Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరైనా సరే వారి వ్యక్తిగత విశ్వాసాల్ని వారి వ్యక్తిగత స్థాయిలో ఉంచుకుంటే ఎవరూ విమర్శించాల్సిన పనిలేదు. వారి పైత్యాన్ని జనం మీద రుద్దితేనే గొడవ. అలాగే వైజ్ఞానిక స్పృహ అనేది వ్యక్తిగత విశ్వాసం కాదు. అది విశ్వమానవుల వాస్తవ విశ్వాసం. ఉదాహరణకు ఎలక్ట్రిక్ బల్బు వెలగడం గురించి మీరు ప్రపంచంలో ఎక్కడైనా మాట్లాడొచ్చు. తుపానుల గురించి, రొబోట్ల గురించి, కంప్యూటర్ ప్రోగ్రాంల గురించి ప్రపంచంలో ఎవరు ఎవరితోనైనా, ఎక్కడైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు. హేతుబద్ధంగా ప్రశ్నించడం గురించి ఎవరు ఎవరితోనైనా మాట్లాడుకోవచ్చు. కానీ, మీరు శ్రీరాముడు దశరథుడికి కాకుండా పాయసానికి పుట్టడం గురించి, సీతాదేవి నాగేటి చాళ్ళలో దొరకడం గురించి... మీరు గాఢంగా విశ్వసిస్తూ ఉంటే విశ్వసించొచ్చు. కానీ, ఇతరులు కూడా మీ లాగే విశ్వసించాలంటే కుదరకపోవచ్చు. ఇక ఇతర దేశాల వారికైతే ఆ దేవుళ్ళూ, ఆ నేపథ్యం తెలిసి ఉండదు గనుక, వారికి విషయమేదీ అర్థం కాదు. ఏ గ్రీకు దేవతనో ఆరాధించేవాడు ఎక్కడో ఆ దేశంలో ఉంటే ఇక్కడ మీరు పట్టించుకోరు కదా? ఇదీ అంతే.. ఇక్కడి మీ విశ్వాసాల్ని అక్కడి వారు పట్టించుకోరు. అంతేకాదు, విశ్వాసం లేకపోతే ఇక్కడివారు కూడా పట్టించుకోరు. విషయమేదైనా సరే, సందేహనివృత్తి జరగాల్సిందే. కార్యాకారణసంబంధం బయటికి రావల్సిందే!
''రోజుకు ఐదుసార్లు 'హనుమాన్ ఛాలీసా' పఠించడం వల్ల కరోనాను దూరం చేయొచ్చు'' అని బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రకటించారు. కేవలం హిందూమతంపై ప్రేమ ఉన్నవాళ్ళని ఆకర్షించడానికి మత విద్వేషం రేకెత్తించడానికి మాత్రమే ఆ పిలుపు పనికొస్తుంది.
శ్రీరాముడి భక్తులుగా చలామణి అయినవారు చాలా మంది ఉన్నారు. ఉత్తరభారతదేశంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవాడు సంత్ తులసీదాస్. హనుమాన్ ఛాలీసా రచయితగా, 'రామ్ చరిత్ మానస్' రాసిన వాడిగా గుర్తింపు ఉంది. ఇంటిపేరు దూబె. దేశంలో వర్థిల్లుతూ ఉన్న నిచ్చెనమెట్ల సంస్కృతిలో అగ్రభాగాన ఉన్నవాడు, బ్రాహ్మణుడు. 1497-1623 సంవత్సరాల మధ్య కాలంలో సుమారు 125 సంవత్సరాలు జీవించిన వాడిగా చెపుతారు. ఉత్తర ప్రదేశ్లోని రాజాపూర్లో జన్మించాడు. అస్సీఘాట్, వారణాసిలో జీవించాడు. గోస్వామి తులసీదాస్గా ప్రసిద్ధుడు. సంస్కృత రామాయణాన్ని 'రామ్ చరిత్ మానస్'గా రాసినవాడు. సంస్కృతం, అవధి బాషల్లో రచనలు ప్రకటించాడు. వినయ పత్రిక, హనుమాన్ ఛాలీసా వంటి రచనతో ఆనాటి సమాజంలో తన అస్థిత్వాన్ని నిలుపుకున్నాడు.
మనకు ఎంతో మంది భక్త కవులున్నారు. వారి భక్తిని ఆరాధించేవారు కొందరైతే, వారి భజనల్ని, కృతుల్ని, కీర్తనల్ని భక్తితో పాడుకునేవారు కొందరు. అందులో సాహిత్య సౌరభాల్ని, పదలాలిత్యాన్ని ఆఘ్రాణిస్తూ తేలిపోయేవారు మరికొందరు. అలాగే, ఆ భక్తి సాహిత్యాన్ని లోతుగా పరిశీలించి, విశ్లేషించేవారు కూడా కొందరుంటారు. అయితే వాళ్ళను - వారు జీవించిన కాలానికే పరిమితం చేసి చూస్తే మంచిది. అంతేగాని, విషయాన్ని సర్వకాలాలకూ అన్వయించగూడదు. కొన్ని వాస్తవాల్ని వాస్తవాలుగా ఒప్పుకోగలిగే ధైర్యముంటేనే మనం ముందుకు పోగలం. మాకు ఇలాగే బావుంది. మేమిక్కడే ఉంటాం. అని ఎవరైనా గతంలోనే ఆగిపోదలిస్తే, అది వారి ఇష్టం! నేనిక్కడ భక్తకవి తులసీదాసు గౌరవాన్ని తగ్గించి చూపాలని ప్రయత్నించడం లేదు. కేవలం వాస్తవాలు తెలియజేస్తున్నాను. అవి తెలుసుకున్న తర్వాత కూడా... ఆయనొక మహానుభావుడు, సమాజ ఉద్దారకుడు అని ఎవరైనా భావిస్తే, అది వారి ఇష్టం. అయితే తటస్థంగా ఉండేవారు, విషయాల్ని హేతుబద్ధంగా విశ్లేషించుకోగలిగేవారు కూడా అనాలోచితంగా మనువాదుల ప్రభావంలో పడికొట్టుకు పోగూడదని అనుకోవడంలో తప్పు లేదుకదా? విషయం ఏదైనా, ఏ కాలం నాటిదైనా, ప్రజాహితంగా ఉందా? ప్రగతిశీలంగా ఉందా? అని బేరీజు వేసుకోకుండా దేనినీ ఒప్పుకోగూడదు. ఊరికే కల్పనల్లో, ఇతరుల భ్రమల్లో మనం పడి కొట్టుకుపోగూడదు. ఎందుకంటే గంగానది స్వచ్ఛత, పవిత్రత మనువాదుల రచనల్లో కనిపించడం తప్పితే, ఎప్పుడైనా మనకు అందులో స్వచ్ఛ జలాలు కనిపించాయా? అందువల్ల, వాస్తవాలు తెలుసుకోవడం, మాట్లాడుకోవడం ఆరోగ్యానికి మంచిది.
తులసీదాస్కు రాముడిపై విశ్వాసమున్నట్టే, తులసీదాసు గురించి కూడా కొన్ని విశ్వాసాలు జనంలో ప్రచారమ య్యాయి. భక్తి పేరుతో మూఢనమ్మకాలు తలకెక్కితే, ఎలాంటి భ్రమలు వ్యాపిస్తాయో గమనించండి. గంగానది ఒడ్డున సంకట్ మోచన్ గుడి ఉంది. అది ఆంజనేయుడి గుడి. ఆ గుడి ఉన్నచోటే తులసీదాసుకు ఆంజనేయుడు ప్రత్యక్షమయ్యాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇప్పటికీ గంగానది ఒడ్డున తులసీఘాట్ ఉంది. తులసీదాస్ను వాల్మికి మహర్షి అవతారంగా కూడా భావిస్తారు. వాల్మికి రచించిన రామాయణానికి రామభక్తుడైన ఆంజనేయుడు పరవశించి - వాల్మికి కలియుగంలో మళ్ళీ పుట్టి రామకథను గానం చేసేట్టు వరం ఇచ్చాడనీ, అందువల్లనే వాల్మికి మళ్ళీ తులసీదాసుగా పుట్టి, రామభక్తుడై 'రామ్ చరిత్ మానస్'ను గానం చేశాడని మరోకథ ప్రచారంలో ఉంది. ఈ విషయం భవిష్యోత్తర పురాణం - ప్రతి సర్గ పర్వం 4.21లో ఉన్నట్టు నబదాస్ చెప్పాడు. ఈయన తులసీదాసు సమకాలికుడు. తులసీదాసును వాల్మికి అవతారంగా భావించి, ఆ విషయాన్ని ఆరు చరణాల కవితగా రాసి ప్రచారం చేశాడు. కథల మాట, విశ్వాసాల మాట ఎలా ఉన్నా తులసీదాసు ఆలోచనలు ఎలా ఉండేవి? ఆయన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆయన ఎంత బాధ్యతగా వ్యవహరించారో చూద్దాం. ఆయన జీవించిన కాలం చూస్తే అది భారతదేశాన్ని మొగలులు పాలించినప్పటి కాలం. అయోధ్యలో శ్రీరామచంద్రుడి భవ్యమందిరాన్ని కూలగొట్టి, ఆ స్థలంలో బాబ్రీ మసీదు కట్టారని ఒక వాదన ఉందికదా? మరి తులసీదాసు రచనల్లో ఆ రామాలయం గురించిన ప్రసక్తి ఎందుకు లేదూ? దాన్ని కూలగొట్టడానికి కుట్రలు, కుతంత్రాలు జరిగితే అవి అన్నీ రామభక్తుడైన తులసీదాసు ఎలా ఓర్చుకున్నాడూ? నిజంగా ఆయన జీవించి ఉన్న కాలంలో అలాంటివి జరిగితే, ఆయన ఎక్కడో ఓ చోట వెళ్ళగక్కేవాడే కదా? మరి ఆయన రచనల్లో ఆ ఊసే లేదెందుకూ? ఆయనకు ముందూ వెనక తరాల్లో ఎవరూ కూడా ఆ భవ్య రామాలయం గురించి ఎందుకు రాయలేదు. మనకు ఉన్న ఎన్నో పుక్కిటి పురాణాల్లాగే ఈ అయోధ్య రామాలయం కూడా ఒక కట్టుకథేనని అనిపిస్తుంది. పైగా ఒక పథకం ప్రకారం బాబ్రీ మసీదును కూల్చిన తర్వాత, హిందూ దేవాలయ అవశేషాలు బయటపడాలి కదా? పడలేదు. బౌద్ధవిహారాలకు సంబంధించిన ఆనవాళ్ళు బయటపడ్డాయి. అదంతా వేరే విషయం!
ఇక తులసీదాసు రచించిన దోహాలలో (కవితా పంక్తులలో) ఆయనకు ఉన్న సామాజిక బాధ్యత ఏపాటిదో, అవి ఈ కాలానికి ఎంతవరకు పనికొస్తాయో పరిశీలిద్దాం...
జో వర్న్ ధమ్ తేలీ కుమ్హారా!
స్వపచ్ కిరాత్ కౌల్ కల్వారా!!
(రామచరిత్ మానస్: పుష్ట్ 1029 దోహ:129 ఛంద్: 1 ఉత్తరాఖండ్)
దీని అర్థం ఏమిటంటే తేలీ, కమ్హారా, సఫాయి, కర్మచారీ, ఆదివాసీ, కౌల్, కల్వార్ మొదలైన వారంతా అత్యంత నీచ వర్ణాలకు చెందినవారు.
అధమ్ జాతీమె విదూయ పారు!
భయ హూు తథా ఉన్హీ దూద్ పిలాయ!!
(రామచరిత మానస్ : పుష్ట్ 986 దోహ: 99 చంద్ : 3 ఉత్తరాఖండ్)
పాముకు పాలుపోస్తే అది మరింత బలపడి విషం చిమ్ముతూ మరింత ప్రమాదకారి ఎలా అవుతుందో, నీచ జాతివారికి 'విద్య'నందిస్తే వారు కూడా అలాగే విషం చిమ్ముతూ ప్రమాదకారులవుతారు.
అభీర్, యవన్, కిరాత్, ఖల్!
స్వపచాదీ అతీ అథరూప్ జో!!
(పుష్: 338 దోహ:12 ఛంద్:2 అయోధ్య కాండం)
అభీర్ అంటే యాదవులు. యావన్ అంటే బయటి దేశాల నుంచి వచ్చిన ముస్లింలు, క్రైస్తవులు వగైరా ఇంకా ఆదివాసీలు, కర్మచారి మొదలైన వారంతా పరమ పాపులు, నీచులు.
తులసీదాస్ సదా హరిచేరా!
కీ జౌ నాథ్ హృదరు మహడేరా!! (40)
తులసీదాస్ ఎల్లప్పుడూ శౌర్యవంతుడైన రాముడి దాసుడు. అందుకని మీరు అతడి (తులసీదాసు) హృదయంలో నివాసముండండి. (ఇక్కడ తులసీదాసు తనని తాను ప్రమోట్ చేసుకుంటున్నాడు)
ఇలాంటి గ్రంథాలు ఇంతకాలం దాకా ఎలా ఉన్నాయీ? అని ఎవరికైనా అనుమానం రావడం సహజం. అలా ఎందుకయ్యిందంటే కొంతమంది అగ్రవర్ణాలవారు తప్ప, మిగతా వారెవరూ ఆ గ్రంథాలు చదవడానికి వీలయ్యేది కాదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేదాకా దేశంలో విద్యావంతులు అతి కొద్దిమందే ఉండేవారు. ఆ 'పవిత్ర' మత గ్రంథాలు దేవుడిచ్చినవని అబద్దాలు చెప్పి, సమాజంలోని అధిక సంఖ్యాకులకు దూరంగా ఉంచారు. పొరపాటున ఎవరైనా చదవడానికి ప్రయత్నిస్తే.. వారి నాలుకలు కోసేవారు. దేశంలోని అధిక సంఖ్యాకులు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడి పోవడానికి అగ్రవర్ణాల కుట్రే కారణం! దేవుణ్ణి, భక్తిని, పునరన్జన్మల్ని అలాగే సంస్కృత భాషని కాపాడే కర్తవ్యం కేవలం తమదేనని మిగతావారి మీద ఆధిపత్యం సాగించారు. ఇంకా సాగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు.
బ్రిటిషు కాలంలో విద్య అందరికీ అందుబాటులోకి రావడం వల్ల, పవిత్ర గ్రంథాల కుట్ర బయటపడుతూ వచ్చింది. మరో ముఖ్యమైన విషయమేమిటంటే బౌద్ధాన్ని, బౌద్ధ గ్రంథాల్ని, పాళీ భాషను నాశనం చేసి, వైదిక ధర్మాన్ని, సంస్కృతాన్ని నిలబెట్టాలనుకున్న హిందూ అగ్రవర్ణంవారు, దేశంలో సంస్కృతం వినిపించకుండా పోవడానికి కారకులయ్యారు. 'పామరులు' నేర్చుకుని ఎక్కడ తెలివి మీరుతారోనని విద్యను దాచిపెట్టుకున్నారు. మరో పక్క దేశంలో మొగలుల, బ్రిటిషర్ల పరిపాలన సాగడంతో ఉరుదూ, ఫారసీ, హిందీ, అరబిక్, ఇంగ్లీషు భాషలు వ్యాప్తి చెందాయి. వారి మతాలు కూడా వ్యాపించాయి. సంస్కృతం బ్రాహ్మణుల మంత్రాల్లో తప్ప ఎక్కడా వినిపించకుండా పోయింది. ప్రజాస్వామ్య భావన లేకపోవడం వల్ల భాషలు కూడా నాశనమవుతాయని చెప్పడానికి ఇదొక ఉదాహరణ! ఇప్పుడు మళ్ళీ సంస్కృతాన్ని బతికించడానికి మనువాద పాలకులు వ్యర్థ ప్రయత్నాలు చేస్తూ ఉండటం హాస్యాస్పదం. ''దేవుని వాక్కులుగా ప్రచారం పొందుతున్న గ్రంథాలు ఆకాశం నుంచి ఊడిపడలేదు. అవి మన పూర్వీకుల అసమగ్ర జ్ఞాన ఫలితం'' అని అన్నాడు రాబర్ట్ గ్రీన్ ఇంగర్వాల్స్. స్వేచ్ఛాలోచన కోసం కృషి చేసిన అమెరికన్ రచయిత. తులసీదాసా, సూర్దాసా ఎవరైనా కావొచ్చు. ప్రగతిశీల భావాలతో ఉన్న విషయాలనే ఈ తరం స్వీకరిస్తుంది. వదిలేయాల్సి వస్తే నిర్దాక్షిణ్యంగా వదిలేస్తుంది. అంతే!!
డా||దేవరాజు మహారాజు
వ్యాసకర్త: సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త.