Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశంలో కరోనావ్యాధి ఉధృతం అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 'సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)' మే నెల 4 నుంచి నిర్వహించాల్సిన పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి, పన్నెండవ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే నెల ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలను వాయిదా వేసి, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను, మే నెల 17 నుంచి ప్రారంభం కావాల్సిన పదవ పరీక్షలను రద్దు చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు కూడా అదే విధమైన నిర్ణయాలు చేయడం జరిగింది. వీటి కొనసాగింపుగా నీట్ పీజీ, జీ మెయిన్ పరీక్షలు రీషెడ్యూల్ అవుతున్నాయి. ఐసీఎస్సీ, ఐఎస్సీ పరీక్షలు కూడా అదే వరసలో నిలిచాయి. ఈ విధంగా దేశంలోని అత్యధిక బోర్డు పరీక్షలు రద్దు లేదా వాయిదా వేయడం జరుగుతోంది. కాగా ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు మాత్రం పరీక్షల నిర్వహణకే సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామంలో ముఖ్యంగా రెండు విషయాలు చర్చనీయంగా ఉన్నాయి.
ఒకటి, పరీక్షలను రద్దు చేయడం వలన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుంది కదా! అనే వాదన, దానికి ప్రతిగా పరీక్షల కన్నా ప్రాణాలు ముఖ్యం అనే వాదన కూడా ఉంది. కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తోంది. అమెరికా తర్వాత భారతదేశంలోనే రోజువారీ కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. కరోనా టెస్టులు పరిమితంగా జరుగుతుంటేనే పరిస్థితి ఇలా ఉంది. ఇంక విస్తారంగా జరిగితే కేసుల సంఖ్య భయంకరంగా మారే అవకాశం ఉంది. పెళ్లిళ్లు, పేరంటాలు, సభలు, ర్యాలీలు, మతపరమైన వేడుకలు, బార్లు, వైన్ షాపులు, సినిమా హాళ్లు వగైరా వాటికిలేని ప్రమాదం విద్యాలయాలు నడిస్తేనే వస్తుందా అనే ఆక్షేపణ కూడా ఉంది. వాటిని అన్నింటినీ నియంత్రించాల్సిందే. కానీ వాటితో విద్యాలయాలను పోల్చడం సరైందికాదు. వాటిలో పాల్గొనే వారి భద్రతా బాధ్యత ప్రభుత్వం కన్నా సంబంధిత వ్యక్తులదే ఎక్కువ. కానీ భావిభారత పౌరులైన విద్యార్థుల భద్రతా బాధ్యత తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం పైన ఉన్నది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు, కళాశాలలు నామ మాత్రంగా కొన్ని రోజులు మాత్రమే పని చేసాయి. తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి 24 వరకు 43 రోజులే పనిచేసినవి. ఆన్లైన్ విద్య కొన్ని ప్రయివేట్ కార్పొరేట్ స్కూళ్ల విద్యార్థులకు తప్ప ప్రభుత్వ పాఠశాలలు, బడ్జెట్ స్కూళ్లలోని ఎక్కువమంది విద్యార్థులకు అందనేలేదు. సిలబస్ పూర్తి కాలేదు. ఈ పరిస్థితిలో పరీక్షలు నిర్వహిస్తే ఒరిగేదేముంది? పరీక్షలు నిర్వహించకపోయినా ప్రమోట్ చేయకతప్పదు. అందుకనే ''ఆబ్జెక్టివ్ క్రైటేరియా'' ప్రాతిపదికన ఫలితాలు ప్రకటిస్తామని సీబీఎస్ఈ అదే విధంగా ఎస్ఎస్సీ బోర్డులు ప్రకటించాయి. అయితే అవి చెప్పే 'ఆబ్జెక్టివ్ క్రైటేరియా'' అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా లేదా అనేదే సందేహం. క్రైటేరియా ఏదైనా విద్యార్థుల ప్రతిభా పాటవాలకు న్యాయం చేసే విధంగా ఉంటే చాలు.
రెండవ విషయం, పరీక్షలు రద్దు చేయడం వలన ప్రయివేటు పాఠశాలలు ముఖ్యంగా లో ఫీ బడ్జెట్ స్కూల్స్, వాటిలో పని చేసే సిబ్బందికి సంబంధించింది. ఈ సమస్యను కూడా ప్రభుత్వం సముచిత రీతిన పరిష్కరిస్తే బాగుంటుంది. పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన జరగక పోవడంతో ఫీజులు వసూలు కానందున యాజమాన్యాలు ఆదాయం కోల్పోయాయి. ఎంతోకొంత వసూలైనా అది అద్దెలు, కరెంట్ బిల్లులు, ట్యాక్సులు, మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా సరిపోక ఇబ్బంది పడుతున్న స్కూళ్ళు చాలా ఉన్నాయి. కార్పొరేట్ స్కూళ్లతో సమానంగా మిడిల్ రేంజ్ ప్రయివేటు స్కూల్స్ మాత్రమే ఆన్లైన్ బోధన పేరుతో పూర్తి స్థాయిలో ఫీజులు వసూలు చేసుకున్నాయి. దాదాపు 90 శాతం ప్రయివేటు పాఠశాలలు ఏడాది పైగా తమ బోధనా సిబ్బందికి జీతాలు చెల్లించలేక పోయాయి. అత్యధికమంది ఉపాధ్యాయులు 'బతకలేని బడి పంతులు' సామెతను ఎదుర్కొన్నారు. అనేక కుటుంబాలు పస్తులతో రోజులు గడుపుతూ దీనావస్థలో కుమిలి పోతున్నాయి. మిగులు ఆదాయాలు ఉన్న యాజమాన్యాలు కూడా కనీస వేతనాలు కూడా ఇవ్వకుండా ఉపాధ్యాయులు, సిబ్బందిని గాలికి వదిలేసినవి. ఆన్లైన్ పాఠాలు బోధించిన కొద్దిమంది ఉపాధ్యాయులకు మాత్రమే ఎంతోకొంత చెల్లించాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ప్రయివేటు పాఠశాలల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కుటుంబాలను ఆదుకోవడానికి నెలకి రెండు వేలు రూపాయల నగదు, ఇరవై ఐదు కిలోల సన్న బియ్యం సాయం చేయడం ఒక నూతన పరిణామం. విద్యాహక్కు చట్టం సెక్షన్ 12(1)(సి)ని అమలు చేసినా లేదా ఆంధ్రప్రదేశ్ లాగా పాఠశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయం చేసే పథకం లాంటిది అమలు చేసినా పరోక్షంగా ప్రయివేటు బడ్జెట్ స్కూళ్లకు మేలు జరిగేది. ఫీజులు, పాఠశాలల నిర్వహణ తదితర విషయాల్లో ఎలాంటి నియంత్రణకు అంగీకరించకుండా యాజమాన్యాలు నియంతృత్వంగా వ్యవహరించడంతో తల్లిదండ్రుల తోడ్పాటును, ప్రభుత్వ మద్దతును పొందలేక పోతున్నాయి. ఫీజులు వసూలు చేసుకోవడానికి పాఠశాలలను పని చేయించాలని, ఫీజులు చెల్లించకపోతే మార్కులు అప్ గ్రేడ్ చేసేది లేదని, పరీక్షల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకించడం వంటి యాజమాన్యాల వైఖరి అసహనంగా మారుతోంది. కోవిడ్ ప్యాండమిక్ విపత్కర పరిస్థితుల్లో బోర్డు పరీక్షలు రద్దు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లే ప్రయివేట్ విద్యాలయాలను నియంత్రించే చర్యలను కూడా ప్రభుత్వం చేపడితే భవిష్యత్ విద్యారంగానికి భరోసా కలుగుతుంది.
- నాగటి నారాయణ
సెల్:9490300577