Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుప్రీం కోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ ప్రమాణ స్వీకారం చేశారు. 2013లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ రమణ అంతకుముందు ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా, తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అత్యున్నత న్యాయస్థానంలో ఎనిమిదేండ్ల పాటు బాధ్యతలు నిర్వహించిన ఆయన సీజేఐ (చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా)గా ఏప్రిల్24 నుంచి 2022 ఆగష్టు 26 వరకూ పదహారు నెలల పాటు పదవిలో ఉంటారు. ఏప్రిల్ 23న సీజేఐగా పదవీ విరమణ చేసిన బాబ్డే సీనియారిటీ ప్రకారమే 48వ న్యాయమూర్తిగా ఆయనపేరును సిఫార్సు చేశారు. సుప్రీం న్యాయమూర్తులలో అత్యంత సీనియర్ను నియమించడం సంప్రదాయమైనా సరే నెల రోజుల ముందుగా తన తదుపరి సీజేఐ పేరు సిఫార్సు చేయడం ఆనవాయితీ. ఏ కారణం చేతనైనా సీనియార్టీ ప్రకారం ఉన్నవారిని నియమించలేని పరిస్థితి వస్తే ముందే చర్చ చేయవలసి ఉంటుంది. జస్టిస్ రమణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొన్ని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కొంత ఆసక్తి నెలకొన్నప్పటికీ ఆయన నియమాకం తథ్యమని ముందే స్పష్టమైంది. సుప్రీం కోర్టులో ఖాళీల భర్తీపైన, కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగరత్నను సుప్రీంకు తీసుకువస్తే 2027లో తొలి మహిళా న్యాయమూర్తి అవుతారనే అంశంపైన చర్చ జరిగింది తప్ప తదుపరి సీజేఐ గురించి కొలీజియంలో భిన్నాభిప్రాయాలు వచ్చినట్టు కనిపించదు. తెలుగు వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావడం ఇది రెండోసారి. యాభై ఏండ్ల కిందట జస్టిస్ కోకా సుబ్బారావు కూడా సీజేఐగా పనిచేశారు. అయితే రాష్ట్రపతిగా పోటీచేసేందుకై ఆయన ఏడాది తిరక్కుండానే రాజీనామాచేశారు,
ఆరోపణల తోసివేత
జస్టిస్ రమణ పేరును సిఫార్సు చేసిన సుప్రీం కోర్టు అదే సమయంలో ఆయనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆరోపణలను తోసిపుచ్చినట్టు ప్రకటించింది. ఈ విషయంలో అనుకూలంగా వ్యతిరేకంగా రకరకాల వాదోపవాదాలు న్యాయవర్గాల నుంచి వినిపించాయి. ఈ ఆరోపణల విచారణకు సంబంధించి కొన్ని కథనాలు రాగా అంతర్గత విచారణ విషయాలు ఎప్పుడూ బహిరంగపర్చబోమని చెప్పింది. అంతిమంగా ఇప్పుడు ఆ ఆరోపణలలో పసలేదని తోసిపుచ్చినట్టు ప్రకటించింది. విచారణ ప్రక్రియ జరిపి తిరస్కరించడం పారదర్శకత లేదనే విమర్శకు సమాధానంగా భావించాల్సి ఉంటుంది. అయితే ఆ ఆరోపణలను విచారించింది ఎవరు, ఏం తేల్చారనేది బయిటపెట్టి ఉండాల్సిందని సీనియర్ న్యాయవాదులు కొందరు రాశారు. ఏమైనా అది ముగిసిన అధ్యాయం.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువ్యక్తి నియమించబడటం ఇది రెండవ సారి. గతంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ పనిచేసిన జస్టిస్ కోకా సుబ్బారావు 1966-67 మధ్య సీజేగా పనిచేశారు. 1993-94లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటచలయ్య కూడా ఇప్పటి ఏపీలోని లేపాక్షిలో జన్మించిన వ్యక్తి అయినప్పటికీ అది ఆయన పుట్టినప్పుడు ఉమ్మడి కర్నాటక రాష్ట్రంలో భాగంగా ఉండేది. మన్నెపల్లినారాయణరావు వెంకటచలయ్య అన్న ఆయన పేరు కూడా అచ్చం తెలుగు వారి పేరే అయినా చదువు కర్నాటకలో సాగింది. ఈ మధ్య కాలంలో తెలుగువారు అనేకులు సుప్రీం కోర్టులో న్యాయమూర్తులుగా పనిచేసినప్పటికీ ప్రధాన న్యాయమూర్తి స్థానం దాకా పయనించే అవకాశం జస్టిస్ నూతలపాటి వెంకటరమణకే దక్కింది. ఆయన పదవీ కాలం కూడా సాపేక్షంగా చాలా మంది సీజేల కన్నా అధికంగా ఉంటుంది.
సుప్రీం ప్రతిష్టపై నీలినీడలు
చాలా దశాబ్దాల తర్వాత తెలుగువ్యక్తి ప్రధాన న్యాయమూర్తి కావడంపట్ల సంతోషం వ్యక్తమైనా సుప్రీం కోర్టు ప్రతిష్ట అత్యంత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆయన బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రధాన న్యాయమూర్తులుగా ఎస్ఎబాబ్డే, అంతకు ముందు రంజన్ గోగోరుల హయాంలో అత్యున్నత న్యాయస్థానం కేంద్రం ఒత్తిళ్లకు లోబడిపోయిందనే ఆరోపణ బలపడింది. వరుసగా ఇచ్చిన తీర్పులు మోడీసర్కారుకు సంతోషం కలిగించాయి. సీజేఐగా రంజన్గోగోరు అయోధ్య, రాఫెల్ తీర్పులు ఇచ్చారు. పదవీ విరమణ తర్వాత కొద్ది కాలానికే రాజ్యసభ సభ్యత్వం పొంది విమర్శలు మూటకట్టుకున్నారు. ఇక 2019 నవంబరులో ఎస్ఎబాబ్డే ప్రధాన న్యాయమూర్తి పదవి చేపట్టినప్పుడు కీలకమైన ఎన్నో కేసులు న్యాయస్థానం ముందు అపరిషృతంగా ఉండిపోయాయి. జమ్మూ కాశ్మీర్కు రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించి మూడు ముక్కలు కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసిన కేంద్రం నిరంకుశ చర్యను సవాలు చేస్తూ వంద పిటిషన్లు దాఖలయ్యాయి. కానీ వాటిపై పూర్తి విచారణ జరగనేలేదు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా పిటిషన్లు వచ్చాయి. ఢిల్లీతో సహా దేశవ్యాపితంగా నిరననలు సాగాయి. ముఖ్యంగా ఢిల్లీలో కుట్రపూరితంగా మత కలహాలు రగిలించి యువతను విద్యార్థులను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టారు. జామియా మిలియా విశ్వవిద్యాలయంలోనూ దాడులు జరిగాయి. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోకి గ్యాంగులు చొరబడి దౌర్జన్యం చేశాయి. ఇవన్నీకండ్ల ఎదురుగా జరుగుతున్నా పలుసార్లు కేసులు వస్తున్నా సుప్రీం కోర్టు న్యాయం చేసేందుకు చొరవతీసుకోలేదు. హత్రాస్ అత్యాచారం ఘటనలో అన్యాయంగా అరెస్టు చేయబడిన కేరళ జర్నలిస్టు సిద్దిక్ కప్పన్ కేసు వస్తే విచారించి మీడియా స్వేచ్ఛను కాపాడకపోగా ఇలాంటి కేసులు హైకోర్టుకే వెళ్లేలా తాను చర్యలు తీసుకుంటానని ప్రకటించింది. రోహింగ్యా శరణార్థులను ఆదుకునే విషయంలోనూ భారత దేశ సంప్రదాయం రాజ్యాంగ విలువలు అంతర్జాతీయ సూత్రాలను బేఖాతరు చేస్తూ జోక్యానికి నిరాకరించింది.
వివాదగ్రస్తమైన తీరు
ఇంతకంటే తీవ్రమైన విషయం ఎన్నికల బాండ్లకు సంబంధించిన కేసును పూర్తిగా పక్కన పెట్టేయడం. ప్రతి ఎన్నికల సమయంలోనూ ఆ బాండ్లపై స్టే విధించాలంటూ పిటిషన్లు వస్తూనే ఉన్నాయి. ఇవి ఎప్పటినుంచో ఉన్నాయనీ, ఈ విధమైన అభ్యర్థనలు ఇదివరకటి నుంచీ వస్తున్నాయంటూ ప్రతిసారి సుప్రీం కోర్టు ధర్మాసనం వాటిని పక్కన పెడుతూ వచ్చింది. వలస కార్మికుల దుస్థితిపై దాఖలైన వాజ్యాల విషయంలోనూ ఇదే విధమైన స్పందనా రాహిత్యం తాండవించింది. వారికోసం ఏం చేయాలనేది ప్రభుత్వానికే బాగా తెలుసంటూ కేసును చాలా కాలం సాగదీశారు. ఆఖరుకు సీజే బాబ్డే స్వయంగా వలసకార్మికులకు తిండి పెడుతున్నప్పుడు మళ్లీ ఆర్థిక సహాయం దేనికని ప్రశ్నించారు. ఇదే కాలంలో కార్పొరేట్లకు సంబంధించిన పలు కేసుల్లో సుప్రీం కోర్టు అమితాసక్తి ప్రదర్శించింది. ఢిల్లీలో రైతుల ఆందోళనను పరిష్కరించాలనే కేసులోనూ ఒక కంటితుడుపు కమిటీని వేసి కాలయాపన చేసింది. ఆ కమిటీ కూడా ప్రభుత్వ అనుకూల వ్యక్తులతో నిండి ఉండటం, ఒకరు ముందే నిరాకరించడం దాన్ని మరింత పలచన చేసింది. తీరా ఆ కమిటీ సిఫార్సులు వచ్చి చాలా కాలం గడిచినా ఎలాంటి సానుకూల చర్యలూ ఆదేశించింది లేదు. ప్రజల హక్కులను కాపాడటంలో ఈ విధంగా వ్యవహరించిన న్యాయస్థానం కోర్టు ధిక్కార కేసుల పేరిట మాత్రం ఎంతో సమయం వెచ్చించింది. అయోధ్య కేసులో 1991 ప్రార్థనాస్థలాల చట్టం ప్రాతిపదికగా చెప్పిన న్యాయస్థానం ఆ చట్టాన్నే సవాలుచేసే పిటిషన్ను అనుమతించడం మరో వైపరీత్యం. ఆ వెంటనే కాశీ, మధుర క్షేత్రాలలో వివాదాలను స్థానిక న్యాయస్థానాలు చేపట్టాయి.
న్యాయమూర్తుల నియామకం స్తంభన
కరోనా కారణంగా ఈ కాలంలో వర్చువల్ విచారణ పద్ధతి గొప్పమార్పుగా చెబుతున్నా వాస్తవంలో అనేక కేసులు విచారణకు నోచుకోకుండానే పోయాయి. కేవలం 25శాతం మాత్రమే విచారణ జరిగాయి. ఈ పరిస్థితి అనివార్యమైందనుకుంటే ఒక తీరు గాని ఇందుకు సీజేఐ బాబ్డేను పొగడ్తలో ముంచెత్తడం విచిత్రం. ఇప్పటికి వచ్చిన తీర్పులపైనే ఇంత అసంతృప్తివుండగా కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ను కూడా ప్రవేశపెట్టేందుకు కోర్టు చర్యలు సాగిస్తున్నది. వాటిపాత్రపై న్యాయమూర్తులకే స్పష్టతలేదు. ఈ మొత్తం కాలంలో సుప్రీం కోర్టుకు ఒక్క న్యాయమూర్తిని కూడా అదనంగా నియమించలేకపోవడం పెద్ద లోపం. హైకోర్టుల్లోనూ 400పైనే ఖాళీలున్నా కొలీజియం కేంద్రం పరస్పరం బాధ్యతను నెట్టివేసుకుంటూ కాలం గడిపాయి. పదవీ విరమణకు ముందురోజు సీజేఐ బాబ్డేతో కూడిన ధర్మాసనం రాజ్యాంగంలోని 224(ఎ) అధికరణాన్ని దాదాపు 60ఏండ్ల తర్వాత పునరుద్ధరించి, రిటైర్డు జడ్జిలను హైకోర్టులకు నియమించవచ్చునని ఆనుమతినిచ్చింది. క్రమబద్దమైన నియామకాలు పూర్తిచేయకపోగా ఈ విధంగా విచక్షణతో కూడిన నియామకాలు చేస్తే మళ్లీ అదెక్కడికి దారితీస్తుందోననే సందేహాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్తకంగానే సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులను తొక్కిపడుతూ ఒత్తిడికి గురి చేస్తున్నదనే అభిప్రాయం అందరిలో నెలకొంది. మాజీ సీనియర్ న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా వంటివారు ప్రధాని మోడీని అదేపనిగా పొగిడి తరించడం, రంజన్ గోగోరు రాజ్యసభకు వెళ్లడం ఆ సందేహాలను పెంచింది. తాజా మాజీ సీజేఐ బాబ్డే కూడా బహురంగాలలో ఆసక్తివున్నవారు గనక పదవీ విరమణ తర్వాత ఏదైనా చేయవచ్చునని ప్రస్తుత సీజేఐ ఎన్విరమణ వీడ్కోలు ప్రసంగంలో చెప్పడంలోనూ సంకేతాలున్నాయి.
భవిష్యత్ గమనం?
సీజేఐగా ఎన్వి రమణ పదవీ కాలం సాపేక్షంగా చాలా మంది కన్నా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. రాజకీయ నాయకులపై ప్రజాప్రతినిధులపై కేసులసు వేగంగా పరిష్కరించాలన్నది గతంలో జస్టిస్ రమణ తీసుకున్న కీలక నిర్ణయం. పేదలకు కూడా న్యాయసహాయం సమానంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నది ఈ సిపార్సుకు ముందు రోజు ఆయనచేసిన ప్రసంగం. నదీ జలాల వివాదాలు రాష్ట్రాల హక్కులకు సంబంధించి కూడా ఆయన తీర్పులను ప్రస్తావిస్తుంటారు. తెలుగు రాష్ట్రాలకే నదీజల వివాదాలు ఒకవైపు, రాష్ట్రాల హక్కులపై కేంద్రం తీవ్ర దాడి మరోవైపు సాగుతున్న ఈ కాలంలో ఆయన తీర్పుల పరంగానూ, న్యాయవ్యవస్థ నిర్వహణ పరంగానూ ఎలాంటి అడుగులు పడేది వేచిచూడవలసిందే. చట్టం వ్యవస్థపై ఆధారపడిందే గాని, వ్యవస్థ చట్టంపై ఆధారపడి ఉండదన్న కారల్మార్క్స్ మాట ప్రకారం వ్యక్తులను బట్టి మౌలిక మార్పులకు పెద్ద అవకాశముండకపోయినా న్యాయమూర్తులు చేయగలిగింది చాలానే ఉంటుంది. మసకబారిన సుప్రీం ప్రతిష్ట రీత్యా కొత్త సీజేఐ ఎన్వి రమణ ఏం చేస్తారనేది రేపటినుంచే చూడొచ్చు.
- తెలకపల్లి రవి