Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సంస్థల విధ్వంసం అప్రతిహతంగా కొనసాగుతోంది. దీన్ని వివరించడానికి, భారత ఎన్నికల కమిషన్ (ఈసీ)కు మించిన ఉదాహరణ మరొకటి అవసరం లేదు. కేరళ నుంచి ఖాళీగా వున్న మూడు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలపై ఈసీ అనుసరిస్తున్న వైఖరి ఒక స్పష్టమైన వాస్తవాన్ని మన ముందుకు తీసుకువచ్చింది. మోడీ ప్రభుత్వ అభీష్టానికి అనుగుణంగా కమిషన్ నడుచుకుంటుందన్నదని దీనితో వెల్లడైంది. ఒక రాష్ట్రం నుంచి ఎగువ సభకు ఉన్న ఖాళీలను భర్తీ చేయడమనే సాధారణ ప్రక్రియ విషయమై ఈసీ అనుసరిస్తున్న వింత వ్యవహార శైలి మొత్తంగా ఈ విషయాన్ని విశదీకరిస్తోంది.
ఏప్రిల్ 12న ఎన్నికలు జరుగుతాయని తొలుత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కానీ, కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ పంపిన ఒక ప్రస్తావనను పరిశీలించేందుకుగాను ఎన్నికల క్రమాన్ని ఆపుతున్నట్లు వారంరోజుల తర్వాత ప్రకటించింది. ఎన్నికలను ఇలా నిలిపివేయడంపై ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కేరళ అసెంబ్లీ కార్యదర్శి, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతమున్న అసెంబ్లీ సభ్యుల హక్కును కాలరాయవద్దని వారు వాదించారు. సభ్యుల పదవీ కాలం ముగియడానికి ముందుగానే ఎన్నికలను నిర్వహిస్తామని ఈసీ తరపు న్యాయవాది తొలుత కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, దాన్ని రికార్డు చేయమని ఆదేశించేసరికి వెనుకంజ వేశారు. కొత్త అసెంబ్లీ కోసం ఏప్రిల్ 6న ప్రజలు ఓటు వేసిన నేపథ్యంలో ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని సూచిస్తూ కేంద్ర న్యాయ మంత్రిత్వశాఖ పంపిన లేఖను... ఆ తర్వాత జరిగిన విచారణలో ఎన్నికల కమిషన్ ఉదహరించింది. కేంద్రం చేసిన సూచనను తాము ఆమోదించామని ఈసీ రాతపూర్వకంగా అంగీకరించింది. హైకోర్టు ఈ వైఖరిని తోసిపుచ్చింది. మే 2న ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేలోగా ఎన్నికలు నిర్వహించాలని ఈసీని ఆదేశించింది. ఆ రకంగా మూడు సీట్లలో రెండింటిని గెలిచేందుకు ఎల్డీఎఫ్కు గల అవకాశాలను హరించాలని మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని కోర్టు భగం చేసింది.
మోడీ ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించేందుకు ఈసీ ఎంత దూరమైనా వెళుతుందనేది ఈ అధ్యాయంతో రుజువైంది. ప్రభుత్వ అవసరాలను ఎన్నికల కమిషన్ నెరవేర్చడమనేది ఇంతకుముందే ప్రారంభమైంది. 2019 ఏప్రిల్-మే మాసాల్లో లోక్సభ ఎన్నికలతో పాటుగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈసీ తీసుకున్న నిర్ణయం ఇటువంటిదే. లోక్సభ ఎన్నికలతో పాటుగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను నిర్వహించరాదని ఈసీ నిర్ణయించింది. ఆ రాష్ట్రం 2018 నవంబరు నుంచి రాష్ట్రపతి పాలనలో ఉంది. అందువల్ల లోక్సభతో పాటే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని భావించడం సహజమే. కానీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించకపోవడానికి భద్రతాపరమైన కారణాలను ఈసీ పేర్కొంది.
ఈ చర్య తాలూకు పర్యవసానాలు వెనువెంటనే కనిపించాయి. లోక్సభ ఎన్నికలు ముగిసిన మూడు మాసాల కాలంలోనే మోడీ ప్రభుత్వం 370వ అధికరణను రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీకి తెలియచేయాల్సిన రాజ్యాంగబద్ధమైన ఆవశ్యకతను కూడా చాలా తెలివిగా తప్పించారు. ఎందుకంటే అక్కడ గవర్నర్ పాలన ఉంది. అసెంబ్లీ స్థానంలో ఉన్న గవర్నర్తో సంప్రదిస్తే సరిపోతుంది కాబట్టి అలా చేశారు. కేవలం భద్రతాపరమైన అవరోధాలను సాకుగా చూపించి ఆ నిర్ణయం తీసుకున్నట్టు అప్పటికి కనిపించినా, మోడీ ప్రభుత్వ విస్తృత ప్రయోజనాలను నెరవేర్చడమే దాని వెనకున్న ఉద్దేశం.
ఎన్నికల బాండ్లకు సంబంధించి ఈసీ వైఖరి ఇందుకు మరో ఉదాహరణ. 2017లో, ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని రూపొందించినప్పుడు, రాతపూర్వకంగా తమ అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందిగా ఈసీని కోరింది. ఈసీ ఈ పథకంపై తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల నిధులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పారదర్శకతపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని కలగచేస్తుందని హెచ్చరించింది. అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా, రాజకీయ పార్టీలకు నిధులు అందించేందుకు భారత్లో పని చేస్తున్న విదేశీ కంపెనీలను అనుమతిస్తూ చట్టానికి సవరణ తీసుకురావడంపై కూడా ఈసీ అభ్యంతరం వెలిబుచ్చింది. అయితే, మరో విడత బాండ్ల విడుదలపై స్టే ఇవ్వాలంటూ గత నెలలో సుప్రీంకోర్టు ముందుకు ఒక పిటిషన్ వచ్చింది. ఆ స్టే ఇచ్చేందుకు ఈసీ తిరస్కరించింది. ఎన్నికల బాండ్లకు తాము వ్యతిరేకం కాదని, తమకు మాత్రం పారదర్శకత కావాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై ప్రధాన పిటిషన్లను విచారించే సమయంలో ఈ పారదర్శకతా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ పథకం పట్ల తన తీవ్ర అభ్యంతరాల విషయమై ఈసీ మరోసారి రాజీ పడింది.
పశ్చిమ బెంగాల్లో 8దశల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ఈసీ వ్యవహార శైలి వివాదాస్పదంగానే ఉంది. నలుగురు మరణించడానికి దారి తీసిన సీతల్కుచి ఘటనలో రాష్ట్ర పరిశీలకులు అందచేసిన తప్పుడు నివేదిక ఆధారంగా కేంద్ర బలగాల తప్పేమీలేదని తేల్చి చెప్పింది. వాస్తవంగా జరిగిందేమిటో నిర్ధారించుకోవడానికి సైతం కమిషన్ ప్రయత్నించలేదు. ఇక బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్షా నేతృత్వంలో తన సహజ ధోరణిలో కఠినమైన, రెచ్చగొట్టే మతోన్మాద ప్రచారాన్ని చేపట్టింది. 2019 లోక్సభ ఎన్నికల్లో జరిగినట్టుగా, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినందుకు బీజేపీ అగ్ర నాయకులెవరిపైనా ఈసారి కేసులు నమోదు కాలేదు. ఇందుకు విరుద్ధంగా మమతా బెనర్జీ చేసే ప్రసంగాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నాయంటూ ఆమె ఎన్నికల ప్రచారంపై 24 గంటల నిషేధం విధించారు.
స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు జరగడానికి ముందు కావాల్సింది నిష్పాక్షికంగా వ్యవహరించే ఎన్నికల కమిషన్. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడం దాని బాధ్యత. నేరస్తులను కఠినంగా ఎదుర్కొనాల్సి ఉంది. అన్ని స్థాయిల్లో ప్రభుత్వ జోక్యాన్ని ప్రతిఘటించాల్సి ఉంది. లేనిపక్షంలో, ఈ విషయమై దశాబ్దాలుగా విశ్వసనీయమైన రికార్డు ఉన్న కమిషన్ ప్రస్తుతం ఆ పేరుప్రతిష్టలను కోల్పోయే ప్రమాదం ఉంది. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులకు కమిషన్ బాగా అలవాటు పడినట్లుంది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో, ఎన్నికల కమిషనర్లలో ఒకరైన అశోక్ లావాసా స్వతంత్ర ఆలోచనా దృక్పథాన్ని ప్రదర్శించారు. మోడీ, అమిత్ షాలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల్లో కమిషన్ తీసుకున్న నిర్ణయాలపై దాదాపు ఐదుసార్లు తన అసమ్మతిని నమోదు చేశారు. ఆ తర్వాత లావాసా భార్య, కుమారుడు, సోదరి అందరూ ఆదాయ పన్ను విచారణలను ఎదుర్కొంటున్నారు. వీటి గురించి మీడియాలో బాగా ప్రచారమైంది కూడా. 'ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్'లో పదవిని ఆమోదించి, 2020 జులైలో కమిషనర్గా లావాసా రాజీనామా చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్గా సునీల్ అరోరా రిటైరయ్యారు. లావాసా వైదొలగనట్లయితే ఆయనే సీఈసీ అయివుండేవారు. స్వతంత్ర, స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థగా నడవాల్సిన కమిషన్ పని తీరులో ఇది తీవ్రమైన బలహీనతను తీసుకు వచ్చింది. సీఈసీి, ఇతర కమిషనర్లను ఆ నాటికి ఉన్న ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ప్రారంభం నుంచి, సివిల్ సర్వెంట్లను లేదా సర్వీస్ నుంచి రిటైరైన వారిని కమిషనర్లుగా నియమించేవారు. ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు అనుగుణంగా, వారికి సలాములు కొట్టే సివిల్ సర్వెంట్లు ఈ పదవులను పొందడం సులభం. అన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థలను తన నియంత్రణలోకి తెచ్చుకునేందుకు మోడీ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పని చేస్తోంది. ఈసీ ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా మారే ప్రమాదముంది.
పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల నిర్వహణకు అవసరమైన పర్యవేక్షణ, దిశ, నియంత్రణ వంటి కర్తవ్యాలన్నింటినీ ఎన్నికల కమిషన్ రాజ్యాంగం లోని 324వ అధికరణం కింద రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సి ఉంది. ఈసీ ఈ విషయంలో రాజీ పడినట్టయితే, మొత్తంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది. మోడీ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ఈసీకి స్వేచ్ఛ కల్పించడం అత్యవసరం. అందుకు మొదటి చర్యగా, ఎన్నికల కమిషనర్ల ఎంపిక, నియామకం అనేది ప్రభుత్వ ఏకైక విశేషాధికారం కాకుండా చూడాలి. కమిషనర్లను ఎంపిక చేయడానికి విస్తృత కమిటీ లేదా కొలీజియాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులే కాకుండా, న్యాయ వ్యవస్థ ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు, న్యాయ నిపుణులు ఉండాలి. కేవలం సివిల్ సర్వెంట్లను మాత్రమే కమిషనర్గా చేయరాదు. ప్రముఖ న్యాయ నిపుణులు, విశిష్ట ప్రతిభావంతులు, ఇతర రంగాలకు చెందిన నిష్ణాతులు కూడా ఉండవచ్చు. కమిషన్ సమగ్రతను పరిరక్షించేందుకు సీఈసీగా లేదా కమిషనర్లుగా పదవీ విరమణ చేసినవారు మరే ఇతర ప్రభుత్వ ప్రాయోజిత పదవులను ఆమోదించకుండా నిషేధం విధించాలి. ధన బలాన్ని, పార్టీ ఫిరాయింపులను అణచివేసేందుకు, ఎన్నికల వ్యవస్థను మరింత జవాబుదారీగా చేసేందుకు అత్యవసర ప్రాతిపదికన ఎన్నికల సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. కానీ, ఇటువంటి సంస్కరణలు ఎన్నికల కమిషన్ను సంస్కరించడం నుంచే ప్రారంభం కావాల్సి ఉంది.
- 'పీపుల్స్ డెమోక్రసీ' సంపాదకీయం