Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సృష్టి మొదలైన నాటి నుంచి వేద సంస్కృతి ఈ పవిత్ర భారతదేశంలో పరిఢవిల్లుతూ ఉందని, ఈ దేశం ప్రపంచానికి జ్ఞానాన్ని ప్రసాదించిందని - చెప్పుకునే మాటలు కాసేపు పక్కనపెట్టి ఆలోచిద్దాం! ఈ దేశం ప్రపంచానికి ఇచ్చిందా లేక ప్రపంచం నుంచి ఈ దేశమే కొన్ని సంగతులు గ్రహిస్తూ వచ్చిందా విశ్లేషించుకుందాం. ప్రపంచమంతా ఒకటే అయినప్పుడు, కొన్ని విషయాలు అటు నుంచి ఇటు, మరి కొన్ని ఇటు నుంచి అటూ వెళ్ళి ఉంటాయి. ఎవరైనా సరే, ముందు ఆ విషయం ఒప్పుకుని తీరాలి. మన సింధూ నాగరికతకు ముందు, సమాంతరంగా ప్రపంచంలో అనేక నాగరికతలు వర్ధిల్లాయి. కాల విభజన ప్రకారం ఏది ఎప్పుడు పరిఢవిల్లిందో సులభంగానే గ్రహించుకోవచ్చు. ఇబ్బంది లేదు. నైలునది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈజిప్టు దేశంలో 3100 బీసీఈ నుంచే నాగరికత ప్రారంభమైంది. మరో రెండు, మూడు వందల సంవత్సరాల తర్వాత గానీ, ఈ దేశంలో సింధూనాగరికత (2600-19 బీసీఈ) ప్రారంభం కాలేదు. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించామని చెప్పుకునే వేద సంస్కృతి 1500-500 బీసీఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది సరే, ఇక ఇప్పుడు ఒకసారి ప్రాచీన ఈజిప్టు సంస్కృతిలోకి వెళ్ళి, ఆనాటి వారి విశ్వాసాలు, భావనలు ఎలా ఉండేవో చూద్దాం! వారు రూపకల్పన చేసుకున్న దేవుళ్ళు, మన దేశంలోని వైదిక ప్రభోదకులకు ఏమైనా ఉపయోగపడ్డాయో లేదో గమనిద్దాం!
అతి పురాతన ఈజిప్టు దేవుళ్ళలో ముఖ్యమైన వాడు 'రా'. ఒక్కోసారి 'రే' అని కూడా పిలుస్తారు. క్రీ.పూ.25-24 శతాబ్దాలలో రూపకల్పన చేయబడ్డవాడు. ఆకాశాన్ని, భూమిని సకల చరాచర జగత్తును పాలించేవాడిగా గుర్తించారు. రా-అంటే సూర్యుడు. ఆకాశదేవుడి పేరు వోరస్. బహుశా 'హారిజన్స్' అనే పదం హౌరస్ నుంచే వచ్చి ఉంటుంది. అలాగే సృష్టికర్త అయిన 'రా'- వైదిక ధర్మంలో 'బ్ర-హ్మ'గా మారి ఉంటుంది. ఒక్కోసారి రా-హౌరస్లు కలిపి రా-హౌరక్టిగా వ్యవహరించారు. అన్ని జీవరాసులు రా-వల్లనే ఉద్భవించాయనీ, మనుషులు రా-స్వేదంతోను, కన్నీళ్ళతోనూ పుట్టారని, ఆనాటి ఈజిప్టు ప్రజలు భావించారు. అందుకే తమను తాము 'సూర్యుడి పశువులు' (cattle of Ra)గా భావించుకుంటూ ఉండేవారు. ఇలా అనేక కల్పనలు, భావనలు వారికి ఉండేవి. తమనూ, ఇతర ప్రాణులనూ సూర్యుడే (రా) పుట్టించాడన్న ఈజిప్షియనుల భావాన్ని మన పూర్వీకులు కూడా అనుసరించారు. మన సంప్రదాయ కవులు రాసిన ''ఎవ్వనిచే జనించు జగమెవ్వని'' పద్యం ఒక ఉదాహరణ!
రా-ను దేవతల రారాజుగా భావించుకున్న ఈజిప్షియన్లు అతనిని ఒక మనిషి ఆకారంలోనే ఊహించుకున్నారు. మనిషికి గద్దజాతికి చెందిన ఒక పక్షితల ఉన్నట్టుగా భావించుకున్నారు. మనిషిలాగా ఉన్న భాగాన్ని అటుమ్ (ATUM) అని, పక్షి ఆకారపు తలను ఖెప్రి (KHEPRI) అని అనేవారు. బహుశా వైదిక ధర్మంలోని 'ఆత్మ' ఈ అటుమ్ అనే శబ్దం నుంచే రూపొందించుకుని ఉండొచ్చు. పక్షితల మీద గుండ్రటి సోలార్ డిస్క్ ఉండి మళ్ళీ దానిపైన తాచుపాము ఉంటుంది. గ్రహణ సమయంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి పాము మింగేస్తుందన్న ఆలోచన, వైదిక ధర్మబోధకులకు 'రా'-చిత్రపటం చూసిన తర్వాత కలిగి ఉంటుంది. రా - షు (గాలి దేవుణ్ణి) టెప్నట్ (తేమ దేవతని) ఇంకా ఇతర దేవతల్ని సృష్టించాడు. రా-కు ముగ్గురు కుమార్తెలు.. 1. బాస్టెట్ 2. హథోర్ 3. షెక్మెట్. వీరిలో షెక్మెట్ను మండే సూర్యునేత్రంగా భావించేవారు. రా- ఆధిపత్యాన్ని అంగీకరించని వారిని, లేదా తప్పులు చేసిన వారిని రా- తన షెక్మెట్తో కాల్చేయిస్తాడు. రక్షించాలన్నా, శిక్షించాలన్నా షెక్మెట్ చేయాల్సిందే. రా - మెత్తబడి ఎవరినైనా దయా దాక్షిణ్యాలతో కరుణించాలంటే తన కూతురు హథోర్ ద్వారా చేసేవాడు. ఆమె ప్రేమకు ప్రతినిధి. ఇక బాస్టెట్ - ఒక కారుణ్య మూర్తి.
రా (సూర్యుడు) మిలియన్ సంవత్సరాల పడవలో ప్రయాణిస్తూ ఉంటాడు. ఇందులో మళ్ళీ రెండు పడవలుంటాయి. ఉదయపు పడవ, రాత్రి పడవ. రాత్రి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని 'అండర్ వరల్డ్ ఆఫ్ ఈజిప్టు'గా ఈజిప్షియన్లు భావిస్తారు. ఈ పడవలో రా-ప్రయాణిస్తున్నప్పుడు అతనితో పాటు ఇతర దేవతలు కూడా వెంట ఉంటారు. సియా (PERCEPTION) హు(COMMAND), హెకా(MAGICAL POWER) మొదలైనవారు. ఎఫోఫిస్ (ప్రళయం సృష్టించే దేవుడు) పెద్ద సర్పాకారంలో ఉంటాడు. ప్రతిరోజు రాత్రి సూర్యుడి పడవకు అడ్డుపడతాడు. సూర్యుడ కనబడకుండా పోయినప్పుడు ఆయన కిందిలోకంలో ఉండి, దుష్టశక్తులతో పోరాడుతుంటాడని ఈజిప్షియనులు భావిస్తారు. అప్పుడు ఆయనను ఎఫ్ (AF) అనిగానీ, ఎఫూ (AFU) అని గాని పిలుచుకుంటారు. కిందిలోకంలో ఉన్నప్పుడు రా-ఒసిరిస్ (OSIRIS)తో ఐక్యమయ్యాడని తలుస్తారు. ఒసిరిస్- అంటే మృత్యుదేవత. ఏది ఏమైనా పన్నెండు గంటల తర్వాత సూర్యుడు మళ్ళీ జన్మిస్తాడు. సూర్యోదయాన్ని వాళ్ళు అలా 'సూర్యుడు మళ్ళీ జన్మించాడన్నట్టుగా భావిస్తారు.
ఈజిప్షియనుల భావనలు, విశ్వాసాలు అంత మామూలుగా ఏమీలేవు. చాలా సంక్లిష్టంగా ఉన్నాయి. అయినా కొంత సారాంశాన్ని గ్రహించడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎత్తి చెప్పాను. అప్పటికి ఇంకా శతాబ్దాలు, దశాబ్దాలు, సంవత్సరాలు వంటి పదాలు రూపొందలేదు. కానీ, వారు కాలవిభజనని సూర్యుడి మొదటి డైనాస్టీ, రెండో డైనాస్టీ అంటూ విభజించుకుంటూ పోయారు. కాలం గడుస్తున్న కొద్దీ పిరమిడ్లు, సమాధులు రూపొందించబడుతూ వచ్చాయి. సమాధుల మీద రాతలు రాయడం ఎక్కువైంది. సర్వశక్తి సంపన్నుడైన సూర్యుడు (రా) తమ విన్నపాల్ని ఎప్పుడో చనిపోయిన తమ పూర్వీకులకు చేరవేస్తాడని వారి భావన. సూర్యుడు రాత్రి పడవనెక్కి ప్రతి రోజూ కిందిలోకాలు తిరిగి, మళ్ళీ తూర్పున జన్మిస్తున్నాడు కదా! అందుకని, ఎవరు ఏ లోకంలో ఉన్నా అందరినీ రా- కలుపుకుంటాడని వారి నమ్మకం. తమ సందేశాల్ని తమ పూర్వీకులకు అందిస్తాడని ఆశ. పిరమిడ్ల మీద, సమాధుల మీద రాసే రాతలు అందుకే. లండన్లో పెట్రీ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్ ఆర్కియాలజీ-లో అతి పురాతన ఈజిప్టు శిలలు భద్రపరచబడి ఉన్నాయి. వాటి మీద ఆనాటి చిత్రాలు, రాతలు అలాగే ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించిన పరిశోధకులు అనేక విషయాలు తెలియజేశారు. వాటిలో ఏవో కొన్ని మాత్రమే నేనిక్కడ ప్రస్తావించాను. ఆసక్తి ఉన్నవారు అంతర్జాలంలో వెతికి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు...
వేదకాలం నాటికి - విగ్రహారాధనలో సూర్యునికి ఆధారం ఈజిప్టు సంస్కృతిలో లభించింది. సూర్యుణ్ణి ప్రకృతి ప్రసాదించిన ఒక శక్తిగా గుర్తించారు. ఆ శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి ఇక్కడ వీరు సంధ్యావందనం ప్రారంభించారు. రామ్ అంటే సూర్యుని వలన పుట్టిన వాడు అని అర్థం. సీత్రే అంటే సూర్యుని పుత్రిక అని అర్థం. బౌద్ధుల జాతక కథల ప్రకారం - దశరథుడు కాశీకి రాజు. అయోధ్యకు కాదు. రామ, లక్ష్మణ, సీత ముగ్గురూ దశరథుడి మొదటి భార్యకు పుట్టిన తోబుట్టువులు. రెండవ భార్య గయ్యాళి. ఆమె నుంచి తన మొదటి భార్య పిల్లలను రక్షించుకోవడానికి దశరథుడు వారిని హిమాలయాలకు పంపిస్తాడు. 12 సంవత్సరాల తర్వాత వారు రాజ్యానికి తిరిగి వస్తారు. సీతాపహరణం ఈ కథలో లేదు.. జాతక కథలలో వలె ఉన్నది ఉన్నట్టుగా కాక,పాత్రలు, వాటి విధానాలు, నడవడి కొద్దిగా మార్చుకుంటూ మనువాద హిందూ పురాణాలు రాయబడ్డాయని ఆధారాలు దొరుకుతున్నాయి.
ఈజిప్టు కథల్లోని పాత్రలకు, భారతీయ హిందూ పురాణ పాత్రలకూ పోలికలు ఉన్నాయి. వరాహావతారాన్ని పోలిన పాత్ర ఈజిప్టు పురాతన గాథలలో ఉంది.. 'సేథ్' ఒక భారీ వరాహరూపాన్ని తీసుకుని రే-ముందుకు వస్తాడు. యుద్ధంలో రే(సూర్యుడు) హౌరస్ కళ్ళలోకి చూస్తున్నప్పుడు, సేథ్, హౌరస్ కంటిని గాయపరుస్తాడు. హౌరస్ (ఆకాశదేవుడి) కన్ను బంగారు రంగులోకి మారుతుంది. అప్పుడు 'హిరణ్యాక్షుడు' అని అంటారు. అంటే బంగారు కన్నుగలవాడు అని అర్థం!
పురాణాల్లోని విష్ణుమూర్తికి, ఈజిప్టు దేవుడు 'నన్'కు పోలికలున్నాయి. రిచర్డ్ విల్కిన్సన్ ప్రకారం ప్రళయం నుంచి భూగోళాన్ని ఎత్తే ఈజిప్ట్ దేవుడు 'నన్'ను, హిందువుల వరాహావతారంతో పోల్చవచ్చునన్నాడు. రిచర్డ్ హెచ్. విల్కిన్సన్ అమెరికన్ రచయిత. ఈజిప్టు తవ్వకాలపై 25ఏండ్లు పరిశోధనలు చేసిన ఆర్కియాలజిస్ట్ - సృష్టి కొనసాగించడానికి అంతరాయం ఏర్పడుతుంది. భూమి సముద్రంలో మునిగిపోతుంది. అప్పుడు ఈజిప్టు దేవుడు భూమిని పైకి తీస్తాడు. మునిగిపోతున్న పడవను పైకెత్తుతాడు. ఇది మహావిష్ణువు మత్స్యావతారానికి దగ్గరగా ఉంది. 'సేషత్'- ప్రాచీన ఈజిప్టు దేవత. రచన, సంగీతం, ఊహాశక్తి, గణితం, ఖగోళశాస్త్రం, వంటి వన్నీ ఆమె ఆధీనంలో ఉంటాయని అక్కడి జనుల విశ్వాసం. ఆమె మధురంగా శ్రావ్యంగా గానం చేసినప్పుడు భూమి దేవుడు చలించిపోయి, పారవశ్యంలో కరిగినప్పుడు భూగర్భ జలాలు ఏర్పడ్డాయని ఈజిప్షియనుల నమ్మకం. ఈ ఈజిప్టు 'సేషత్'కు భారతీయ వైదిక ధర్మంలోని చదువుల తల్లి సరస్వతికి చాలా దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయి.
ఈజిప్టు సంస్కృతి, నాగరికతలు అతి పురాతనమైనవి. వారి సంస్కృతీ సంప్రదాయాలు, పురాణాలు భారతీయ హిందూ పురాణాల కన్నా పాతవి. అలాగే పాళీ భాషలో ఉన్న బౌద్ధుల రచనలన్నీ సంస్కృతంలో రాయబడ్డ హిందూ పురాణాల కన్నా పాతవి. అంటే ఈ విషయాల వల్ల తేలేది ఏమిటీ? పాతవాటి ప్రభావం తరువాత వచ్చిన వాటి మీద తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ప్రపంచ మంతా ఒక్కటి. మానవ జాతి అంతా ఒక్కటే గనుక, ఒక ప్రాంతపు ప్రభావం మరో ప్రాంతంపై పడడమన్నది సహజం. అలా దేవుళ్ళను రూపొందించుకోవడంలో కూడా జరిగే ఉంటుంది. అందులో ఆశ్చర్యం లేదు. నిజాయితీగా ఒప్పుకోవడంతోనే మానవీయ విలువలకు గౌరవం పెరుగుతుంది. ఆదిమ జాతుల విశ్వాసాలు, భావనలు ఏ ప్రాంతానివి అయినా ప్రాథమికంగానే ఉంటాయి. అక్కణ్ణించి మనిషి ఎదుగుతూ వస్తున్నాడు. సమాజాన్ని ముందుకు తెస్తున్నాడు. ఎదిగిన సమాజంలో ఇంకా కొందరు ఎదగకుండా మిగిలిపోతున్నారు. అలాంటి వారు ఎప్పుడూ మనకు ఆదర్శం కాదు. ఎదుగుతున్న మనిషే మనకు ఆదర్శం!! కానీ, చరిత్రకూ పురాణానికీ తేడా తెలియనివాళ్ళని ఏమనాలి?
(కాషాయీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం డిగ్రీస్థాయి చరిత్ర పాఠ్యగ్రంథాల్లో హిందూ పురాణాల్ని చేరుస్తున్న సందర్భంగా...)
- డాక్టర్ దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.