Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈమధ్యనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం అవకాశం ఇవ్వగా, సుమారు 25లక్షల లేఅవుట్లు రెగ్యులరైజేషన్కు సమర్పించబడినవి. ఇప్పటికే అనేకం రెగ్యులర్ చేయబడినవి. అనేక కొత్త లేఅవుట్లు విచ్చలవిడిగా వెలుస్తున్నవి. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల ఏ రహదారి వెంట చూసినా లేఅవుట్లు కనిపిస్తున్నవి. గతంలో ఇప్పటికీ రెగ్యులర్ అయిన వాటిని కూడా కలిపిచూస్తే సుమారు 50లక్షల లేఅవుట్లు ఉన్నాయను కుంటే, మొత్తంగా 40కోట్ల ప్లాట్లు ఉన్నట్టు. ప్లాట్లకు మూడు అంతస్తుల చొప్పున, అంతస్తుకు ఐదుగురు చొప్పున లెక్కిస్తే 600 కోట్ల మంది నివాసం ఉండవచ్చు. అంటే సుమారుగా నేటి ప్రపంచ జనాభా అంతటికీ సరిపోయే ఇండ్ల స్థలాలను రడీ చేశామన్నమాట. మన రాష్ట్ర జనాభా 4 కోట్లనుకుంటే అది రెట్టింపు కావటానికి సుమారు 60సంవత్సరాలు పడుతుంది. ఆ లెక్కన ఇప్పుడున్న ప్లాట్లన్నీ జనావాసాలుగా మారటానికి కనీసం 450 సంవత్సరాలు పడుతుంది. అంటే రాబోయే 450-500 సంవత్సరాలకు సరిపోయే ముందుచూపుకు మురిసిపోవాలా, లేక మన ప్రభుత్వం ఇంత ఆలోచనా రహితంగా, లక్షల, కోట్ల ఎకరాలను ఇండ్ల లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చి దుర్వినియోగం చేస్తున్నందుకు బాధపడాలా? ప్రతి లేఅవుట్లో ఉన్న గుట్టలు, బండలు తీయటం, చదును చేయటం, కంప చెట్లు నరకటం, రోడ్లు వేయటం, సరిహద్దురాళ్ళు పాతటం, చుట్టూ ఫెన్సింగ్, ప్రహరీయో నిర్మించటం, ప్రవేశ ఆర్చిద్వారాలు ఏర్పాటు మొదలైన వాటికి కోట్లలో ఖర్చు చేయటం జరుగుతున్నది. గత 30, 40 సంవత్సరాల క్రితం వేసిన లే అవుట్లు ఇప్పటికీ ఇండ్లు నిర్మించక అలాగే పడి ఉంటున్నాయి. లక్షల, కోట్ల ధనం మృతపెట్టుబడిగా మారుతున్నది. ప్లాటు కొనిపెట్టుకుంటే భవిష్యత్లో రేట్లు పెరుగుతుందని కొనిపెట్టుకోవటం జరుగుతున్నది. మంచి వ్యవసాయ, పారిశ్రామిక భూములు రియల్ ఎస్టేట్లోకి మార్చబడుతున్నవి. ఇవి చాలదన్నట్టు ప్రభుత్వాలు అడవులు, జంతువుల రక్షణ పేరుతో వందల సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ అడవులను సంరక్షించుచున్న గిరిజనులను వెళ్ళగొడుతూ, లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లను నాశనం చేసే రియల్ ఎస్టేట్ వెంచర్లకు పర్మిషన్లు ఇవ్వడం ప్రణాళికా రహితం, బాధ్యతారాహిత్యం.
- తుమ్మల మోహనరావు, మదీనాగూడ, హైదరాబాద్.