందిస్తోంది.
గ్రామీణ జనాభాలో 75శాతం, పట్టణంలో జనాభాలో 50శాతం జనాభాకు తప్పకుండా ఆహార ధాన్యాలను అందించాల్సి ఉండగా, గ్రామీణ జనాభాలో 60శాతం, పట్టణ జనాభాలో 40శాతానికి పరిమితం చేయడం ద్వారా 'జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని' (ఎన్ఎఫ్ఎస్ఏ) బలహీన పరిచేందుకు నిటిఆయోగ్ సిఫార్సులు చేసిన ఫలితంగా 10కోట్ల మంది లబ్ధిదారులకు కోత పడుతుంది. 2011-2021 మధ్య కాలంలో పెరిగిన జనాభాకు కనీసం 9కోట్లకు పైగా లబ్దిదారులను చేర్చి ఉండాల్సిందన్న వాస్తవాన్ని నిటిఆయోగ్ కూడా అంగీకరించింది. కానీ ప్రభుత్వం మాత్రం 2011నాటి పాత సంఖ్యలనే పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇప్పుడు 2021 జనాభా వివరాలు ఒక సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి కాబట్టి, ఇంకా పెరుగుదలను నివారించలేము. ప్రభుత్వం చట్టాన్ని మార్చి, లబ్దిదారుల సంఖ్యను కుదించే ప్రయత్నం చేస్తుంది.
2014లో అధికారం చేపట్టిన మోడీ ప్రభుత్వం, కొన్ని నెలల్లోనే బీజేపీ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి శాంతకుమార్ నేతత్వంలో భారత ఆహార సంస్థ పనితీరు (ఎఫ్సీఐ), దాని సమస్యలకు సంబంధించి సిఫార్సులు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఊహించిన విధంగానే ఆ కమిటీ ''జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని పునస్సమీక్షించాలని'' సిఫార్సు చేసింది. అదేవిధంగా, లబ్ధిదారుల పరిధిని 67శాతం నుంచి 40శాతానికి తగ్గించాలని, కేంద్ర పంపిణీ ధరలను (Central issue prices) పెంచాలని సిఫార్సు చేయడం ద్వారా చట్టాన్ని కనుమరుగు చేసింది. కేంద్ర పంపిణీ ధరలను పెంచాలని కోరుకున్న 'ఎకనామిక్ సర్వే 2021'లో రెండవ సిఫార్సును ప్రతిధ్వనించింది. ఒకవేళ లబ్దిదారుల సంఖ్య కుదించాలన్న సిఫార్సు అమలు జరిగితే, ఆహార సబ్సిడీపై 49వేల కోట్ల రూపాయల మేరకు కోత విధిస్తారని నిటిఆయోగ్ లెక్క లేసింది. ధరలు పెంచాలని ఎకనామిక్ సర్వే చేసిన సూచన సబ్సిడీని మరింత కుదిస్తుంది. కార్పొరేట్ కంపెనీలకు సబ్సిడీలను కొనసాగించడానికి, విస్తరించడానికి మోడీ ప్రభుత్వం ప్రజల సబ్సిడీలను కత్తిరించేందుకు తీసుకున్న నిర్ణయం కన్నా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు పొందుతున్న లబ్ది దారుల పరిధి, ధరల్లో ప్రతిబింబించే ప్రజల ఆహార భద్రత హక్కును బలహీన పరిచే చర్యలను భారతదేశం ఎదుర్కొంటుంది. భారత ఆహార భద్రతా చట్టంపై చేస్తున్న ఈ దాడి, అంతర్గతంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణ విధానానికి ముడిపడి ఉంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు తోడైన ఈ విధానం జాతీయ ఆహార భద్రతా చట్టంపై దాడిగా భావించాలి.
ప్రజాపంపిణీ వ్యవస్థలో సార్వత్రిక విధానానికి బదులుగా 'దారిద్య్ర రేఖకు ఎగువన' (ఏపీఎల్),' దారిద్య్ర రేఖకు దిగువన' (బీపీఎల్) అనే వ్యవస్థను భిన్నమైన పేర్లతో కొనసాగించడంతో పాటు జాతీయ ఆహార భద్రతా చట్టం లోనే కొన్ని ఘోరమైన లోపాలున్నాయనేది నిజం. జాతీయ ఆహార భద్రతా చట్టం కంటే ముందు బీపీఎల్ కార్డులున్న ప్రతీ ఒక్కరికీ కనీసం 35కిలోలు కేటాయించాలన్న నిబంధనను గుర్తించకుండా, ప్రతీ ఒక్కరికీ 5కిలోలు కేటాయించాలనే పరిమితిని ఈ చట్టం విధించింది. 2013లో లబ్దిపొందిన వారి సంఖ్య 81.35 కోట్లుంటే, ఇప్పుడు 79.26 కోట్లకు తగ్గింది. గతంలో లబ్ది పొందిన జనాభాలోని ఒక భాగాన్ని (ఏపీఎల్) ఇప్పుడు ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి రాకుండా మినహాయించారు. భవిష్యత్తులో జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో లోపాలు లేకుండా చేసి, దానిని రక్షించడం ద్వారా బలోపేతం చేయాలన్న డిమాండ్ ముందుకు వస్తుంది.
జాతీయ ఆహార భద్రతా చట్టం ఉల్లంఘన
ఇప్పటికే 'జాతీయ ఆహార భద్రతా చట్టం' ముఖ్య నిబంధనలు ఉల్లంఘించబడుతున్నాయి. సెక్షన్ 4 ప్రకారం, ''(ఏ) ప్రతీ గర్భిణీ స్త్రీ, పాలిచ్చే ప్రతీ తల్లికి (గర్భిణీగా ఉన్న సమయంలో, బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు) ఉచిత ఆహారాన్ని అందించాలి (బీ) వారికి ఆరు వేల రూపాయల నగదు సబ్సిడీని ఇవ్వాలి''. 2017 వరకు నగదు సబ్సిడీ నిబంధన అమలు కాలేదు, ఆ తర్వాత ఏ సవరణలు చేయకుండానే చట్టాన్ని కుదించారు. ఆ కుదింపు, ఐదువేల రూపాయలకు నగదు సబ్సిడీని కత్తిరించడమే కాక చట్ట విరుద్ధంగా విధించిన నియమనిబంధనలు, 57శాతం గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు చట్టబద్ధంగా పొందే నగదు సహాయాన్ని పొందకుండా మినహాయిస్తుంది. ఇదికూడా మొదటి బిడ్డ ఉన్న వారికే పరిమితం చేశారు. ఇలాంటివి మొత్తం జననాలలో, కేవలం 43శాతం జననాలకు సంబంధించిన వారు మాత్రమే ఉంటారు. ఈ చట్టం కింద అర్హులైన మెజారిటీ స్త్రీలను, వారి హక్కులను నిరాకరిస్తున్నారు.
అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు వండిన పౌష్టికాహార మధ్యాహ్న భోజనాన్ని పొందే హక్కును కల్పిస్తుంది. కానీ ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించారు. 2021-22 బడ్జెట్లో మధ్యాహ్న భోజనపథకానికి సవరించిన అంచనా 12,900కోట్ల నుంచి 11,500కోట్లకు తగ్గిస్తూ కేటాయింపులు చేశారు. దీని వల్ల 12కోట్ల మంది బడి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహార నాణ్యత, పరిమాణంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. ఇది జాతీయ ఆహార భద్రతా చట్టం నియమ నిబంధనలకు తిలోదకాలు ఇవ్వడమే. అదేవిధంగా ఆరు నెలల నుంచి ఆరేండ్ల వయస్సు గల పిల్లలకు ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం స్థానిక అంగన్వాడీల ద్వారా ఉచిత ఆహారాన్నందించాలి, కానీ కేటాయింపులు తగ్గడంతో ఆహార పథకం అమలు తీరుపై తీవ్ర ప్రభావం పడింది. అందువల్ల జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా మాతత్వానికి సంబంధించిన నగదు ప్రయోజనాలను మహిళలకు అందించి, పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహార మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ కేటాయింపులు పెంచి ఆహార భద్రతా చట్టం నిబంధనల అమలుకు తక్షణమే హామీ ఇవ్వాలి.
అంత్యోదయ అన్నా కార్డులు
ఒక అంత్యోదయ అన్నా యోజన (ఏఏవై) కార్డు ఉన్న వ్యక్తికి, కేంద్ర పంపిణీ ధరల ప్రకారం (కేజీ గోధుమలు రూ.2, కేజీ బియ్యం రూ.3ల చొప్పున) 35కిలోల ఆహార ధాన్యాలు పొందడానికి అర్హత ఉంది. జాతీయ ఆహార భద్రతా చట్టం సెక్షన్ 3(1) ప్రకారం, ఏఏవై కార్డులు కలిగి ఉండే కుటుంబాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఏఏవై కార్డులు పొందడానికి అర్హులైన వారిని గుర్తించడానికి ఏఏవై కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. అర్హులైన వారిలో బలహీన గిరిజన సమూహాలు, భూమి లేని వ్యవసాయ కార్మికులు, దినసరి వేతన కార్మికులు, కుటుంబ భారం మోస్తున్న వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్నారు. ఆఖరికి, ఆ ప్రయోజనాలను పొందడానికి అర్హులైన సామాజిక వర్గాల సంఖ్య పెరిగే నాటికి, ఏఏవై కార్డులున్న కుటుంబాల సంఖ్య 2005 నుంచి 2.5 కోట్ల కుటుంబాల వద్ద నిలిచిపోయింది.
మార్చి 2015లో, మొత్తం జాతీయ ఆహార భద్రతా చట్టం ఉల్లంఘనలో భాగంగా మోడీ ప్రభుత్వం ''వలసలు, సామాజిక, ఆర్థిక స్థితిలో మెరుగుదల, మరణాల కారణంగా ఏఏవై కార్డు ఉన్న కుటుంబాలకు అర్హత లేకుంటే, అటువంటి కుటుంబాలను ఆ మేరకు తగ్గించాలని'' ఒక సర్క్యులర్ను విడుదల చేసింది. కానీ ఒకవేళ సామాజిక, ఆర్థిక స్థితి ఘోరంగా ఉండి, వారి స్థితిలో మెరుగుదల లేకుంటే ఏంటి పరిస్థితి? అంటే ''రాష్ట్రాల్లో అంత్యోదయ కార్డులున్న కుటుంబాలను గుర్తించకూడదు'' అనేది సర్క్యులర్ ఉద్దేశ్యం. దీంతో 2.5కోట్ల ఏఏవై కార్డులున్న కుటుంబాల సంఖ్య కరోనా వ్యాప్తి కాలంలో 2.35కోట్లకు తగ్గింది. నిరాశా నిస్పృహలు ఆవహించిన 2020లో 3.79 లక్షల అంత్యోదయ కార్డులను తొలగించింది. అంతేకాక వరుసగా మూడు నెలల పాటు రేషన్ తీసుకోపోలేక పోయిన 71,982 మందిని, ''నిశ్శబ్ద రేషన్ కార్డు హౌల్డర్లు'' అని, బోగస్ కార్డులున్న వారిగా గుర్తించి, కరోనా మహమ్మారి వ్యాప్తి కాలంలో 90 వేల ఏఏవై లబ్దిదారులను తొలగించారు.
వలస కార్మికులకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం, ఆచరణలో ఏఏవై పథకం కింద 35కిలోల ఆహార ధాన్యాలను పొందే అర్హత ఉన్న వారి సంఖ్యను గణనీయంగా తగ్గించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తున్న మార్చి 2015 ఆర్డర్ను రద్దు చేసి, ఏఏవై మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే అన్ని వర్గాల ప్రజలను చేర్చాలి. ''ప్రాధాన్యత'' కలిగిన కుటుంబాలకు సంబంధించి, కరోనా వ్యాప్తి కాలంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు, ఉచిత ఆహార ధాన్యాలను సమకూరుస్తామని ప్రకటించింది. కానీ ప్రాధాన్యతా జాబితాలో కేవలం 1.49కోట్ల మంది లబ్ధిదారులనే చేర్చారు. అవాక్కయ్యే విషయమేమంటే లబ్దిదారుల జాబితాలో 51లక్షల మందిని అదే కాలంలో తొలగించడంతో మొత్తంగా ప్రయోజనం పొందిన వారు కోటి మంది కన్నా తక్కువే ఉన్నారు.
రేషన్ కార్డుల రద్దు నియమాలు
మూడు కోట్ల రేషన్ కార్డుల రద్దుకు వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వాదనలు విన్న సుప్రీంకోర్టు ''ఇది చాలా తీవ్రమైన విషయం''గా పేర్కొంటూ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం అందజేసిన రద్దైన రేషన్ కార్డుల సంఖ్యలలో వైరుధ్యం ఉంది. ఫిబ్రవరి 2017లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆధార్ను రేషన్ కార్డులతో అనుసంధానం చేయడం వల్ల 3.95కోట్ల రేషన్ కార్డులు రద్దయ్యాయని ప్రధానమంత్రి లోక్సభలో చెప్పారు. కానీ అటువంటి సమాచారం ఏదీ రాష్ట్రాల నుంచి అందుకో లేదని తెలిసినట్టు సమాచార హక్కు పత్రాల దాఖలు ద్వారా తెలుసుకున్న హిందుస్థాన్ టైమ్స్ పత్రిక తెలిపింది.
మొత్తం 2.75కోట్ల బోగస్, అర్హతలేని రేషన్ కార్డులను 2013-2017లో తొలగించినట్టు, అంటే రూ.17,500కోట్లు 'పొదుపు' చేసినట్టు, పార్లమెంట్లో ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానంగా తెలిపారు. డిసెంబర్ 2019లో ఆహార మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండవ నివేదిక, 2016-2019 మధ్య కాలంలో 1.49రేషన్ కార్డులు రద్దయ్యాయని తెలిపింది. అంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన 2014 నుంచి కేంద్రంలో, అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నాలుగు కోట్లకుపైగా రేషన్ కార్డులను భౌతిక పరిశీలన చేయకుండా రద్దు చేశారు.
ఈ రేషన్ కార్డుల రద్దు, అసలైన లబ్దిదారుల ఆహార భద్రతా హక్కులపై దాడికి దారి తీసింది. ఒకవైపు ప్రభుత్వం కొత్త లబ్దిదారులను జాబితాలో చేర్చుకునేందుకు తిరస్కరించింది, మరొకవైపు కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం అవలంబించే విధానం పూర్తిగా ఏకపక్షంగా ఉంది. రేషన్కార్డుల రద్దుకు కేంద్ర ప్రభుత్వం అవలంబించే విధానాలను తక్షణమే నిలిపివేయాలి, భౌతిక పరిశీలన చేయకుండా ఏ ఒక్క కార్డూ రద్దు చేయకూడదు. భౌతిక పరిశీలనలో స్థానిక పంచాయతీ సంస్థల భాగస్వామ్యం ఉండాలి.
వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి లబ్దిదారులు ఆధార్ కార్డును ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు అంగీకరించింది. ''ప్రభుత్వం, రేషన్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు సెప్టెంబర్ 2020 వరకు గడువును పొడిగించింది కాబట్టి ఏ ఒక్కరికీ ఆహార ధాన్యాల కోటాను నిరాకరించకూడదని'', మే 2020 లో కేంద్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. ఇంకో మాటలో చెప్పాలంటే, రేషన్ పొందడానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అనే విషయాన్ని ఇది నిర్ధారిస్తుంది. మార్చి 2021 నాటికి 79.28కోట్ల మంది లబ్ధిదారులకుగాను ఇంకా 8.8కోట్ల మంది ఆధార్ కార్డును అనుసంధానం చేయాల్సి ఉంది. బయోమెట్రిక్ పద్ధతిలోని అసమతుల్యత, లోపభూయిష్టమైన యంత్రాల వలన గణనీయమైన సంఖ్యలో లబ్దిదారులు రేషన్ పొందే హక్కును కోల్పోతున్నారు.
జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సామాజిక భద్రతకు హామీ ఇవ్వాలంటే, కుటుంబానికి కనీసం 35కిలోల (ప్రస్తుత కేంద్ర పంపిణీ ధరల ప్రకారం గోధుమలు కేజీ రూ.2, బియ్యం కేజీ రూ.3ల చొప్పున) ఆహార ధాన్యాలను పొందే హక్కుపై ఆధారపడే ఆహార భద్రతా వ్యవస్థ భారతదేశానికి అవసరం. ఇతర నిత్యావసర ఆహార వస్తువులను కూడా సబ్సిడీ ధరలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించాలి. దాడికి గురవుతున్న రైతుల హక్కులతో ముడిపడిన ఆహార ధాన్యాల ఉత్పత్తి, సేకరణ విధానాల నేపథ్యంలో ఆహార భద్రత కోసం పోరాటం జరుగుతోంది.
- బృందా కరత్
పీపుల్స్ డెమోక్రసీ సౌజన్యంతో
అనువాదం : బోడపట్ల రవీందర్
సెల్: 9848412451