Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఒక కీలకమైన యంత్రాంగం సుప్రసిద్ధమైన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్). రాజ్యాంగంలోని 148 నుంచి 151 అధికరణాల ప్రకారం ఏర్పాటయిన ఈ సంస్థ అధికార పరిధి విస్తృతమైనది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే స్వతంత్ర సంస్థలు, కార్పొరేషన్లు సంపాదించే ఆదాయాలనూ, చేసే వ్యయాలనూ మొత్తంగా కొన్ని సార్లూ, నమూనా తీసుకుని కొన్నిసార్లూ లెక్కలు వేసి ఎక్కడ ఆదాయం కోల్పోవడం జరిగిందో, ఎక్కడ వృథా వ్యయం జరిగిందో కూలంకషమైన నివేదికలను సమర్పించడం కాగ్ పని. రాజ్యాంగ నిర్దేశం ప్రకారం కాగ్ తన నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవైతే రాష్ట్రపతికి, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవైతే రాష్ట్ర గవర్నర్కు సమర్పించాలి. వారు ఆ నివేదికలను పార్లమెంటులో లేదా శాసనసభలో ప్రవేశపెట్టవలసిందిగా (టేబుల్ చేయడం అంటారు) సంబంధిత ప్రభుత్వాలను ఆదేశిస్తారు.
మిగిలిన రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరు ఎలా ఉన్నప్పటికీ, అవి వాటి విధ్యుక్తధర్మాలను ఎంత ఘోరంగా ఉల్లంఘిస్తున్నప్పటికీ, కాగ్ నివేదికలు మాత్రం కొంత విశ్వసనీయతను సంతరించుకున్నాయి. కాగ్ మొత్తం ఆర్థిక వ్యవస్థ నిర్వహణ మీద, ప్రవర్తన మీద నివేదికలతో పాటు యథాలాపంగా నమూనాగా ఎంపిక చేసిన కొన్ని రంగాల ఆదాయ వ్యయ గణాంకాలను కూడ క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏయే లోపాలు జరిగాయో విశ్లేషిస్తుంది. మన బడ్జెట్ల, ఆదాయ వ్యయాల గణాంకాలే జరిగిపోయిన మూడో సంవత్సరానికి గాని కచ్చితంగా నిర్ధారణ అయ్యే అవకాశం లేదు గనుక కాగ్ నివేదికలు సాధారణంగా రెండేండ్ల వెనుకటి, మూడేండ్ల వెనుకటి విషయాల గురించినవే అయి ఉంటాయి. అంటే ఆ నివేదికలు ఒక రకమైన శవపరీక్షల లాంటివి. ఈ శవపరీక్ష ద్వారా జరిగిపోయిన తప్పులను సరిదిద్దలేం. కోల్పోయిన ఆదాయాలను, దుబారా చేసిన వ్యయాలను తిరిగి పునరుద్ధరించలేం. కాని మొత్తంగా ప్రజాధనానికి ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి, ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో ఎంత అరాచకంగా ఉందో తెలుసుకోవడానికి ఈ కాగ్ నివేదికలు ఉపయోగపడతాయి. అవి చట్టసభల్లోని ప్రజా ప్రతినిధులు నిజంగా చర్చిస్తే, ప్రభుత్వ అక్రమాలను నిలదీస్తే, భవిష్యత్తులో అటువంటి తప్పులు మళ్లీ జరిగే అవకాశం లేకుండా చూడవచ్చు.
కాని ఇంత ముఖ్యమైన బాధ్యత నిర్వహించే కాగ్ గురించీ, కాగ్ నివేదికల గురించీ ప్రభుత్వాలు మొదటి నుంచీ నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నాయి. సాధారణంగా ఈ నివేదికలను శాసనసభలో పార్లమెంటులో చర్చకు పెడితే ప్రభుత్వ తప్పులూ అక్రమాలూ బైటపడతాయి గనుక అన్ని ప్రభుత్వాలూ వాటిని చర్చకు రాకుండా చూడడాన్ని ఒక కళగా అభివృద్ధి చేశాయి. సాధారణంగా శాసనసభ సమావేశాల చివరి రోజున హడావుడిగా కాగ్ నివేదికల కట్టను శాసనసభ ముందుంచడం, కొన్ని నిమిషాల్లోనో, గంటల్లోనో సభ నిరవధికంగా వాయిదా పడడం ఆనవాయితీ అయిపోయింది. ఆ రకంగా కాగ్ నివేదికల మీద శాసనసభల్లో అవసరమైన చర్చ జరగడమే లేదు. తమ సహజ వనరులకూ, తమ సంపదకూ, తాము చెల్లిస్తున్న పన్నుల బొక్కసాలకూ ఏమి జరుగుతున్నదో ప్రజలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన సత్యాలు చర్చకే రాకుండా పోతున్నాయి. సాధారణంగా కాగ్ నివేదికలు వందలాది పేజీలు ఉంటాయి గనుక, గణాంక విశ్లేషణలతో కూడి ఉంటాయి గనుక అవి చదివే, చర్చించే ఓపికా తీరికా శాసనసభ్యులకు ఉండవు. తొంబైశాతం శాసనసభ్యుల కాగ్ నివేదికల కట్టలు త్వరలోనో, ఆలస్యంగానో పాతపత్రికల రద్దుగా అమ్మకమైపోతాయి. ఆ అంకెల కీకారణ్యాన్ని పరిశోధించాలనే ఆసక్తీ, తీరికా, అభినివేశమూ ఉన్న పత్రికల, ప్రచారసాధనాల విలేఖరులు ఒకరో ఇద్దరో అవి చదివి వార్తలు రాస్తారు గాని అది ఒక్కరోజు వ్యవహారంగా మిగిలిపోతుంది. అత్యంత కీలకమైన ప్రజాధన వినియోగానికి, దుర్వినియోగానికి సంబంధించిన కీలక వ్యవహారం గాలిలో కలిసిపోతుంది.
మహా ఘనత వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడ తన ప్రజాధన నిర్వహణ గురించిన కాగ్ నివేదికల పట్ల సరిగ్గా పాత ప్రభుత్వాల లాగనే, తాను తీవ్రంగా విమర్శించిన ఇతర పార్టీల ప్రభుత్వాల లాగనే పని చేస్తున్నది. తాజా ఉదాహరణ చెప్పాలంటే తెలంగాణకు సంబంధించి కాగ్ సమర్పించిన ఏడు నివేదికలను మార్చి 26న, శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరిరోజున, ప్రవేశపెట్టారు. ఈ ఏడు నివేదికలూ కలిసి 900 పేజీల పైనే. మొదటి నివేదిక (164 పేజీలు) 2018 సంవత్సరానికి సంబంధించిన సింగరేణి కాలరీస్ పనితీరును, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక రంగం, ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక ప్రవర్తనను మదింపు చేసింది. రెండో నివేదిక (128 పేజీలు) వాణిజ్య పన్నులు, రాష్ట్ర ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ - స్టాంపులు, రవాణా, లాండ్ రెవెన్యూ, గనులు వంటి రాష్ట్రప్రభుత్వ రెవెన్యూ రంగ శాఖలకు సంబంధించిన లెక్కలను మదింపు చేసింది. మూడో నివేదిక (142 పేజీలు) హైదరాబాద్ తాగునీటి పథకం నిర్వహణ గురించీ, సాధారణ, సాంఘిక రంగానికి చెందిన వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, పురపాలన, పట్టణాభివృద్ధి, ప్రణాళిక, యువజన సంక్షేమం, పర్యాటక రంగం, సంస్కృతి రంగం వంటి శాఖల్లో కేటాయింపుల అమలు తీరును పరిశీలించింది. నాలుగో నివేదిక (128 పేజీలు) ప్రభుత్వ ద్రవ్య వ్యవహారాలకు సంబంధించినది. బడ్జెట్ కేటాయింపులను, వ్యయాలను, నిర్వహణను మదింపు చేసినది. ఐదో నివేదిక (116 పేజీలు) వివిధ శాఖల కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుకు సంబంధించినది. ఇందులో విద్యుత్ రంగం గురించీ, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ గురించీ చర్చించారు. ఆరో నివేదిక (118 పేజీలు) రెవెన్యూ రంగపు పనితీరును చర్చించింది. ఏడో నివేదిక (90 పేజీలు) సాధారణ, సాంఘిక, ఆర్థిక సేవా రంగాల గణాంకాలను మదింపు చేసింది.
ఈ నివేదికల గురించి తెలుసుకోవలసిన విషయాలన్నిటినీ వివరించడానికి ఈ శీర్షిక సరిపోదు. ప్రధానంగా చెప్పాలంటే ''ఆర్థిక శాఖ తన బడ్జెట్ తయారీ కసరత్తును హేతుబద్ధంగా సాగించాలి. బడ్జెట్ అంచనాలకు, వాస్తవ గణాంకాలకు మధ్య తేడా తక్కువగా ఉండేలా చూడాలి'' అని నివేదికలో ఉన్న ఒక్కమాట రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ వంటకపు నిర్వాకానికి పట్టి చూపిన మెతుకు.
అదే క్రమంలో ''2015-16 నుంచి 2018-19 వరకు రెవెన్యూ మిగులును రూ.9,481.97 కోట్లు ఎక్కువ చేసి చూపారు. ద్రవ్య లోటును రూ.217.86 కోట్లు తక్కువచేసి చూపారు'' అని, ప్రభుత్వం చెప్పిన రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు అంకెలు తప్పు అని కాగ్ నివేదిక వ్యాఖ్యానించింది.
అలాగే, ''రాష్ట్రప్రభుత్వం 2014-19 మధ్య మూలధన పథకాల మీద రూ.1,01,877 కోట్లు ఖర్చుపెట్టింది. ఈ మూలధన పథకాలలో సింహభాగం నీటిపారుదల, వరద నియంత్రణ పనులే. కాని ఈ పథకాలను పూర్తి చేయడంలో ఆలస్యం వల్ల ఈ వ్యయపు నాణ్యత మీద ప్రభావం పడడం మాత్రమే కాక, ఉద్దేశించిన ఫలితాలు, ఆర్థికాభివృద్ధి సాధించడం కూడ జరగలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న 26 పథకాలలో, 20 పథకాలు మూడు నెలల నుంచి 11 ఏండ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అందువల్ల ఈ పథకాల వ్యయం రూ.1,87,848 కోట్లు పెరిగిపోయింది. అందులో రూ.1,00,494 కోట్లు ఈ అసంపూర్ణ పథకాల మీద ఇప్పటికే వెచ్చించారు'' అని ఈ నివేదికలు అన్నాయి.
అంతే కాదు, ''ఏ ఒక్క నీటిపారుదల పథకమైనా ఏ ఆర్థిక ఫలితాలను సాధించిందో రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేదు'' అంటూ ''నిరంతరంగా భారీ పెట్టుబడులు పెడుతున్న భారీ నీటి పారుదల పథకాల వల్ల ఏ ఫలితాలు సాధించారో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అంచనా వేయాలి. భవిష్యత్తు పెట్టుబడులకు ఆ ఫలితాలే మార్గదర్శకంగా ఉంటాయి'' అని కూడ కాగ్ సూచించింది.
ఏయే రంగంలో ఏయే శాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతెంత ఆదాయాన్ని పోగొట్టుకుందో, ఎంత అనవసర వ్యయం చేసిందో పూర్తి వివరాలు తెలుసుకోదలచినవారు ఈ కాగ్ నివేదికలు సంపాదించి ప్రతి పేజీలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ వేసిన మొట్టి కాయలు చూడవచ్చు. ఇక్కడ మచ్చుకు కొన్ని:
- ఐదు శాఖలకు చెందిన 65 కార్యాలయాలు 2017-18 సంవత్సరానికి సంబంధించిన పన్నుల, పన్నేతర ఆదాయాల ఫైళ్లు, లైసెన్సు ఫైళ్లు, ఇతర అవసరమైన రికార్టులను కాగ్ పరిశీలనకు ఇవ్వలేదు. పన్ను ఆదాయాలకు, పన్నేతర ఆదాయాలకు సంబంధించి దొరికిన కాగితాలను పరిశీలిస్తే, 2017-18 సంవత్సరంలో 1836 కేసులలో తగ్గించిన అంచనాలు, తక్కువ పన్ను వసూలు చేయడం, ఆదాయ నష్టం వల్ల రాష్ట్రప్రభుత్వానికి రూ. 957.14 కోట్ల నష్టం సంభవించింది.
- ఎనిమిది జిల్లాల్లోని 24 మండలాల్లో యథాలాపంగా మచ్చుకు పరిశీలిస్తేనే ప్రభుత్వం అసైన్ చేసిన 12,666 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్టు తెలిసింది. ఈ భూమి విలువ రూ.1,096.45 కోట్లు,
- సికింద్రాబాద్లో ఒక లక్షా అరవై ఏడు వేల చదరపు గజాల స్థలాన్ని అద్దెకు తీసుకున్న వారు, అద్దెకాలం ముగిసి, పొడిగించమని ప్రభుత్వాన్ని కోరక పోయినప్పటికీ, ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు. ఈ స్థలం విలువ రూ.708.53 కోట్లు.
- హైదరాబాద్ తాగునీటి సరఫరా పథకంలో లెక్కల్లోకి రాని నీటి పరిమాణం 2014-15లో రోజుకు 134.57 లక్షల గాలన్లు ఉండగా, 2017-18లో అది 29 శాతం పెరిగి 172.95 గాలన్లుగా మారింది.
- చెరువుల సర్వే, నమోదు కార్యక్రమం కన్సల్టెంట్ను నియమించిన మూడు సంవత్సరాల తర్వాత, జూన్ 2018 నాటికి కేవలం ఐదు శాతం పని మాత్రమే జరిగింది. ఇందుకోసం రూ.12.62 కోట్ల అనవసర వ్యయం జరిగింది.
- గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ చెరువుల పరిరక్షణ, సుందరీకరణ వగైరా పనుల కోసం 2014-18 మధ్య రూ.287.33 కోట్లు కేటాయించినప్పటికీ రూ.42.14 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది.
- నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం శాసనసభ్యులకు 2014-18 మధ్య రూ.1,462.99 కోట్ల కేటాయింపు జరగగా, అందులో ఐదు శాతానికి, రూ.69.58 కోట్లకు మాత్రమే, యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (వినియోగించినట్టు ధ్రువీకరణపత్రాలు) అందాయి.
- అనర్హులైన విద్యార్థులకు మహాత్మా జోతిబా ఫూలే బీసీి ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఉపకారవేతనాలు ఇవ్వడం ద్వారా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ రూ.1.90 కోట్లు దుబారా చేసింది. అనవసరమైన నిర్మాణాన్ని చేపట్టి, దాన్ని మధ్యలోనే వదిలివేసి కాకతీయ విశ్వవిద్యాలయం రూ.1.61 కోట్లు దుబారా చేసింది. సిరిసిల్ల మునిసిపాలిటీలో మిషన్ భగీరథ ప్రారంభమైనాక కూడ మధ్యంతర పంపింగ్ స్టేషన్ ను నిర్మించడం ద్వారా రూ.2.53 కోట్లు దుబారా చేసింది. ఇవి మచ్చుకు పట్టి చూసిన మెతుకులు మాత్రమే. బంగారు తెలంగాణ భాండంలో అన్నం ఎంత ఉడికిందో!!!
- ఎన్. వేణుగోపాల్
సెల్: 9848577028